Saibaba Saccharitra 1 Adhyaayam

శ్రీసాయిసచ్చరిత్ర

మొదటిరోజు పారాయణం  (గురువారం)

ఉపోద్ఘాతం

మహారాష్ట్ర రాష్ట్రంలోని వారందరికీ శ్రీగురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ రాష్ట్రం అంతటా దత్తాత్రేయుని భక్తులు దీన్ని చదివారు. కొందరు దీన్ని నిత్యపారయణం చేస్తుంటారు. దీన్ని రచించినవారు సరస్వతీ గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభస్వామి యొక్క, శ్రీనరసింహసరస్వతిస్వామి యొక్క లీలలు, విచిత్ర చర్యలు వర్ణింపబడ్డాయి. వీరిద్దరూ దత్తాత్రేయుడి ముఖ్య అవతారాలు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్త శ్రీ ఎల్.ఆర్.పాంగార్ కర అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారాలు 14, 15 శతాబ్దాలలో వెలిశాయి. దత్తాత్రేయుడి తరువాత అవతారాలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి నిజాం ప్రాంతంలో శ్రీమాణిక్యప్రభువు, షోలాపూరు జిల్లాలో శ్రీ అక్కల్ కోట్ కర్ మహారాజ్ గారు, చివరికి ఆహ్మదునగరు జిల్లాలోని షిరిడీలో శ్రీసాయిబాబా. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కల్ కోట్ కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీసాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకం. అయిదవ అధ్యాయంలో వేపచెట్టు కింద పాదుకలు ప్రతిష్టించిన కథ, ఇరువై ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్రపితళే అనుభవం ఈ నమ్మకాన్ని ధృవపరుస్తుంది. పైన వివరించిన రెండు అవతారాల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్ర 53 అధ్యాయంలో సరస్వతీ గంగాధరు ఎలా వర్ణించారో, అలానే శ్రీ గోవిందరఘునాథ్ ఉరఫ్ అన్నా సాహేబు దాభోల్కరు (హేమాడ్ పంత్) అనేవారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయంలో శ్రీ సాయిసచ్చరిత్ర అనే గ్రంథంలో వర్ణించారు. కాబట్టి ఈ శ్రీసాయిసచ్చరిత్ర ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును. పై చరిత్రల గురించి ఈ దిగువ వివరించిన అంశాలు గమనార్హాలు :

1.  శ్రీగురుచరిత్రను వ్రాసినవారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగా తెలియదు. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథాన్ని వారు రాయగలిగారు. శ్రీసాయిసచ్చరిత్ర యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీవారు. వారు మహారాష్ట్ర రాష్ట్రంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధిచెందిన ఏకనాథ భాగవతం వారి నిత్యపారాయణ గ్రంథం. శ్రీసాయిసచ్చరిత్రాన్ని జాగ్రత్తగా చదివితే, ఏకనాథ భాగవతంలోని ఎక్కువ విషయాలు శ్రీసాయిసచ్చరిత్రలో పొందుపరచబడి ఉండటం గమనార్హం.

2.  శ్రీ గురుచరిత్ర ముఖ్యంగా కర్మకాండపై ఆధారపడి ఉండటంతో దాన్ని అర్థం కోవడం కష్టం. దాన్ని ఆచరణలో పెట్టడం మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్యశిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోయారు. శ్రీసాయిసచ్చరిత్ర చరిత్ర అలా వుండదు. అందులోని విషయాలు తేటతెల్లాలు, అత్యంత సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వాటిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు.

3.  శ్రీగురుచరిత్రలో వర్ణించిన విషయాలు, అవి జరిగిపోయిన వంద సంవత్సరాలకు వ్రాయబడింది. కాని శ్రీసాయిసచ్చరిత్రలోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూశాడు. శ్రీసాయిబాబా యొక్క అనుమతి పొంది, వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథాన్ని ప్రారంభించారు. వారి అజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయాలు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకున్నారు. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధిచెందిన తరువాత, శ్రీసాయిలీల మాసపత్రికలో శ్రీసాయిచరిత్రను కొంచెం కొంచెం ప్రకటించారు. శ్రీసాయిసచ్చరిత్ర ఈ విధంగా 1923 నుండి 1929 వరకు శ్రీసాయిలీలలో ధారావాహికంగా ప్రచురించబడి, 1930లో పూర్తి గ్రంథంగా ముద్రింపబడింది. కాబట్టి శ్రీసాయిసచ్చరిత్రాన్ని ప్రస్తుత గ్రంథం అధికారికమైనది. షిరిడీలో శ్రీసాయిబాబా జీవించి ఉండగా దర్శించుకొనే భాగ్యం లభించని సాయిభక్తులకు ఈ గ్రంథం నిజంగా ఒక వరం.

