Saibaba Satcharitra 23 Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

నాలుగవ రోజు పారాయణ (ఆదివారం)

ఇరవైమూడవ అధ్యాయం

 

నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అంటే సర్వరజస్తమోగుణాలకి అతీతుడు. కాని మాయచే కప్పబడి, వాడి  నైజం అయిన సంచ్చిదానందాన్ని మరిచిపోతూ తానూ శరీరమే అనుకుంటూ, అలాంటి భావనతో తానే చేసేవాడు అనుభవించేవాడు అని అనుకుంటూ. లెక్కలేని బాధలలో చిక్కుకుంటూ విముక్తిని పొందలేక పోతున్నాడు. విమోచానానికి మార్గం ఒక్కటే వుంది. అది గురువుని పాదాలలో ప్రేమమయమైన భక్తి, గొప్పనటుడు అయిన సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజంలోకి మారుస్తారు.

ఇంతకు పూర్వం చెప్పిన కారణాలచే మేము సాయిని భగవంతుడి అవతారంగా అనుకున్నాము. కాని వారు ఎల్లప్పుడూ తాము భగవంతుడి సేవకుడిని అని చెప్పేవారు. వారు అవతారపురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎలా ప్రవర్తించాలో చూపిస్తూ ఉండేవారు. ఆయా వర్ణాశ్రమాలకు విధింపబడిన కర్మలను ఎలా నెరవేర్చాలో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కోసం ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనాచేతనాలలో, భగవంతుణ్ణి చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా! ఎవరిని నిరాదరించడంగానీ, అవమానించటంగానీ వారు ఎరుగరు. సమస్త జీవులలోవారు నారాయణుని చూస్తుండేవారు. ‘నేను భగవంతుడిని' అని వారు ఎప్పుడూ అనలేదు. భగవంతుడి విధేయసేవకుడిని అని వారు చెప్పేవారు. భగవంతుణ్ణి ఎల్లప్పుడూ తలచుకునేవారు. ఎల్లప్పుడూ 'అల్లా మాలిక్!’ అంటే భగవంతుడే సర్వాధికారి అని అంటుండేవారు.

మాకు ఇతర యోగులు తెలుసు. వారు ఎలా ప్రవర్తిస్తారో, ఏమి చేసేవారో, ఎలా తింటారో తెలియదు. భగవంతుడి కటాక్షంతో వారు అవతరించి అజ్ఞానులకు, బద్దజీవులకు విమోచనం కలగ చేస్తారని మాత్రం మాకు తెలుసు. మన పుణ్యం ఏమైనా ఉన్నట్లయితే మహాత్ముల కథలను లీలలను వినడానికి కుతూహలం కలుగుతుంది. లేకపోతే జరుగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూద్దాం.

యోగము - ఉల్లిపాయ

ఒకరోజు యోగాభ్యాసం చేసే సాధకుడు ఒకడు నానాసాహెబు ఛాందొర్కరుతో కలిసి షిరిడీ వచ్చారు. అతడు యోగశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు అన్నీ చదివారు. చివరికి పతంజలి యోగసూత్రాలు కూడా చదివారు. కాని అనుభవం ఏమీ లేకపోయింది. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెంసేపయినా ఉండలేక పోయేవాడు. సాయిబాబా తన పట్ల ప్రసన్నుడు అయితే చాలాసేపు సమాధిలో ఉండటం నేర్పిస్తారని అతను అనుకున్నాడు. ఈ లక్ష్యంతో అతడు షిరిడీకి వచ్చాడు. అతడు మసీదుకు వెళ్ళి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటున్నారు. దీన్ని చూడగానే అతనికి మనస్సులో ఒక ఆలోచన మెదిలింది. ‘రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు తన కష్టాలు ఎలా తీర్చగలడు నన్ను ఎలా ఉద్ధరిస్తాడు?’ సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచన గ్రహించి, నానాసాహెబ్ తో ఇలా అన్నారు. ‘నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి ఉంటుందో వారే దాన్ని తినాలి' ఇది విని యోగి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే బాబా పాదాలపై పడి సర్వస్యశరణాగతి చేశాడు. స్వచ్చమైన మనస్సుతో తన కష్టాలు తెలిపి ప్రత్యుత్తరాల ద్వారా తెలుసుకుని ఇలా సంతృప్తి చెంది ఆనందించినవాడై బాబా ఊదీ ప్రసాదంతో, ఆశీర్వాదాలతో షిరిడీ విడిచిపెట్టాడు.

