Saibaba Satcharitra 27Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

ఇరవైఏడవ అధ్యాయం

భాగవతము, విష్ణుసహస్రనామములనిచ్చి అనుగ్రహించుట

1. దీక్షిత్ యొక్క విఠల్ దర్శనం 2. గీతారహస్యము 3. ఖాపర్డే దంపతులు

బాబా మతగ్రంథాలను తమ స్వహస్తాలతో స్పృశించి పవిత్రం చేసి వాటిని తమ భక్తులకు పారాయణం కోసం ప్రసాదిచడం మొదలైనవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం.

మానవుడు సముద్రంలో మునిగిన వెంటనే, అన్ని తీర్థాలను, పుణ్యనదులలోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అలాగే మానవుడు సద్గురువు పాదారవిందాలను ఆశ్రయించగానే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మాన్ని నమస్కరించిన ఫలితం కూడా లభిస్తుంది. కోరికలను నెరవేర్చే కల్పతరువు, జ్ఞానానికి సముద్రాన్ని, మనకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేటువంటి శ్రీసాయిమహారాజుకు జయం అగుగాక! ఓ సాయి! నీ కథలలో శ్రద్ధను కలగజేయి. చాతపక్షి మేఘం నీళ్ళు తాగి ఎలా సంతోషిస్తుందో, అలాగే నీ కథలను చదివేవారూ,వినేవారూ అత్యంత ప్రీతితో వాటిని గ్రహిస్తారుగాక! నీ కథలు వింటున్నప్పుడు వారికి, వారి కుటుంబాలకు సాత్వికభావాలు కలుగుగాక! వారి శరీరాలు చెమర్చుగాక! వారి నేత్రాలు కన్నీటితో నిండుగాక! వారి ప్రాణాలు స్థిరపడుగాక! వారి మనస్సులు ఏకాగ్రత అగుగాక! వారికి గగ్గుర్పాటు కలుగుగాక! వారు వెక్కిళ్ళతో ఏడిచి వణికెదరుగాక! వారిలో ఉన్న వైషమ్యాలు తరతమ భేదాలు నిష్క్రమించుగాక! ఇలా జరిగినట్లు అయితే గురువుగారి కటాక్షం వారిపై ప్రసరించింది అని అనుకోవాలి. ఈ భావాలు నీలో కలిగినప్పుడు, గురువు అమితంగా సంతోషించి ఆత్మసాక్షాత్కారానికి దారి చూపిస్తారు. మాయా బంధాల నుండి స్వేచ్చ పొందడానికి బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడుకోవాలి. వేదాలు నిన్ను మాయ అనే మహాసముద్రాన్ని దాటించలేదు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటిలో భగవంతుడిని చూసినట్లు చేయగలరు.

గ్రంథాలను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట

ముందటి అధ్యాయంలో బాబా బోధలు చేసే తీరులను చూశాము. అందులో ఇంకొక దాన్ని ఈ అధ్యాయంలో చూద్దాం. కొందరు భక్తులు మతగ్రంథాలను పారాయణ చేయడానికి బాబా చేతికి ఇచ్చి బాబా పవిత్రం చేసిన తరువాత వాటిని పుచ్చుకునేవారు. అలంటి గ్రంథాలు పారాయణ చేసేటప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించేవారు. ఒకరోజు కాకామహాజని ఏకనాథభాగవతాన్ని తీసుకుని షిరిడీకి వచ్చారు. శ్యామా ఆ పుస్తకాన్ని చదవడానికి తీసుకుని మసీదుకు వెళ్ళారు. అక్కడ బాబా దాన్ని తీసుకుని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకి ఇచ్చి దాన్ని తన దగ్గర ఉంచుకోమని అన్నారు. అది కాకా పుస్తకం అనీ, అందుకే దాన్ని అతనికే ఇచ్చెయ్యాలని శ్యామా చెప్పాడు. కాని బాబా 'దాన్ని నేను నీకు ఇచ్చాను. దాన్ని జాగ్రత్తగా నీ దగ్గర ఉంచు. అది నీకు పనికి వస్తుంది' అన్నారు. ఆ ప్రకారంగా బాబా అనేక పుస్తకాలను శ్యామా దగ్గర ఉంచారు. కొన్ని రోజుల తరువాత కాకామహాజని తిరిగి భాగవతం తెచ్చి బాబాకి ఇచ్చారు. బాబా దాన్ని తాకి ప్రసాదంగా మహాజనికే ఇచ్చి దాన్ని భద్రపరచు అని అన్నారు. అది అతనికి మేలు చేస్తుంది అన్నారు. కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీకరించారు.