శ్రీసచ్చరిత్రను అన్నా సాహెబు దాభోల్కర్ కూర్చారు. కాని, ప్రతి అధ్యాయం చివరలో శ్రీసాయి ప్రేరణతో 'హేమాడ్ పంత్' చే వ్రాయబడినట్లు ఉంది.  ఈ హేమాడ్ పంత్ ఎవరని పాఠకులు అడగవచ్చు. అన్నా సాహెబు దాభోల్కరు మొట్టమొదటిసారి శ్రీసాయిబాబాను సందర్శించినప్పుడు వారు ఈ బిరుదును దాభోల్కరుకు కరుణించారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి ఇచ్చారో అన్న విషయం రెండవ అధ్యాయంలో రచయితే చెప్పారు. అన్నా సాహెబు జీవిత చరిత్ర క్లుప్తంగా ఈ విధంగా చెప్పబడింది.

గ్రంథ రచయిత దాభోల్కరు 1859వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని కేల్వేమహిములో ఒక పేద ఆర్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారి తాతతండ్రులు దైవభక్తి కలవారు. దాభోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేసి, పూణేలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్లవిద్యను అభ్యసించారు. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు అంత బాగా లేకపోవడంతో వారు పైచదువులు చదవలేకపోయారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం పరీక్షల్లో ఉత్తీర్ణులై స్వంత ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే సాబాజీ జిల్లాలో మామల్తదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనేవారు వీరి సచ్చీలతను, బుద్ధి కుశలతను, సేవానిరతిని చూసి మెచ్చుకొని  తలాఠీ అనే గ్రామోద్యోగిగా నియమించారు. తరువాత ఇంగ్లీషు గుమస్తాగా వేశారు. తరువాత మామల్తదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించారు. కొంతకాలం అయిన తరువాత అటవీశాఖలో ఉద్యోగిగా నియమించారు. కొన్నాళ్ళకు కరువుకు సంబంధిచిన పనులలో ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్ లోని బ్రోచ్ లో నియమితులయ్యారు. ఆయా ఉద్యోగాలలో తన బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చడం వల్ల 1901వ సంవత్సరంలో ఠాణా జిల్లాలోని శాహోపూర్ లో మామల్తదారుగా నియమించబడ్డారు. 1903వ సంవత్సరంలో ఫస్టుక్లాసు రెసిడెంటు మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమించబడ్డారు. వారు అక్కడే 1907 వరకు ఉద్యోగం చేశారు. తరువాత ఆయన ముర్బాడు, ఆనంద్, బోర్సదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేటుగా నియమించబడ్డారు. ఈ సంవత్సరంలోనే షిరిడీకి వెళ్ళి శ్రీసాయినాథుని దర్శన భాగ్యం కలిగింది. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన తరువాత కొన్ని నెలలవరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. అది కూడా విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి అయ్యేవరకు శ్రీసాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి అయిన తరువాత షిరిడీ శ్రీసాయిబాబా సంస్థానాన్ని, 1929వ సంవత్సరంలో తాను మరణించేవరకు ఎంతో చాకచక్యంగా నడిపారు. ఆయనకి భార్య, అయిదుగురు కుమార్తెలు. బిడ్డలకు తగిన సంబంధాలు దొరికాయి. అందరూ క్షేమంగా ఉన్నారు.

సాయిబాబా ఎవరు? అన్న ప్రశ్నకు మూడు విధాలుగా సమాధానం చెప్పవచ్చు.