పాముకాటు నుండి శ్యామాను కాపాడుట

ఈ కథ ప్రారంభించక పూర్వం హేమాడ్ పంత్, జీవుడిని పంజరంలో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చు అని అన్నారు. రెండూ బంధింపబడే ఉన్నాయి. ఒకటి శరీరంలోనూ రెండవది పంజరంలో. రెండూ తమ ప్రస్తుత స్థితే బాగుంది అనుకుంటూ ఉంటాయి. సహాయకుడు వచ్చి వాటిని బంధాలనుంచి తప్పించగానే వాటికి నిజం తెలుస్తుంది. భగవత్కటాక్షంతో గురువు వచ్చి వారి కళ్ళను తెరిపించి బంధవిముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితివైపు సారిస్తుంది. అప్పుడే గతించిన జీవితం కంటే రాబోయేది గొప్పది అని గ్రహిస్తారు.

గత అధ్యాయంలో మిరీకర్ కి రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ చదివారు. అంతకంటే ఘనమైన కథను ఇక్కడ చదవండి. ఒకరోజు శ్యామాను విషసర్పం కరిచింది. అతని చిటికెన వ్రేలిని పాము కరవడంతో శరీరంలోకి విషయం వ్యాపించడం మొదలుపెట్టింది. బాధ ఎక్కువగా వుంది. శ్యామా తాను మరణిస్తానని అనుకున్నాడు. స్నేహితులు అతన్ని విఠోబా మందిరానికి తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. పాముకాట్లు అక్కడ బాగుచేయబడుతూ ఉండేవి, కానీ శ్యామా తన విఠోబా అయిన బాబా దగ్గరికి పరిగెత్తాడు. బాబా అతన్ని చూడగానే కోపంతో అతన్ని తిట్టడం ప్రారంభించారు. ‘ఓరి పిరికి పురోహితుడా! పైకి ఎక్కవద్దు! ఎక్కావో ఏమౌతుందో చూడు' అని బెదిరిస్తూ ఇలా గర్జించారు 'పో, వెళ్ళిపో, కిందకి దిగిపో'. బాబా అలా కోపోద్దీపితుడు అవడం చూసి శ్యామా అమితంగా విస్మయం చెందాడు, నిరాశ చెందాడు. అతను మసీదును తన ఇల్లుగా భావించాడు, బాబా తనని అలా తరిమివేస్తే తానెక్కడికి వెళ్ళగలడు? అతడు ప్రాణం మీద ఆశ వదులుకుని ఊరుకున్నాడు. కొంతసేపటికి బాబా శాంతించి, శ్యామా దగ్గరకు వెళ్ళి కూర్చుని, ఇలా అన్నారు 'భయపడవద్దు, ఏమాత్రం చింతించకు, ఈ దయామయుడు అయిన ఫకీరు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి వూరికే కూర్చో. బయటికి వెళ్ళవద్దు. నాలో విశ్వాం ఉంచు. భయపడకు, ఆందోళన పడవద్దు' ఇలా అని శ్యామాను ఇంటికి పంపించారు. వెంటనే బాబా తాత్యా పాటీలును, కాకాసాహెబు దీక్షితుని అతని దగ్గరికి పంపించి, తనకు ఇష్టమైనవి తినవచ్చు అని, ఇంట్లోనే తిరగవచ్చు అని, కానీ పడుకో కూడదని, ఈ సలహాల ప్రకారం నడుచుకోమని చెప్పారు. కొద్ది గంటలలో శ్యామా బాగుపడ్డాడు. ఈ పట్టున జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏమిటంటే, బాబా పలికిన 5 అక్షరాల మంత్రం (పో, వెళ్ళిపో, క్రిందకి దిగు) శ్యామాను ఉద్దేశించి అన్నది కాక విషాన్ని ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషం పైకి ఎక్కకూడదని, అది శరీరం అంతా వ్యాపించ కూడదని బాబా ఆజ్ఞాపించారు. మంత్రాలలో ఆరితేరిన మిగిలినవారిలా, వారే మంత్రం ఉపయోగించే ఆవసరం లేకుండా పోయింది. మంత్రబియ్యం కాని, తీర్థం కానీ ఉపయోగించే అవసరం లేకుండా పోయింది. శ్యామా జీవితాన్ని రక్షించడంలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ, విన్నా బాబా పాదాలముందు స్థిరమైన నమ్మకం కలుగుతుంది. మాయ అనే మహా సముద్రాన్ని దాటడానికి బాబా పాదాలను హృదయంలో ధ్యానించుకోవాలి.

