Saibaba Satcharitra 7 Adhyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఏడవ అధ్యాయం

అద్భుతావతారము

సాయిబాబా హిందువనుకుంటే వారు మహామ్మదీయుడిలా కనిపించేవారు. మహమ్మదీయుడు అనుకుంటే హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించేవారు. ఆయన హిందువా లేక మహామ్మదీయుడా అన్న విషయం ఇదిమిద్దంగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తంగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపిస్తూ ఉండేవారు. అదే కాలంలో మహమ్మదీయుల చందనోత్సవాన్ని జరపడానికి కూడా అనుమతించేవారు. ఈ ఉత్సవ సమయంలో కుస్తీపోటీలను ప్రోత్సహిస్తూ ఉండేవారు. గెలిచినవారికి మంచి మంచి బహుమతులు యిచ్చేవారు. గోకులాష్టమి రోజున గోపాల్ కాలోత్సవం జరిపించేవారు. ఈదుల్ ఫితర్ పండగకి కొంతమంది మహమ్మదీయులు మసీదులో తజియా లేదా తాబూతు నిలిపి, కొన్ని రోజులు దాన్ని అక్కడ వుంచి తరువాత గ్రామంలో ఊరేగిస్తాము అనే వారు. నాలుగు రోజులవరకు మసీదులో తాబూతు ఉంచడానికి సమ్మతించి అయిదవ రోజు నిస్సంకోచంగా దాన్ని తానే తీసివేసేవారు. వారు మహామ్మదేయులు అంటే హిందువులలాగా చెవులు కుట్టి ఉండేవి. బాబా హిందువు అయితే మసీదులో ఎందుకు ఉండేవారు. మహమ్మదీయుడు అయితే ధుని అనే అగ్నిహోత్రం ఎలా వెలిగించి ఉండేవారు? ఇదే కాకుండా, తిరగలితో విసరటం, శంఖం ఊదటం, గంట వాయించడం, హోమం చేయడం, భజన, అన్నసంతర్పణ, అర్ఘ్యపాద్యాదాలతో పూజలు మొదలైన మహమ్మదీయ మతానికి అంగీకారం కాని విషయాలు మసీదులో జరుగుతూ ఉండేవి. వారు మహమ్మదీయులు అయితే కర్మిష్టులైన సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదాలపై సాష్టాంగ నమస్కారం ఎలా చేస్తూ ఉండేవారు? వారు ఏ తెగవారని అడగబోయిన వారందరూ వారిని సందర్శించిన వెంటనే మూగవాళ్ళు అవుతూ పరవశిస్తూ ఉండేవారు. అందుకే సాయిబాబా హిందువా? మహామ్మదీయుడా? అనేది ఎవరూ సరిగా నిర్ణయించలేక పోయారు. ఇది ఒక వింతకాదు. ఎవరయితే సర్వాన్ని త్యజించి భగవంతుని సర్వస్యశరణాగతి వేడుకుంటారో వారు దేవునితో ఐక్యమైపోతారు. వారికి దేనితోనూ సంబంధం కాని, భేదభావం కాని ఉండదు. వారికి జాతి, మతాలతో ఎలాంటి సంబంధం లేదు. సాయిబాబా అలాంటి వారు. వారికి జాతిలో, వ్యక్తులలో భేదం కనిపించేది కాదు. ఫకీరులతో కలిసి బాబా మత్స్య, మాంసాలను తినేవారు. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినా సణగేవారు కాదు. 

