Karthika Masam Day 16 Parayanam

కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణం 

ప్రథమ అధ్యాయం

ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని, సంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీ! సూతమునీ! లోకోత్తర పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మపురాణాంతరవర్తి! అని కూడా విని ఉన్నాము. మాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగా, సురుచిర దరస్మేర వదనుడు అయిన సూతుడు - "మునులారా! వైకుంఠుని లీలావినోదాలూ, మహిమలూ వినేవారికి, వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయేగాని విసుగుని కలిగించవు. భక్తిప్రవత్తులతో మీరుకోరాలే గాని గురుప్రసాదిత శక్తి అనుసారం చెపుతాను - వినండి. స్కాందపురాణంలో జనక మహారాజుకు వశిష్టులవారు ఎలా ఈ కార్తీక మహత్యాన్ని బోధించారో, అదే విధంగా పద్మపురాణంళో సత్యభామకు శ్రీమన్నారాయణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ముఖతః ఈ కార్తీకమాస విశేషాలు అన్నీ ప్రవచించబడ్డాయి.

పారిజాతాపహరణం

ఒకానొకప్పుడు నారదమహర్షి స్వర్గంనుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి, కృష్ణుడికి ఇచ్చి 'ఓ హరీ! నీకున్న పదహారువేల ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకి ఈ పువ్వు ఇవ్వవయ్యా'' అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణీ అక్కడే వుంది. నందనందనుడు ఆ కుసుమాన్ని రుక్మిణికి కానుకగా ఇచ్చాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. 'ప్రియమైన భార్యకి ఇవ్వమంటే, తనకి ఇవ్వాలిగాని, ఆ రుక్మిణికి ఇవ్వడమేమిటి' అని కోపగించుకుంది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చచెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపే వరకూ ఊరుకునేది లే''దని బెదిరించింది. అత్యంత ప్రియురాలు అయిన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుడిని అధిరోహించి ఇంద్రుడి అమరావతీ నగరానికి వెళ్ళాడు. స్వర్గసంపదను, భూలోకానికి పంపించడానికి దేవేంద్రుడు అంగీకరించలేదు. దాని ఫలితంగా - ఇంద్ర ఉపెంద్రాల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకూ, గరుత్మంతుడికీ భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండంతో గోవులను కొట్టడంవలన గోవులయొక్క చెవులు, తోకలు తెగి, రక్తధారలతో సహా భూమిపై పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బిచెట్లు, చెవుల వలన చీకటిచెట్లు, రక్తం నుంచి మేహధీవృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునేవారు ఈ మూడుచెట్లకూ దూరంగా వుండాలి, ముట్టుకోకూడదు. అదే విధంగా తమ కొమ్ములతో కొట్టడం చేత ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు ఒక మూడు నేలరాలి వాటినుండి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అనే మూడు రకాల పక్షులు జన్మించాయి. ఇవి మూడు కూడా శుభప్రదమైనవే, గరుడు దర్శనంవలన మానవులు ఏయే శుభాలను అయితే పొందుతున్నారో, అటువంటి సర్వ శ్రేయస్సులనూ - పైన చెప్పిన పక్షిత్రయాన్ని చూసిననంత మాత్రానే పొందగలుగుతారు. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి, సవినయపూర్వకంగా పారిజాత చెట్టును యాదవేంద్రుడికి అర్పించుకున్నాడు. దానవ అంతకుడు దాన్ని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సాత్రాజితీ (సత్యభామ) నివాసంలో ప్రతిష్టించాడు. అందువలన అమితానందం పొందిన ఆ సత్యభామ తన పెనిమిటి అయిన పీతాంబరుడితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ 'ప్రాణ ప్రియా! నేను ఎంతయినా ధన్యురాలిని. ఈ పదహారువేల ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు అత్యంత ప్రియతను కావడంవలన, నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటివాడికి భార్యను కావడానికి, నీతోబాటు గరుడారూఢనయి బొందెతో స్వర్గసందర్శనం చేయడానికి, కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరుగని కల్ప (పారిజాత) వృక్షం నా పెరటిమొక్కగా ఉండడానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా, అలిగిన ఆవేశంలో నిన్ను వామ పాదాన తాడించినా, నువ్వు మాత్రం నామీద నువ్వు గింజంత కూడా కోపం చూపించకుండా ఇలా ప్రేమిస్తున్నావు ఏమిటి? ఈ నీ ఆదరాభిమాన అనురాగాలు పొందడానికి నేను గతజన్మలో చేసిన పుణ్యం ఏమిటి? నేను ఇప్పుడు ఇంకా ఏమేం చెయ్యాలి?' అని అడిగింది. అందుకు ఆ ముకుందుడు మందహాసం చేస్తూ 'ఓ నారీ లలామా, సత్యభామా! నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇవ్వరాని దాన్ని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి, సంతృప్తురాలిని చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే' అంటూ ఇలా చెప్పసాగాడు.