కలరా రోగము

ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుతూ ఉండేది. గ్రామస్థులు చాలా భయపడ్డారు. వారు ఇతరులతో రాకపోకలు మానుకున్నారు. గ్రామంలో పంచాయితీ వారు సభ ఏర్పాటు చేసి రెండు అత్యవసరమైన నియమాలు చేసి, కలరా నిర్మూలించే ప్రయత్నం చేశారు. 1. కట్టెల బళ్ళను గ్రామం లోపలికి రానీయకూడదు.

2. మేకను గ్రామంలో కోయకూడదు. ఎవరయినా వీటిని ధిక్కరిస్తే వారికి జరిమానా వేయాలని తీర్మానించారు.

బాబాకి ఇందంతా వట్టి ఛాదస్తం అని తెలుసు. కాబట్టి బాబా ఆ చట్టాలను లక్ష్యపెట్టలేదు. ఆ సమయంలో కట్టెలబండి ఒకటి ఊర్లోకి ప్రవేశిస్తూ వుంది. ఊరిలో కట్టెలకు కరువు ఉందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కట్టెలబండిని తరిమివేయాలని ప్రయత్నిస్తూ వున్నారు. బాబా ఆ సంగతి తెలుసుకుని అక్కడికి వచ్చి కట్టెలబండిని మసీదుకు తెసుకొని వెళ్ళమని ఉత్తరువు ఇచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పాడానికి ఎవ్వరూ సాహసించలేదు. ధుని కోసం కట్టెలు కావలసి ఉంటుంది. కాబట్టి బాబా కట్టెలు కొన్నారు. నిత్యాగ్నిహోత్రిలా బాబా తన జీవితం అంతా ధునిని వెలిగించే ఉంచారు. అందుకోసం వారికి కట్టెల అవసరం కాబట్టి వాటిని నిల్వ చేసేవారు. బాబా గృహం, అంటే మసీదు, ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరయినా వెళ్ళవచ్చు. దానికి తాళం ఉండేది కాదు. కొందరు తమ ఉపయోగం కోసం కొన్ని కట్టెలను తీసుకుని వెళ్తుండేవాడు.అందుకు బాబా ఎప్పుడూ గొణిగేవారు కాదు. ఈ ప్రపంచం అంతా దేవుడే ఆవరించి ఉండటంతో వారికి ఎవరితోనూ శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులు అయినప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండటం కోసం ఇలా చేస్తూ ఉండేవారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవ కలరా నిబంధనాన్ని బాబా ఎలా ధిక్కరించారో చూద్దాం. నిబంధనలు ఉన్నప్పుడు ఒకరు ఒక మేకను మసీదుకు తీసుకొచ్చారు. ఆ ముసలి మేక చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అక్కడే వున్నారు. సాయిబాబా దాన్ని ఒక కత్తివేటుతో నరికి బలి వేయమని బడేబాబాకు చెప్పారు. ఈ బడేబాబా అంటే సాయిబాబాకు ఎక్కువ గౌరవం, ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చోబెట్టుకునేవారు. చిలుము బడేబాబా పీల్చిన తరువాత సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్నం భోజన సమయంలో సాయిబాబా సాదరంగా బడేబాబాను పిలిచి, ఎడమపక్కన కూర్చుండబెట్టుకున్న తరువాత భోజనం ప్రారంభించేవారు. దక్షిణరూపంగా వసూలు అయిన పైకం నుంచి ఆయనకు రోజుకి 50 రూపాయలు సాయిబాబా ఇస్తూ ఉండేవారు. బడేబబా వెళ్ళినప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అలాంటిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమని చెప్పగా అనవసరంగా దాన్ని ఎందుకు చంపాలి అని బడేబబా నిరాకరించారు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమన్నారు. అతడు రాధా కృష్ణమాయి దగ్గరకి వెళ్ళి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు కత్తిని తెప్పించారో తెలుసుకున్న తరువాత రాధాకృష్ణమాయి దాన్ని తిరిగి తెప్పించుకున్నారు. ఇంకొక కత్తి తీసుకుని రావడానికి శ్యామా వెళ్ళారు. కానీ వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబు దీక్షిత్ వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే కానీ, దాన్ని పరీక్షించాలి. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు. అతడు సాఠేవాడాకి వెళ్ళి కత్తిని తెచ్చారు. బాబా ఉత్తర్వు ఇవ్వగానే దాన్ని నరకడానికి సిద్ధంగా ఉన్నారు. అతడు స్వచ్చమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపటం అనేది తెలుసుకోలేకపోయారు. హింసించే పనులను చేయటంలో ఇష్టం లేనివాడు అయినప్పటికీ మేకను నరకడానికి సంసిద్ధుడు అయ్యాడు. బడేబబా అనే మహామ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుతున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకున్నారు. కత్తిని పైకి ఎత్తి బాబా ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. బాబా 'ఏమిటి ఆలోచిస్తున్నావు? నరుకు!’ అన్నారు. అతని చేతిలోని కత్తి మేకపై పడడానికి సిద్ధంగా ఉండగా బాబా ఆగు అని అన్నారు. ‘ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవైన నీవు మేకను చంపుతావా?’ అన్నారు. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రిందపెట్టి బాబాతో ఇలాన్నారు. ‘నీ అమృతం వంటి పలుకే మాకు చట్టం. మాకు ఇంకొక చట్టం ఏమిటో తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకున్నాము. మీ రూపాన్ని ధ్యానిస్తూ రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటిస్తాం. అది ఉచితమా? కాదా? అనేది మాకు తెలియదు. దాన్ని మేము విచారించం. అది సరైనదా? కాదా? అని వాదించం, తర్కించం. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించడమే మా విధి, మా ధర్మం.

