Saibaba Satcharitra 24 Adyayam

 

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైనాలుగవ అధ్యాయం

బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల

 

ఈ అధ్యాయంలో కాని, వచ్చే అధ్యాయంలో కానీ ఫలానాది చెపుతాం అనడం ఒక విధంగా అహంకారమే. మన సద్గురువు పాదాలకు అహంకారాన్ని సమర్పించి కానీ, మన ప్రయత్నంలో జయం పొందము. మనం అహంకార రహితులం అయితే మన జయం నిశ్చయం.

సాయిబాబాను పూజించడంతో ఇహపర సౌఖ్యాలు రెండింటినీ పొందవచ్చు. మన మూల ప్రకృతిలో పాతుకుని, శాంతి సౌఖ్యాలను పొందుతాం. కాబట్టి ఎవరయితే తమ క్షేమాన్ని కోరుకుంటారో వారు గౌరవ ఆదరాలతో సాయిబాబా లీలలను వినాలి, మననం చేసుకోవాలి. దీన్ని నెరవేరిస్తే వారు సులభంగా జీవితపరమావధిని పొందగలరు. చివరికి మోక్షానందం పొందుతారు. సాధారణంగా అందరూ హాస్యం, చమత్కార భాషణాలు ఇష్టపడతారు కాని, తాము హాస్యాస్పదం కావడానికి ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడుకున్నప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా ఉండేది. కాబట్టి ప్రజలు తాము వెక్కిరింతల పాలు అయినప్పటికే అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయాన్ని ఈ క్రింద తెలుపుతున్నారు.

శనగల కథ

షిరిడీలో ఆదివారం రోజున సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెలనుండి ప్రజలు వచ్చి వీథులలో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముకుంటూ ఉండేవారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండుకునేది. ముఖ్యంగా ఆదివారం రోజున కిక్కిరిసి పోతూ ఉండేది. ఒక ఆదివారం రోజు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదాలు ఒత్తుతూ మనస్సులో జపం చేస్తూ ఉన్నారు. బాబా ఎడమవైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉన్నారు. శ్రీమాన్ బూటీ, కాకాసాహెబు దీక్షిత్ మొదలైనవారు కూడా ఉన్నారు. శ్యామా నవ్వుతూ అన్నా సాహెబుతో 'నీ కోటుకి శనగగింజలు అంటుకున్నట్టున్నాయి చూడు' అన్నారు. అలా అంటూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలాయి. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమచేతి ముందు భాగాన్ని చాచారు. అందరికీ ఆశ్చర్యం కలిగేలా కొన్ని శనగగింజలు క్రిందకి దొర్లటం ప్రారంభించాయి. అక్కడ ఉన్నవారు వాటిని ఏరుకున్నారు.

ఈ సంఘటన హాస్యానికి తావిచ్చింది. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలోకి ఎలా ప్రవేశించి ఉంటాయో ఊహించడం ప్రారంభించారు. శనగలు చొక్కాలో ఎలా దూరి అక్కడ నిలవగలిగాయో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకపోయారు. ఎవ్వరికీ సరైన సమాధానం తోచక జవాబు ఇవ్వనప్పుడు అందరూ ఈ అద్భుతానికి ఆశ్చర్యపడుతుండగా, బాబా 'వీనికి (అన్నా సాహెబుకు) తానొక్కడే తినే దుర్గుణం ఒకటి ఉంది. ఈనాడు సంతరోజు శనగలు తింటూ ఇక్కడికి వచ్చాడు. వాని నైజం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఆశ్చర్యం ఏముంది?’ అన్నారు.

హేమాడ్ పంతు :'బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణం నాపై ఎలా మోపుతారు? ఈనాటికీ ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూసి ఎరుగను. ఈ రోజు కూడా నేను సంతకు వెళ్ళలేదు. అలా అయితే నేను శనగలు ఎలా కోని ఉంటాను? నేను కొననప్పుడు నేను ఎలా తిని వుంటాను. నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీ తిని ఎరుగను.