సత్యభామ పూర్వజన్మము

కృతయుగాంతకాలంలో 'మాయా' అనే నగరంలో దేవశర్మ అనే వేదపండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి, అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని, తన శిష్య పరంపరలోనివాడే అయిన 'చంద్రు'డనే వాడికి ఇచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకరోజు మామ, జామాత(అల్లుడు)లు ఇద్దరూ కలిసి సమిధలనూ, దర్భలనూ తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి, అక్కడ ఒక రాక్షసుడిచేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులూ, ధర్మాత్ములూ నిత్య సూర్యోప్రాసిపరులూ అయిన వారి జీవిత విన్నాణానికి మెచ్చిన విష్ణుమూర్తి "శైవులుగాని, గాణాపత్యులుగాని, సౌర (సూర్య)వ్రతులుగాని, శాక్తేయులుగాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై, వంకలై, నదులై చివరికి సముద్రాన్నే చెందినట్లుగా - నన్నే పొందుతున్నారు. పుత్రభ్రాత్రాది నామాలతో - దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజించబడి వున్నాను. అందువలన, మరణించిన మామా-అల్లుళ్ళను మన వైకుంఠానికే తీసుకుర'మ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభువు ఆజ్ఞను పాటించారు. సూర్యతేజ అసమాన కాంతులతో ఆ యిరువురి జీవాలూ వైకుంఠంచేరి, విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే ఉండసాగాయి.