శ్రీసాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వసుకృతం వారి పాదాల దగ్గర కూర్చునే భాగ్యం లభించింది. వారి సాంగత్యం లభించడం నా అదృష్టం. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనంద ఉల్లాసాలు చెప్పలేనటువంటివి. సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనాన్ని, విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదాలను నమ్ముకుంటారో వారికి ఆత్మానుసంధానం కలుగుతుంది. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేకమంది సాయిబాబా దగ్గరికి వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తిరుగుతునప్పటికీ వారి నాలుకపై 'అల్లామాలిక్' అనే మాట ఎప్పుడూ నాట్యంచేస్తూ ఉండేది. వారికి వాదవివాదాలు గాని, చర్చలుగాని యిష్టం ఉండేది కారు. అప్పుడప్పుడూ కోపం వహించినప్పటికీ, వారు ఎప్పుడూ శాంతంగా, సంయమంతో ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వాన్ని బోధిస్తూ ఉండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియలేదు. వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించారు. అందరి అంతరంగాలలో గల రహస్యాలను బాబా తెలుసుకునేవారు. బాబా ఆ రహస్యాలను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యం చెందుతూ ఉండేవారు. వారు సర్వజ్ఞులు అయినప్పటికీ ఏమీ తెలియని వారిలా నటిస్తూ ఉండేవారు. సన్మానములు అంటే వారికి ఏమాత్రం యిష్టం ఉండేది కాదు. సాయిబాబా నైజం అటువంటిది. మానవదేహంతో సంచరిస్తూ ఉన్నప్పటికీ, వారి చర్యలను బట్టి చూస్తే వారు సాక్షాత్తూ భగవంతుడే అని చెప్పాలి. వారిని చూసిన వారు అందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడే అనుకుంటూ ఉండేవారు. వట్టి మూర్ఖుడినైన నేను బాబా మహిమలను ఎలా వర్ణించగలను? షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ-శంకరుడి, గ్రామదేవత, మారుతీ మొదలైన దేవాలయాలన్నింటినీ తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మత్తు చేయించారు. వారి దానగుణం ఎన్నదగినది. దక్షిణ రూపంగా వసూలు అయిన పైకం అంతా ఒక్కక్కరికి రోజు ఒక్కొక్కింటికి రూ 50, రూ 20, రూ 15 చొప్పున ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టే వారు. బాబాను దర్శించినంత మాత్రాన ప్రజలు శుభాలు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులు అవుతూ ఉండేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారుతూ ఉండేవారు. కుష్ఠువ్యాధి వారు కూడా రోగవిముక్తులు అవుతుండేవారు. అనేకమందికి కోరికలు నేరవేరుతూ ఉండేవి, ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండా గుడ్డివారికి చూపు వస్తూ ఉండేది. కుంటివారికి కాళ్ళు వస్తుండేవి, అంతులేని బాబా గొప్పతనాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. వారి కీర్తి నలుమూలలా వ్యాపించాయి. అన్ని దేశాలనుండి భక్తులు షిరిడీకి తండోపతండాలుగా రావడం మొదలుపెట్టారు. బాబా ఎప్పుడూ ధుని ఎదురుగ ధ్యాన నిమగ్నులై కూర్చుని ఉండేవారు. ఒక్కొక్కసారి మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కసారి స్నానం చేసేవారు. మరొక్కప్పుడు స్నానం చేయకుండా ఉండేవారు. తొలిరోజులలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవతి, చొక్కా ధరించేవారు, మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధాలు ఇచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతంగా పనిచేస్తూ ఉండేవి, వారు గొప్ప 'హకీమ్' (వైద్యుడు) అనే పేరు కూడా వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పాలి. ఒక భక్తునికి కళ్ళు వాచి ఎర్రబడ్డాయి. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతన్ని బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సామాన్యంగా అలాంటి రోగులకు అంజనాలు, ఆవుపాలు, కర్పూరంతో చేసిన ఔషధాలు వైద్యులు ఉపయోగించేవారు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దాన్ని పెట్టి గుడ్డతో కట్టు కట్టారు. మరుసటి రోజు ఆ కట్లు విప్పి నీళ్ళను ధారగా పోశారు. కళ్ళలోని పుసి తగ్గి కంటిపాపాలు తెల్లబడి శుభ్రం అయ్యాయి. నల్లజీడి పిక్కలను నూరి కళ్ళలో పెట్టినా సున్నితమైన కళ్ళు మండలేదు. అటువంటి చిత్రాలు అనేకం ఉన్నాయి. కాని అందులో ఇదొకటి మాత్రమే చెప్పబడింది.

