Importance Of Karthika Masam

కార్తీక మాస విశిష్టతలు

శివకేశవుల మాసం కార్తీకమాసం ...

విష్ణుదేవుడితో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు. కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్వితమైనది. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి. కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు  కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మిక సాధనకు అనువైన పండుగలు అని అంటారు. కార్తీకమాసంలో చేసే దీప దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. కార్తీకమాసంలో దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం చాలా శుభప్రదం.

కార్తీకమాసంలోని మొదటి రోజు నుండీ సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది. కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్ళతో స్నానం చేసిన తరువాత సూర్యాస్తమయం తరువాత సంధ్యాదీపం పెట్టడం, తులసి పూజ, గౌరీపూజ చేయడం ఈ మాసంలోని ప్రత్యేకతలు. కార్తీకమాసంలో కార్తీక శుద్ధనవమిని అక్షయ నవమిగా, తరువాత వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ధిద్వాదశి అని, కార్తీక శుద్ధ త్రయోదశి రోజున స్వాయంభువ మన్వంతరం ప్రారంభమయిందని అంటారు. కార్తీక శుద్ధ చతుర్థశిని మహాకార్తి అని కూడా అంటారు. అలాగే కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు. కార్తీక బహుళ ఏకాదశి రోజున బోధనా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తికదామోదర ప్రీత్యర్థం' అని ఆచరించాలని శాస్త్రోక్తి. శరదృతువులో నదీప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది, అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు. కార్తీకమాసంలో మానసిక శారీరక రుగ్మతులను తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ప్రముఖమైనది, పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నయమవుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కార్తీకమాసం సూర్యోదయానికి పూర్వమే విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలం, కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేసేవానికి సర్వతీర్థ స్నానఫాలం, అర్చనా ద్రవ్యాలను సమర్పించి వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి ఈ ఫలాలలో ఆరవవంతు ఫలం లభిస్తుంది. సూర్యోదయకాలంలో నిద్ర మేల్కొని విష్ణు, శివాలయాలలో భగవంతుణ్ణి ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వల్ల వేల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది. విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో ఇతర దేవాలయాలలో లేకపొతే రావిచెట్టు మొదట్లో గాని, తులసీవనంలో గాని ఉండి భాగవత్ స్మరణ చేయాలి. ముఖ్యమైన సూచన ఏమిటంటే తడిబట్టలతో దీపారాధన చేయకూడదు అలాగే శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో స్త్రీలు తులసిచెట్టు ముందు ప్రతిరోజూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి. తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయని అంటారు.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా

యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్

అని శ్లోకం చదువుతూ భక్తితో తులసికి నమస్కరించాలి. కార్తీకమాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి చంద్రని అనుగ్రహం పొందడానికి అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుని ఆరాధించాలి.

కార్తీకమాస సోమవారాలు ...

శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోవారాలు స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వమేథాల ఫలాన్ని పొందుతారు. కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది. అవి ... ఉపవాసం: శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.

ఏకభుక్తం:

ఏకభుక్తం అంటే ఒక్కసారి మాత్రమే భోజనం చేయాలన్నమాట. ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

నక్తం:

పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి. అయాచితం: భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం

స్నానం :

పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు. తిలదానం: మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది. పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు అందుకే ఈ నెలలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

కార్తీకమాసంలో పాడ్యమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి. దామోదరుడైన (పద్మనాభుడైన మహావిష్ణువు)ను ఉద్దేశించి దీన్ని చేయాలి. ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడు. నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసి దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది. కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రం, గురు గ్రహం, సోమవారం కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.

శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. ఈ నక్షత్ర పురుషుని వర్ణన, విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది. నక్షత్ర పురుషునికి కృత్తికలు కటి (నడుము) స్థానంగా, మూలా నక్షత్రం పాదాలుగా, రోహిణి నక్షత్రం తొడలుగా, అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి. కాగా పూర్వాషాఢ నక్షత్రం, పురుషాఢ నక్షత్రం, ఫల్గునీ నక్షత్రాలు మర్మస్థానాలుగా, భాద్రపద నక్షత్రాలు భుజాలుగా, రేవతి నక్షత్రం కుక్షిగా, అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా, విశాఖ నక్షత్రం ముంజేతులుగా, హస్త చేతులుగా, పునర్వసు నక్షత్రం వేళ్ళుగా, జ్యేష్ఠ కంఠంగా, పుష్యమి నక్షత్రం ముఖంగా, భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి.