ప్రథమ అధ్యాయం సమాప్తం

ద్వితీయ అధ్యాయం

గుణవతి కథ

పితృభర్త్రు మరణవార్త విన్న గుణవతి ఎంతగానో క్రుంగిపోయింది. కాని, పోయినవారితో తనుకూడా పోలేదు గనుక, మరణం ఆసన్నం అయ్యేదాకా మనుగడ తప్పదు కాబట్టి వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లోవున్న వస్తువులన్నింటినీ విక్రయించి, తండ్రికీ-భర్తకూ ఉత్తమగతులకోసం ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేషజీవితాన్ని శేషశాయి స్మరణలోనే గడుపుతూ, దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ, ఆధ్యాత్మిక చింతనతో, హరిభక్తినీ-సత్యాన్నీ, శాంతాన్నే, జితేంద్రియత్వాన్నీ పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారి ఇంట పెరిగింది కావడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్నీ - ఏకాదశీ వ్రతాన్నీ మాత్రం ప్రతియేటా విడువకుండా ఆచరించేది. కృష్ణుడు చెబుతున్నాడు : సత్యా ! పుణ్యగణ్యాలూ, భక్తిముక్తిదాయకాలూ, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలూ అయిన ఆ రెండు వ్రతాలూ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసుకదా! కార్తీకమాసంలో, సూర్యుడు తులారాశిలో వుండగా నిత్యమూ ప్రాతఃస్నానం ఆచరించేవారి సమస్త పాపాలనూ నేను నశింపచేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలూ, దీపారాధనలు, జాగరణ, తులసిపూజ చేసేవాళ్ళు, అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణు స్వరూపులై భాసిస్తారు. విష్ణువు ఆలయంలో మార్జనం చేసి, సర్వతోభద్రం శాఖం పద్మం మొదలయిన ముగ్గులను పెట్టి, పూజా పునస్కారాలను చేసేవాళ్ళు, జీవన్ముక్తులు అవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీకమాసంలో నెలరోజులలోనూ, కనీసం మూడు రోజులు అయినా ఆచరించినవాళ్ళు దేవతలచేత కూడా నమస్కరించదగినవాళ్ళు అవుతున్నారు. ఇక పుట్టింది లగాయతు జీవితాంతమూ చేసేవారి పుణ్యవిభాగాన్ని చెప్పడం ఎవరివల్లా కాదు. అదేవిధంగా ఆనాడు గుణపతి, విష్ణు ప్రియాంకురాలు అయిన ఏకాదశీ, కార్తీకవ్రతాలను మాత్రం వదలకుండా కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెళ్ళదీసి - కొన్నాళ్ళ తరువాత వయోభారం వల్ల శుష్కించి, జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీకస్నానం మానకూడదు అనే పట్టుదలతో నదికివెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్ళకుచేరి స్నానం చేసే ప్రయత్నం చేస్తూ వుంది. అంతలోనే ఆకాశంనుంచి శంఖ చక్ర గదా పద్మాద్యాయుధాలు ధరించి విష్ణు విభువులు అయిన విష్ణుదూతలు గరుడ పతాక యుతమైన విమానంలో వచ్చి గుణణపతిని అందులో చేర్చి - దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీకవ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రభాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. తరువాత శ్రీ మహావిష్ణువును అయిన నేను, దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిగా అవతరించాను. నాతో బాటే అనేకమంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని 'చంద్రుడు' ఈ జన్మలో అక్రూరుడు అయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభావించాడు. బాల్యం నుంచీ కార్తీకవ్రతం మీదా, నా మీదా మాత్రమే మనస్సు లగ్నం చేసిన గుణవతే-నువ్వుగా- అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మవిభాగానికి అంతటికీ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణా పుణ్యలేశమే తప్ప ఇంకా ఏమీ కాదు. ఆ జన్మలో నా ముందు తులసిమొక్కను పాతిన పుణ్యానికి, ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా, ఈనాడు నీ ఇంటా - వంటా కూడా లక్ష్మీకళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణా పుణ్యాలను కూడా - 'నారాయణాయేతి సమర్పయామి' అంటూ జగత్పతిని అయిన నాకే ధారబోసినదానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవి అయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకూ కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంతవరకూ నీకు నా యెడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సాత్రాజితీ! నువ్వేకాదు, నీ మాదిరిగా ఎవరయితే కార్తీక వ్రతానుష్టానిష్టులూ, నా భక్తిగరిష్టులూ అయి ఉంటారో వారందరూ కూడా నాకు యిష్టులై సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారిగానో, నా సానిధ్యంలోనో ఉంటూనే ఉంటారు. రాగవతీ! ఒక్క రహస్యం చెబుతాను విను - తపోదానా యజ్ఞాదికాలను ఎన్నిటిని నిర్వర్తించినా సరే - కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో పదహారోవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో' పై విధంగా శ్రీకృష్ణప్రోక్తమైన తన పూర్వజన్మ గాథనూ, కార్తీకవ్రత పుణ్యఫలాలనూ విని పులకింతాంగి అయిన ఆ పూలబాల తన ప్రియపతి అయిన విశ్వంభరుడికి వినయవిధేయలతో ప్రణమిల్లింది.

ఒకటి రెండు అధ్యాయాలు సమాప్తం

పదహారవ రోజు (బహుళ పాడ్యమి) పారాయణ సమాప్తం

Products related to this article

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)

Cow With Calf (German Silver)..

$27.69

0 Comments To "Karthika Masam Day 16 Parayanam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!