 

బాబా యోగాభ్యాసములు

సాయిబాబాకి సకల యోగప్రక్రియలు  తెలిసి ఉండేవి. ధౌతి, ఖండయోగం, సమాధి మొదలైన షడ్విధ యోగప్రక్రియలలో బాబా ఆరితేరినవారు. అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణించబడ్డాయి. మసీదుకు చాలా దూరంలో ఒక మఱ్ఱిచెట్టు ఉంది. అక్కడ ఒక బావి ఉంది. ప్రతి మూడురోజులకు ఒకసారి బాబా అక్కడికి వెళ్ళి ముఖప్రక్షాళనం, స్నానం చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటికి తీసి, వాటిని నీటితో శుభ్రపరచి, పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయడం షిరిడీలోని కొందరు కళ్ళారా చూసి చెప్పారు. మామూలుగా ధౌతి అంటే 3 అంగుళాల వెడల్పు  22 ½ అడుగుల పొడవుగల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉంచి తరువాత తీస్తారు.  కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టం, అసాధారణమైనది.

ఖండయోగం: బాబా తన శరీర అవయవాలన్నీ వేరు చేసి మసీదులో వేర్వేరు స్థలాలలో విడిచిపెట్టేవారు. ఒకరోజు ఒక పెద్దమనిషి మసీదుకు వెళ్ళి బాబా అవయవాలు వేర్వేరు స్థలాలో పడి ఉండటం చూసి భయకంపితుడై బాబాని ఎవరో ఖూనీ చేశారు అనుకుని గ్రామ మునసబు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ మొట్టమొదటి ఫిర్యాదు చేసినవారికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉంటుందని తననే అనుమానిస్తారని భయపడి ఊరుకున్నాడు. మరుసటి రోజు మసీదుకు వెళ్ళగా, బాబా ఎప్పటిలా హాయిగా కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు. ముందురోజు తాను చూసినది అంతా భ్రాంతి అనుకున్నాడు. చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేస్తూ ఉండేవారు. వారి యోగస్థితి ఎవ్వరికీ అంతుబట్టనిది. రోగుల దగ్గరనుండి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా చికిత్స చేస్తూ ఉండేవారు. ఎందరో పేదలు, శరణార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందారు. నిస్వార్థంగా వారు చేసే సత్కార్యాల వల్లనే వారికి గొప్ప  కీర్తి వచ్చింది. బాబా తమ సొంతం కోసం ఏమీ చేయకుండా, ఇతరుల మేలు కోసమే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదాన్ని ఈ క్రింద పేర్కొంటాను. దీన్ని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ్ర హృదయం తెలుస్తుంది.

బాబా సర్వంతర్యామిత్వము, కారుణ్యము

1910వ సంవత్సరం (ఘనత్రయోదశి రోజు) అంటే దీపావళి పండగ ముందురోజు బాబా ధుని దగ్గర కూర్చుని చలికాచుకుంటూ, ధునిలో కట్టెలు వేయసాగారు. ధుని బాగా మండుతుంది. కొంతసేపటి తరువాత హఠాత్తుగా కట్టెలకు బదులు తన చేతిని ధునిలో పెట్టి, చిశ్చలంగా వుండిపోయారు. మంటలకు చేతులు కాలిపోయాయి. మాధవుడు అనే నౌకరు, మాధవరావు దేశ్ పాండే దీన్ని చూసి వెంటనే బాబా వైపు పరిగెత్తారు. మాధవరావు దేశ్ పాండే బాబా నడుముని పట్టుకుని బలంగా వెనక్కు లాగారు. 'దేవా! ఇలా ఎలా చేశారు?' అని బాబాని అడిగారు. (వేరే లోకంలో ఉన్నట్టున్న) బాబా బాహ్యస్మ్రుతి తెచ్చుకుని 'ఇక్కడికి చాలా దూరంలో ఒక కమ్మరి  స్త్రీ తన బిడ్డను ఒడిలో పెట్టుకుని, కొలిమిని ఊదుతూ ఉంది. అంతలో ఆమె భర్త ఆమెను పిలిచాడు. తన ఒడిలో బిడ్డ వున్న సంగతిని మరచిపోయి ఆమె త్వరగా లేచింది. బిడ్డ మండుతున్న కొలిమిలో పడిపోయాడు. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించాను. నా చేయి కాలితే కాలింది. అది నాకంత బాధాకరం కాదు. కాని బిడ్డ రక్షింపబడ్డాడు అనే విషయం నాకు ఆనందాన్ని కలగచేస్తుంది' అని జవాబు ఇచ్చారు.