బాబా : అవును అది నిజమే. దగ్గరున్న వారికి ఇస్తావు. ఎవరూ దగ్గర లేనప్పుడు నీవుగాని, నేను గాని ఏమి చేయగలం? కానీ నీవు తినడానికి ముందు నన్ను స్మరిస్తావా? నేను ఎల్లప్పుడూ నీ చెంత లేనా? నీవు ఏదైనా తినడానికి ముందు నాకు అర్పిస్తున్నావా?’

నీతి: ఈ సంఘటనలో బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనిద్దాం. పంచేంద్రియాల కంటే ముందు మనస్సు , బుద్ధి విషయ ఆనందాన్ని అనుభవిస్తుంది. కాబట్టి మొదటే భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇది కూడా ఒక విధంగా భగవంతుడికి అర్పితం అవుతుంది విషయాలను విడిచి అర్పించినట్లయితే వాటిలోని అభిమానం సహజంగా అదృశ్యం అయిపోతుంది. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మొదలైన వాటి గురించిన వృత్తులు అన్నింటినీ (ఆలోచనలు) మొట్టమొదట గురువుకి అర్పించాలి. ఈ అభ్యాసం ఆచరించినట్లయితే దేవుడు వృత్తులన్నీ నిర్మూలన అవడానికి సహాయపడతాయి. విషయాలను అనుభవించే ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావిస్తే, ఆ వస్తువును అనుభవించవచ్చా? లేదా? అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఏది అనుభవించడానికి తగదో దాన్ని విడిచిపెడతాం. ఈ విధంగా మన దుర్గుణాలు అన్నీ నిష్క్రమిస్తాయి. మన శీలం చక్కబడుతుంది. గురువు పట్ల ప్రేమ వృద్ధి చెందుతుంది. శుద్ధజ్ఞానం మొలకెత్తుతుంది. ఈ జ్ఞానం వృద్ధిపొందినప్పుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్య ఘనంతో లీనం వుతుంది. అప్పుడే మనకు ఆనందం, సంతృప్తి కలుగుతాయి. గురువుకి, దేవుడికి ఎవరు భేదం ఎంచుతారో వారు దైవాన్ని ఎక్కడా చూడలేరు. భేదాలు అన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును, దేవుణ్ణి ఒకటిగా భావించాలి. ఈ ప్రకారంగా గురువుని సేవించినట్లయితే భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందుతాడు. మన మనస్సులను స్వచ్చంగా చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదిస్తుంది. క్లుప్తంగా చెప్పేది ఏమిటంటే మనం గురువుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియాలతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షిస్తే మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞాపకానికి ఉంచుకుంటాము. మనకు బాబా ధ్యాస ఎన్నో రెట్లు వృద్ధిచెందుతుంది. బాబా సగుణస్వరూపం మన కళ్ళ ఎదుట నిలుస్తుంది. అప్పుడు భక్తి, వైరాగ్యం, మోక్షం మన వశం అవుతాయి. మన మనస్సులో బాబాను ఎప్పుడయితే నిలుపుకుంటామో అప్పుడు మనం ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరచిపోతాం. ప్రపంచ సుఖాలలో ఉన్న అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందాన్ని పొందుతాయి.

సుధాముని కథ

పై కథ చెబుతున్న సమయంలోనే హేమాడ్ పంత్ కి సుధాముని కథ గుర్తుకు వచ్చింది, అందులో కూడా ఇదే నీతి కథ వుంది. కాబట్టి దాన్ని ఇక్కడ చెపుతున్నాం.

శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుధాముడు అనే వాడు గురువుగారు అయిన సౌందీపని ఆశ్రమంలో నివశిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణబలరాములను అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపించారు. సౌందీపని భార్య సుధామునికి  ముగ్గురి కోసం శనగలు ఇచ్చి పంపించింది. కృష్ణుడు, సుధాముని అడవిలో కలుసుకుని, ‘దాదా, నీళ్ళు కావలి, నాకు దాహం వేస్తుంది' అన్నాడు.సుధాముడు 'ఉత్తకడుపుతో నీరు త్రాగాకూడదు, కాబట్టి కొంచెం సేపు ఆగడం మంచిది' అన్నాడు. కానీ తన దగ్గర శనగలు ఉన్నాయి, కొంచెం తినమని అడగలేదు. శ్రీకృష్ణుడు అలసిపోయి ఉండడంతో సుధాముని తొడపై తలపెట్టి గుర్రుపెడుతూ నిద్రపోయాడు. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినడానికి ఉపక్రమించాడు. హఠాత్తుగా శ్రీకృషుడు ఇలా అన్నాడు 'దాదా! ఏమి తింటున్నావు? ఎక్కడనుంచి ఆ శబ్దము వస్తున్నది?’సుధాముడు ఇలా అన్నాడు 'తినడానికి ఏమున్నది? నేను చలితో వణుకుతున్నాను. నా పళ్ళు కటకటా అంటున్నాయి. విష్ణుసహస్రనామం కూడా సరిగ్గా ఉచ్చరించలేకుండా ఉన్నాను.’ ఇది విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు 'నేనొక స్వప్నం చూశాను. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తింటున్నాడు. ఏమి తింటున్నావు అని అడగ్గా ఏముంది తినడానికి మన్నా' అన్నాడు. అంటే తినడానికి ఏమీ లేదని భావం. రెండవవాడు'తథాస్తు' అన్నాడు. దాదా! ఇది ఒక స్వప్నం. నాకు ఇవ్వకుండా నువ్వు తినవని నాకు తెలుసు. స్వప్న ప్రభావంతో నీవు ఏమి తింటున్నావు అని అడిగాను'. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు అని గాని, అతని లీలలుగాని తెలిసి ఉన్నట్లయితే సుధాముడు అలా చేసి ఉండడు. కాబట్టి అతడు చేసినదాన్ని తానే అనుభవించవలసి వచ్చింది. శ్రీకృష్ణ ప్రియమిత్రుడు అయినప్పటికీ అతని ఉత్తరాకాలం అంతా గర్భదారిద్ర్యంతో బాధపడవలసి వచ్చింది. కొన్నాళ్ళకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపించిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించడానికి ఇచ్చాడు. ఎవరికి అయితే దగ్గర ఉన్నవారికి ఇవ్వకుండా తినే అలవాటు ఉంటుందో వారు దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.

శృతి కూడా దీన్నే నొక్కి చెపుతుంది. మొదట భగవంతుడికి అర్పించి ఆ భుక్త శేషాన్నే మనం అనుభవించాలి. బాబా కూడా దీన్నే హస్యరూపంగా యుక్తితో బోధించాడు.

 

అన్నా చించణీకారు, మావిశీబాయి

హేమాడ్ పంతు ఇక్కడ ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వాన్ని వర్ణించారు. దామోదర్ ఘనశ్యామ్ బాబరె ఉరఫ్ అన్నా చించణీకరు అనే భక్తుడు ఒకడు ఉన్నాడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరినీ లక్ష్యపెట్టేవాడు కాదు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడు. ఎప్పటిది అప్పుడే తేల్చుకునేవాడు. బయటికి కఠినంగాను, హఠం చేసేవాడిలాగా కనిపించినా, వాడు మంచి హృదయం కలవాడు. నక్కజిత్తులవాడు కాదు. అందుకే బాబా వాణ్ణి ప్రేమిస్తూ ఉండేవారు. అందరూ సేవ చేసినట్లయితే అతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమచేతిని (కఠడా పైన వేసి ఉన్నదాన్ని) తోముతూ ఉండేవాడు. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అనే ఆమె ఉంది. ఆమెను బాబా 'అమ్మ' అని పిలిచేవారు. ఇతరులు మావిశీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవిస్తూ ఉండేది. ఈమెది స్వచ్చమైన హృదయం. ఆమె బాబా నడుము, మొలను,వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి దానితో నొక్కుతూ ఉండేది. ఆమె దీన్ని అతి తీవ్రంగా చేస్తూ ఉంది. బాబా వీపు కడుపు కలిసిపోయినట్లు కనిపిస్తూ ఉండేది. ఇంకొక ప్రక్క అన్నా తోముతూ ఉన్నాడు. మావిశీబాయి ముఖం క్రిందికి మీదికి అవుతూ ఉంది. ఒకసారి ఆమె ముఖం అన్నా ముఖానికి చాలా దగ్గరగా వెళ్ళింది.