శ్యామా విష్ణుసహస్రనామముల పుస్తకం : శ్యామా బాబాకు అత్యంత ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయాలని నిశ్చయించుకుని విష్ణుసహస్రనామాన్ని ప్రసాదంగా ఇచ్చారు. దాన్ని ఈ క్రింది విధంగా జరిపారు.

ఒకప్పుడు ఒక రామదాసి (సమర్థ రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చారు. కొన్నాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రతోరోజూ ఉదయమే లేచి, ముఖం కడుక్కుని, స్నానం చేసి, పట్టుబట్టలు ధరించి, విభూతి పూసుకుని విష్ణుసహస్రనామాన్ని, ఆధ్యాత్మిక రామాయణాన్ని శ్రద్ధతో పారాయణ చేస్తుండేవాడు. అతడు ఈ గ్రంథాలను అనేకసార్లు పారాయణ చేశారు. కొన్ని రోజుల తరువాత బాబా శ్యామకు మేలు చేయాలనీ నిశ్చయించుకుని విష్ణుసహస్రనామ పారాయణ చేయించాలి అనుకున్నారు. కాబట్టి రామదాసిని పిలిచి తమకు కడుపునోప్పిగా ఉందనీ, సోనా ముఖి తీసుకుంటేగాని నొప్పి తగ్గదని, కాబట్టి బజారుకు వెళ్ళి ఆ మందును తీసుకుని రమ్మని కోరారు. పారాయణను ఆపి రామదాసి బజారుకు వెళ్ళారు. బాబా తన గద్దె దిగి రామదాసి పారాయణ చేసే స్థలానికి వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకాన్ని తీసుకుని తమ స్థానానికి తిరిగి వచ్చి ఇలా అన్నారు 'ఓ శ్యామా! ఈ గ్రంథం అత్యంత విలువైనది. ఫలమైనది కాబట్టి నీకు ఇది బహుకరిస్తున్నాను. నీవు దీన్ని చదువు. ఒకప్పుడు నేను అత్యంత బాధపడ్డాను. నా హృదయం కొట్టుకుంది, నా జీవితం అపాయంలో ఉండేది. అలాంటి సందిగ్ధస్థితిలో నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకున్నాను. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసింది. అల్లాయే స్వయంగా వచ్చి బాగుచేశారని అనుకున్నాను. అందుకే దీన్ని నీకు ఇస్తున్నాను.దీన్ని కొంచెం ఓపికగా చదువు. రోజుకి ఒక నామం చదివినా మేలు కలిగిస్తుంది.’శ్యామా తనకి పుస్తకం అక్కరలేదు అన్నారు. ఆ పుస్తకం రామదాసిది, అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి. కాబట్టి వాడితో గొడవ అవుతుంది, మరియు తాను అనాగారికుడు కావడంతో దేవనాగరి అక్షరాలు చదవలేను అన్నాడు.

వినోదం కోసం తనకి రామదాసితో బాబా గొడవ కలిగిస్తున్నాడు అని శ్యామా అనుకున్నాడేగానీ, బాబా తనకు మేలు కలిగిస్తున్నాడు అని అనుకోలేదు. బాబా ఆ సహస్రనామం అనే మాలను శ్యామా మెడలో వేయాలని నిశ్చయించుకున్నారు. అతడు అనాగారికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధలనుండి తప్పించాలి అని కోరుకున్నారు. భగవన్నామ ఫలితం అందరికీ తెలిసిందే. సకల పాపాల నుండి దురాలోచనల నుండి, చావుపుట్టుకల నుండి అది మనలని తప్పిస్తుంది. దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనం చేయడంతో అత్యంత సమర్థమైనది. దానికి ఎలాంటి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమాలు ఏవీ లేవు. అది అత్యంత సులభమైంది, ఫలప్రదమైంది. శ్యామకు ఇష్టం లేనప్పటికీ వారితో దాన్ని అభ్యసింప చేయాలని బాబాకు దయ కలిగింది. కాబట్టి దాన్ని బాబా అతడిపై బలవంతంగా రుద్దారు. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథమహారాజు బలవంతంగా విష్ణుసహస్రనామాన్ని ఒక బీద బ్రాహ్మణుడితో పారాయణ చేయించి వాణ్ణి రక్షించారు. విష్ణుసహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమయిన చక్కబట్టి దాన్ని బాబా శ్యామాకు బలవంతంగా ఇచ్చారు.