కుష్టిరోగి భక్తుని సేవ

బాబా చెయ్యి కాలింది అనే విషయం మాధవరావు దేశ్ పాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబు ఛాందొర్కర్ వెంటనే బొంబాయినుండి డాక్టర్ పరమానంద్ అనే ప్రఖ్యాత వైద్యుణ్ణి వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరుకున్నారు. చికిత్స చేయడానికి డాక్టరుకి కాలిన చేయి చూపించమని నానా కోరుకున్నాడు. బాబా అందుకు ఒప్పుకోలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీషిండే అనే కుష్టిరోగి ఎదో ఆకువేసి కట్టు కట్టేవాడు. నానా ఎంత వేడుకున్నా బాబా డాక్టరుగారి చేత చికిత్స చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. డాక్టరుగారు కూడా అనేకసార్లు వేడుకున్నారు. 'అల్లాయే తన వైద్యుడు' అని 'తనకు ఏమాత్రం బాధగా లేద'ని చెపుతూ, ఎలాగో డాక్టరుచేత చికిత్స చేయించుకోవడానికి దాట వేయసాగారు. అందుకు డాక్టరు మందుల పెట్టే మూతైనా తీయకుండానే తిరిగి బొంబాయి వెళ్ళిపోయారు. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించింది. ప్రతిరోజూ భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టు కడుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత గాయం మానిపోయింది అందరూ సంతోషించారు. అప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉందా అనే సంగతి ఎవరికీ తెలియదు. కానీ, ప్రతి రోజూ ఉదయం భాగోజీ పట్టీలను విప్పి, బాబా చేతిని నేతితో తోమి, తిరిగి కట్టు కడుతూ ఉండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండేది. మహా సిద్ధపురుషుడు అయిన బాబాకి ఇదంతా నిజానికి అవసరం లేకపోయినప్పటికీ తన భక్తుడైన భాగోజీ పట్ల గల ప్రేమతో అతడు చేసే ఉపాసనను తీసుకున్నారు. బాబా లెండీకి వెళ్ళినప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడుస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం బాబా ధుని దగ్గర కూర్చోగానే భాగోజీ తన సేవాకార్యక్రమాన్ని మొదలుపెట్టేవాడు. భాగోజీ గతజన్మలో చేసిన పాపఫలితంగా ఈ జన్మలో కుష్ఠురోగంతో బాధపడుతుండే వాడు. కాని వ్రేళ్ళు ఈడ్చుకుని పోయి ఉండేవి, వాడి శరీరం అంతా చీము కారుతూ, దుర్వాసన కొడుతూ ఉండేది. బాహ్యానికి అతడు ఎంతో దురష్టవంతుడిలా కనిపించినప్పటికీ అతడు అత్యంత అదృష్టశాలి, సంతోషి. ఎందుకంటే అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసాన్ని పూర్తిగా అనుభవించినవాడు. 

ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి

బాబా విచిత్రలీలలలో ఇంకొక దాన్ని వర్ణిస్తాను. అమరావతి నివాసి అయిన దాదాసాహెబు ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని రోజులు వుంది. ఒకరోజు ఖాపర్డే కుమారుడికి తీవ్రంగా జ్వరం వచ్చింది. అది ప్లేగు జ్వరం క్రింద మారింది. తల్లి చాలా భయపడింది. షిరిడీ విడిచి అమరావతి వెళ్ళిపోవాలని అనుకుని సాయంకాలం బాబా బూటీవాడా దగ్గరకి వస్తున్నాడు వారిని సెలవు అడగబోయింది. గద్గదకంఠంతో తన చిన్నకొడుకు ప్లేగుతో పడి వున్నడని బాబాకు చెప్పింది. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇలా అన్నారు 'ప్రస్తుతం ఆకాశం మబ్బుపట్టి వుంది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలంగా అవుతుంది.' అని అంటూ బాబా కఫ్నీని పైకి ఎత్తి చంకలో కోడిగుడ్డంత పరిమాణంలో ఉన్న నాలుగు ప్లేగు పొక్కులను చూపెడుతూ 'నా భక్తుల కోసం నేను ఎలా బాధపడతానో చూడు! వారి కష్టాలన్నీ నావే!' ఈ మహాద్భుత లీలలను చూసిన ప్రజలకు, మహాత్ముల మనస్సు మైనం కన్నా మెత్తనిది, వెన్నెలా మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారం ఏదీ ఆశించక ప్రేమిస్తారు. భక్తులనే తమ స్వజనులుగా భావిస్తారు.