  దీర్ఘాలోచన చేయకుండా, విషయాల గురించి కాని, మనుష్యుల గురించి కాని అభిప్రాయం అభ్యసించినవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీరు అని, వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, తనను దర్శించడానికి వచ్చినవారి నుండి దక్షిణ రూపంలో ధనం వసూలు చేస్తున్నారని చెప్పేవారు. ఈ అభిప్రాయం తప్పు! ఆర్.ఏ.తర్ఖడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనం తరువాత బాబా దగ్గర శెలవు తీసుకుని బొంబాయి తిరిగి వెళ్ళేటప్పుడు కంటతడి పెట్టుకున్నారు. అప్పుడు బాబా అతనితో ఇలా చెప్పారు 'పిచ్చివాడివలె ప్రవర్తిస్తున్నావు ఏమిటి? నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా?''. దానికి తర్ఖడ్ గారి మిత్రుడు ఇలా జవాబు ఇచ్చారు 'నాకా విషయం తెలియదు. ఎందుకంటే మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా?'. దానికి బాబా ఇలా చెప్పారు 'ఎవరయితే బాబా షిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజంగా గ్రహింపలేరు అని తెలుసుకో'.

2.  కొందరు సాయిబాబాను మహాసిద్ధపురుషుడు అని అన్నారు. మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకరిగా భావించారు. హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకరిగా గ్రహించారు. ప్రతి సంవత్సరం షిరిడీలో జరిగే ఉత్సవాల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను 'సంత చూడామణి'గా పేర్కొంటారు.

ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు.

3.  శ్రీసయిబాబాను సన్నిహితంగానూ, వాస్తవంగానూ సేవించిన వారు మాత్రం బాబాను భగవదవతారంగా ఇప్పటికీ భావిస్తున్నారు. దీనికి నిదర్శనాలు …

శ్రీసాయిబాబా సర్వాంతర్యామి

1.  బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'బాబా సూత్రములు-పలుకులు' అనే గ్రంథం పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారు యమ్.బి.రేగేగారు ఇలా రాశారు 'బాబా నశరీరులుగా ఉన్నప్పుడు, వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపంగా తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గాన్ని ప్రకాశింప చేస్తుండేవారు, వారి నశ్వరమైన దేహం మాయమైపోయింది కాని, దానిలో అప్పుడు ఉన్న 'బాబా' మాత్రం ఇప్పటికీ అనంత శక్తిలా నిలిచి, వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించే అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతున్నారు.  

2.  శ్రీ బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'భక్తుల అనుభవాలు' అన్న పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జిగారు ఇలా వ్రాశారు …

'నేను సాయిబాబాను సృష్టిస్థితిలయకారుడిగా భావిస్తాను. 1918వ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేను అలా భావించాను. ఇప్పటికీ నేను అలాగే భావిస్తున్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవశరీరం మా కన్నుల ముందు సంచరిస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కాని ఎక్కువ భాగం మా గుర్తుగా నిలిచినది మాత్రం వారి అనంతతత్వమే. శాశ్వతము - అశాశ్వతములు అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబంలా వారు మాకు దర్శనం ఇచ్చేవారు. అశాశ్వతమైన తమ మానవదేహం ఒక్కొక్కప్ప్పుడు మా ఎదుట తళుక్కుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై 'సాయిబాబా' అనే శాశ్వతమైన అనంతశక్తి మాత్రం నిలిచి వుంది.

3.  బి.వి. నరసింహస్వామిగారు రచించిన 'భక్తుల అనుభవాలు' గ్రంథంలో 19-20 పేజీలలో ఆచార్య జి.జి.నార్కే (యం.ఏ.య., ఎస్.సి., పూణా ఇంజనీరింగ్ కాలేజీ) ఇలా చెప్పారు …