హస్యమాడే నైజం కలది కావడంతో ఆమె 'ఓహో! అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంత ముసలివాడు అయినప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదా?’ అంది. అన్నాకు కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకి ఎత్తి అతను ఇలా అన్నాడు 'నేను ముసలివాడిని, దుర్మార్గుడిని అంటున్నావు. నేను వెఱ్ఱివాడినా? నీవే కలహానికి కాలు దువ్వుతున్నావు.’ అక్కడ ఉన్నవారందరూ ఈ ముసలివాళ్ళ కలహాన్ని చూసి నవ్వుతున్నారు. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కాబట్టి ఇద్దరినీ ఓదార్చాలని తలచి ఈ విధంగా నేర్పుతో సమాధాన పరిచారు. బాబా ప్రేమతో 'ఓ అన్నా! ఎందుకు అనవసరంగా గోల చేస్తున్నావు? తల్లిని ముద్దుపెట్టుకుంటే దానిలో అనౌచిత్యం ఏమిటి?’ అన్నారు. బాబా మాటలు విని, ఇద్దరూ సంతుష్టులు అయ్యారు. అందరూ సరదాగా నవ్వారు. బాబా చమత్కారానికి హృదయానంద పూరితులు అయ్యారు.

బాబా నైజం, భక్తి పారాయణత్వం

బాబా తన భక్తులకు వారివారి ఇష్టానుసారం సేవ చేయడానికి అనుమతి ఇస్తూ ఉండేవారు. దీనిలో ఇతరులు జోక్యం కలగచేసుకోవడం బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణ ఇస్తాము. ఈ మావిశీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముతూ ఉంది. ఆమె ప్రయోగించే బలాన్ని చూసి ఇతర భక్తులు ఆత్రపడ్డారు. వారు ఇలా అన్నారు 'అమ్మా!కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరాలు తెగిపోగలవు'. ఇలా అనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టారు. వారి కళ్ళు నిప్పుకణంలా ఎర్రబడ్డాయి. బాబాను చూడడానికి ఎవరికీ ధైర్యం లేకపోయింది. బాబా సటకా చివరిని రెండు చేతులతో పట్టుకుని పొత్తికడుపులోకి గుచ్చుకున్నారు. ఇంకొక చివరిని స్తంభానికి ఆనించారు. సటకా అంత పొత్తికడుపులో దూరినట్లు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటిలో పొత్తికడుపు పేలిపోతుంది అనుకున్నారు. బాబా క్రమంగా స్తంభం వైపు వెళ్తూ ఉన్నారు. అందరూ భయపడ్డారు, ఆశ్చర్యంతోను, భయంతోనూ మాట్లాడలేక మూగవాళ్ళలా నిలిచిపోయారు. బాబా తన భక్తురాలి కోసం ఈ కష్టం అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోము అన్నారు. మంచి ఉద్దేశ్యంతో వారు ఈ మాటలు అన్నారు. దీనికి కూడా బాబా ఒప్పుకోలేదు. వారి మంచి ఉద్దేశ్యమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపోయారు. ఏమీ చేయలేక కనిపెట్టి చూస్తూ ఉన్నారు. అదృష్టంతో బాబా కోపం తగ్గింది. సటకాను విడిచి గద్దెపై కూర్చున్నారు. అప్పటినుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేస్తున్నప్పుడు ఇతరులు జోక్యం చెడుకో కూడదు అనే నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎలాంటిదో బాబాకే గుర్తు.

ఇరవైనాలుగవ అధ్యాయం సంపూర్ణం 

Products related to this article

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain..

$1.00

0 Comments To "Saibaba Satcharitra 24 Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!