బాబా పండరి ప్రయాణం

సాయిబాబా తన భక్తులను ఎలా ప్రేమిస్తూ ఉంటారో అలాగే వారి కోరికలను, ఆవరాలను ఎలా గ్రహిస్తూ ఉంటారో  అనే కథను చెప్పి ఈ అధ్యాయం ముగిస్తాను. నానాసాహెబు ఛాందొర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేషులోని నందూరుబారులో మామల్త దారుగా ఉండేవారు. అతనికి పండరీ పురానికి బదిలీ అయ్యింది. సాయిబాబాలో అతనికి గల భక్తి అనే ఫలం ఆ రోజుకి పండింది. పండరీపురాన్ని భూలోక వైకుంఠం అనే వారు. అలాంటి స్థలానికి బదిలీ కావడంతో అతను గొప్ప ధన్యుడు, నానాసాహెబు వెంటనే పండరీపురానికి వెళ్ళి ఉద్యోగంలో చేరవలసి వుంది. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరం వ్రాయకుండా, హుటాహుటిన పండరిపురానికి ప్రయాణమయ్యారు. ముందుగా షిరిడీకి వెళ్ళి తన విఠోబా అయిన బాబాను దర్శించి, ఆ తరువాత పండరీపురానికి వెళ్లిపోవాలి అనుకున్నారు. నానాసాహెబు షిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడు కావడంతో గ్రహించారు. నానాసాహెబు నీంగావ్ చేరుకునేసరికి షిరిడీ మసీదులో కలకలం చెలరేగింది. బాబా మసీదులో కూర్చుని మహాల్సాపతి, అప్పాషిండే, కాశీరాములతో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా బాబా వారితో ఇలా అన్నారు 'మన నలుగురం కలిసి భజన చేద్దాం. పండరీ ద్వారాలు తెరిచారు. కాబట్టి ఆనందంగా పాడదాం  లేవండి'. అందరూ కలిసి పాడుతూ ఉన్నారు. ఆ పాట యొక్క భావం ఏమిటంటే 'నేను పండరి వెళ్ళాలి. నేనక్కడే నివశించాలి. ఎందుకంటే, అదే నా ప్రభువు యొక్క ధామం' అలా బాబా పాడుతూ ఉన్నారు. భక్తులందరూ బాబాను అనుసరించారు. కొంత సమయానికి నానాసాహెబు కుటుంబసమేతంగా వచ్చి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి, తనకు పండరీపురానికి బదలీ అయిందని, బాబా కూడా వారితో పండరీపురానికి వచ్చి ఉండవలసింది అనీ వేడుకున్నారు. అలా బతిమిలాడ్డం అవసరం లేదు. ఎలా అంటే బాబా అప్పటికే పండరేపురానికి వెళ్లాలని, అక్కడే ఉండ వలెనన్న భావాన్ని వెలిబుచ్చుతున్నారని మిగిలిన భక్తులు చెప్పారు. ఇది విని  నానాసాహెబు మనస్సు కరిగి బాబా పాదాలపై పడ్డాడు. బాబా యొక్క ఊదీ ప్రసాదాన్ని, ఆశీర్వాదాన్ని, ఆజ్ఞను పొంది, నానాసాహెబు పండరీపురానికి వెళ్ళారు. ఇలా బాబా లీలలకు అంతులేదు.

ఏడవ అధ్యాయం సంపూర్ణం

మొదటిరోజు పారాయణము సమాప్తము 

ఎనిమిదవ అధ్యాయం 

 

0 Comments To "Saibaba Satcharitra 7 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!