బాబా తామే మేకను చంపి బలి వేస్తానని చెప్పారు. మేకను 'తకియా' అనే చోట చంపడానికి నిశ్చయిచుకున్నారు. ఇది ఫకీరులు కూర్చునే స్థలం. అక్కడికి దాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో అది ప్రాణాలు విడిచింది. శిష్యులు ఎన్ని రకాలో చెపుతూ ఈ అధ్యాయం హేమాడ్ పంత్ ముగిస్తున్నారు. శిష్యులు మూడు రకాలు 1. ఉత్తములు 2. మధ్యములు 3. సాధారణులు. గురువులకు ఏం కావాలో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చే వారు ఉత్తమ శిష్యులు. గురువు ఆజ్ఞానుసారం ఆలస్యం చేయకుండా అక్షరాలా నెరవేర్చే వారు మధ్యములు. మూడవ రకం వారు అడుగడుగునా తప్పులు చేస్తూ గురువు ఆజ్ఞను వాయిదా వేసేవారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి. తోడుగా బుద్ధి కుశలత, ఓరిమి ఉన్నట్లయితే అలాంటి వారికి ఆధాత్మికపరమావధి దూరం కాదు. ఉచ్చ్వాసనిశ్వాసాలను బంధించడం కానీ, హఠయోగం కాని ఇతర కఠినమైన సాధనాలు అన్నీ అనవసరం. పైనచెప్పిన గుణాలు అలవరచుకుంటే, వారు ఉత్తరోత్తరోపదేశాలకు అర్హులు అవుతారు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందడానికి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తారు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యం, చమత్కారాలను గురించి చెప్పుకుందాం.

ఇరవైమూడవ అధ్యాయం సంపూర్ణం 

0 Comments To "Saibaba Satcharitra 23 Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!