కార్తీక స్నాన సంకల్పం ...

సర్వపాప హారం పుణ్యం స్నానం కార్తిక సంభవం !

నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తు తే !!

అనుకుంటూ ఆచమనం చేసిన తరువాత ...

సంకల్పం:

దేశాకాలౌ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌన్దరీ కాశ్యమేధాది సమస్తక్రాటు ఫలా వాప్త్యార్థం, ఇహజన్మని జన్మాంతర రేచ బాల్య యౌవన కౌమార వార్థకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థాసుజ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం, సర్వేషాం పాపాన మపనోడ నార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ద్యర్థం, క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం, శ్రీ శివకేశావానుగ్రహ సిద్ద్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తికమాసే ... వాసర (వారం పేరు), యుక్తానాం ..... తిథౌ (తిథి) శ్రీమాన్ (గోత్రనామం) గోత్రాభిజాతః --- (పేరు) నామదేయోహం - పవిత్ర కార్తిక ప్రాతఃస్నానం కరిష్యే!

మంత్రం:

తులా రాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ !

నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తు తే!!

మంత్రం చదువుతూ ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖంగా స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీళ్ళను తీసుకుని, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరం వైపు చల్లి, తీరం చేరుకొని, కట్టుబట్టల కొనలను నీళ్ళు కారిపోయేలా పిండాలి. దీన్నే యక్షతర్పణం అని అంటారు. ఆలయానికి వెళ్ళి, శివుడు లేదా విష్ణువుకు అర్చన చేసి ఆవునేతితో దీపారాధన చేయాలి. తరువాత స్త్రీలు తులసి మొక్కని దీపాన్ని, పురుషులు కాయలు ఉన్న ఉసిరి కొమ్మను, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణతో దానం చేయాలి. కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు దానిలో ఒకటి క్షీరాబ్ధిద్వాదశి, రెండవది కార్తీకపౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులు పెట్టి దీపాలు పెడతారు, నదులలో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కార్తిక పౌర్ణమి రోజున కృత్తికా శివయోగం అనే పూజా విధానాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు. మరికొన్ని ప్రాంతాలలో శివాలయాల దగ్గర జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటలను రక్షించమని కోరుకుంటారు. జ్వాలాతోరణం అంటే కార్తికపౌర్ణమి రోజున గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని మూడుసార్లు ఆ మంటకిందుగా తిప్పుతారు. జ్వాలాతోరణం నిర్వహించడానికి కారణం ఈ విధంగా చెబుతారు. దేవతలు రాక్షసులు సముద్రమథన చేసిన సమయంలో హాలాహలం వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భంలో ప్రజారక్షణ చేసినందుకు సంకేతంగా జ్వారాతోరణం జరుపుతారట. ఉదయం పూట శ్రీహరి పూజ, సంధ్య వేళ శివారాధన, దీపాల అలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తున్నది.

దీపదాన మంత్రం:

సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం !

దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ !!

జ్ఞానం, సంపదలు, శుభాలనూ కలిగించేదైన, దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరం శాంతి సుఖాలు ఏర్పడుగాక' అని చెపుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి.

 

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

$27.69

Sruk Sruvalu

Sruk Sruvalu

Sruk Sruvalu ..

$8.46

Related Articles

కార్తీకమాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలం

 

కార్తీకమాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభిస్తుందిశివాలయ గోపురద్వారాశిఖరాలలో గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్నిపాపాలూ అంతరించిపోతాయిఎవరయితే కార్తీకమాసంలో శివాలయంలో ఆవునేతితోవిప్ప నారింజ నూనెలతో దీప సమర్పణ చేస్తే వాళ్ళు ధర్మాత్ములు అవుతారు.