'ఇంటివద్ద నిత్యం నేను పూజించే గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా ఉంచాను. సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. మా మామగారైన శ్రీమాన్ బూటీ, నా భార్య, నా తల్లి గొప్ప సాయిభక్తులు. వారు సాయిబాబాను భగవంతునిలా పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి వెళ్ళినప్పుడు హారతి సమయంలో సాయిబాబా అత్యంత కోపోద్రిక్తుడై ఉన్నారు. అకారణంగా వారు కోప్పడుతూ శపిస్తూ, భయపెడుతూ ఉండేవారు. అయన పిచ్చివాడా అని అనుమానం నా మనస్సులో కదిలింది. మామూలుగానే హారతి పూర్తి అయ్యింది. ఆ రోజు సాయంకాలం నేను బాబా పాదాలను నొక్కుతున్నాను. అప్పుడు బాబా ప్రేమగా నా అల నిమురుతూ 'నేను పిచ్చివాడిని కాదు' అని అన్నారు. ఎంత ఆశ్చర్యం! నేను మనసులో అనుకున్నది బాబా గ్రహించారు. వారికి తెలియకుండా మనం ఎటువంటి రహస్యాలను దాచలేము. వారు సర్వాంతర్యామి, నా ఆత్మయొక్క అంతర్యామి.వారి అంతర్యామిత్వం గురించి నాకు అనేక నిదర్శనాలు కలిగాయి.  వారు నాతొ మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుని మాట్లాడేవారిలా మాట్లాడేవారు. నా హృదయంలోగల ఆలోచనలను, కోరికలను గ్రహిస్తూ ఉండేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు. వారే భగవంతుడని నిర్ణయించుకోవడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించే వాడిని. ప్రతి పరీక్షలో సర్వజ్ఞులని వారి ఇష్టమొచ్చిన తీరులో సర్వాన్ని నడిపిస్తారని నాకు నమ్మకం కలిగేది.'

4.  రావు బహద్దూర్ యమ్. డబ్య్లు. ప్రాధాన్ రాసిన 'షిరిడీ సాయిబాబా' అనే గ్రంథంలోని ఉపోద్ఘాతంలో గౌరవనీయులైన, అమరావతిలో ప్రసిద్ధ వకీలు అయిన దాదా సాహెబు ఖపర్డే ఇలా చెప్పారు …

'శ్రీసాయిబాబా ప్రతి అంతరంగలో మెదిలే ఆలోచనలన్నీ తెలిసిన వారిలా వుండి, వారి కోరికలు తీరుస్తూ సుఖసంతోషాలు కలుగజేసేవారు. ఆయన భూమిపై నడయాడే దైవం అనే భావన కలుగుతుండేది'

5.  దాసగణు మహారాజు తమ 'స్తవన మంజరి' అనే స్తోత్రంలో సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగానూ నిత్య శాంతమూర్తిగాను వర్ణించారు.

6.  హేమాడ్ పంత్ శ్రీసాయిసచ్చరిత్ర యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసిరే ఒక వింత యోగిగా వర్ణించారు. కాని రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొద్దీ, బాబాను భగవంతుడని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడని చెప్పారు.

7.  షిరిడీ భక్తులందరూ ముఖ్యంగా మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామా అనేవారు బాబాకు ఆత్యంత ప్రియభక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరిగేవారు. ఆయన ఎప్పుడూ బాబాను 'దేవా' అని సంబోధించేవారు. ఈ భక్తులందరి అభిప్రాయాలను తెలుసుకొని, వారు చెప్పిన దానిలోని యదార్థం గ్రహించి శ్రీసాయి అవతార పురుషుడని భావించెదను గాక!

ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యాన్ని దర్శించారు. బ్రుహదారణ్యక, ఛాందోగ్య, కఠ, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతా భగవంతుని రచన అని, అది అంతర్యామితో అనగా సర్వాన్ని సృష్టించి పాలించే భగవంతుడితో వ్యాపింపబడి ఉన్నదనీ వక్కాణిస్తూ ఉన్నాయి. ఈ సిద్ధాంతాన్ని నిరూపణ చేయడానికి తగిన ఉదాహరణ శ్రీసాయియే! ఈ శ్రీసాయిసచ్చరిత్రాన్ని సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథాలను చదివినవారు తప్పకుండా ఈ సత్యాన్ని గ్రహించి యదార్థం అయిన శ్రీసాయిని దర్శించగలరు! 

శ్రీసాయినాథాయ నమః

ఉపోద్ఘాతము సంపూర్ణం

రెండవ అధ్యాయం

0 Comments To "Saibaba Saccharitra 1 Adhyaayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!