రామదాసి త్వరగా సోనాముఖి తీసుకుని వచ్చారు. అన్నా చించణీకర్ అక్కడే ఉన్నాడు. నారదుడిలా నటించి జరిగింది అంతా అతనికి చెప్పాడు. రామదాసి వెంటనే కోపంతో మండిపడి కోపంతో శ్యామాపై పడి, శ్యామానే కడుపునొప్పి అన్న సాకుతో బాబా తనను బజారుకు పంపించేలా చేసి ఈ లోపల పుస్తకం తీసుకున్నాడు అన్నాడు. శ్యామాను తిట్టడం ఆరంభించి, పుస్తకం ఇవ్వకపోతే తల పగలగొట్టుకుంటాను అని అన్నాడు. శ్యామా మెల్లగా సమాధానం ఇచ్చాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇలా అన్నారు ' ఓ రామదాసీ! ఏమి సమాచారం? ఎందుకు చికాకు పడుతున్నావు? శ్యామా మనవాడు కాదా? అనవసరంగా వాడిని ఎలా తిడతావు? ఎందుకు జగడం ఆడుతున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథాలను నిత్యం పారాయణ చేస్తున్నావు కానీ, ఇంకా నీ మనస్సు అపవిత్రంగాను, అస్వాధీనంగానూ ఉన్నట్టుంది. నీవు ఎలాంటి రామదాసివయ్యా? సమస్త విషయాలలో నీవు నిర్మలునిగా ఉండాలి. నీవు అ పుస్తకాన్ని అంతగా కావాలనుకోవడం వింతగా ఉంది. నిజమైన రామదాసికి మమత కాకుండా నమ్రత ఉండాలి. ఒక పుస్తకం కోసం శ్యామాతో పోరాడుతున్నావా? వెళ్ళు, నీ స్థలంలో కూర్చో. దానం ఇస్తే పుస్తకాలు అనేకం వస్తాయి. కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించుకో, తెలివిగా ప్రవర్తించు. నీ పుస్తకం విలువ ఎంత? శ్యామకు దానితో ఎలాంటి సంబంధం లేదు. నేనే దాన్ని తీసుకుని అతనికి ఇచ్చాను. నీకది కంఠస్థం కదా, కాబట్టే శ్యామా దాన్ని చదివి మేలు పొందుతాడు అనుకున్నాను, అందుకే దాన్ని అతనికి ఇచ్చాను.’ 

బాబా పలుకులు ఎంత మధురంగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యంగా ఉన్నాయి! వాటి ప్రభావం విచిత్రమైనది. రామదాసి శాంతించాడు. దానికి బదులు పంచరత్నగీత అనే గ్రంథాన్ని శ్యామా దగ్గర తీసుకుంటాను అన్నారు. శ్యామా సంతోషించి 'ఒక్కటే ఎందుకు పది పుస్తకాలు ఇస్తాను' అన్నాడు. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చారు. ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే రామదాసి పంచరత్నగీత ఎలా కోరుకున్నాడు? అతడిలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. ప్రతినిత్యం మతగ్రంథాలను మసీదులో బాబా ముందు పారాయణ చేసేవాడు. శ్యామాతో బాబా ఎదుట ఎలా గొడవపడ్డాడు? మనం ఎవరిని నిందించాలో, ఎవరిని తప్పు పట్టాలో పోల్చుకోలేము.

ఈ కథ ఈ విధంగా నడిపించక పోయినట్లు అయితే ఈ విషయం యొక్క ప్రాముఖ్యం భగవన్నామ స్మరణ ఫలితం, విష్ణుసహస్రనామ పారాయణ మొదలైన విషయాలు శ్యామాకు తెలిసి ఉండేవి కాదు. బాబా బోధించే మార్గం, ప్రాముఖ్యం, కలగచేసే విషయాలు సాటిలేనివి. ఈ గ్రంథాన్ని క్రమంగా శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. శ్రీమాన్ బూటీ అల్లుడు జి.జి. నార్కేకి బోధించగలిగారు. ఈ నార్కే పూణా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉండేవాడు.

గీతారహస్యం

బ్రహ్మవిద్య అధ్యాయం చేసేవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు, ప్రోత్సహించేవారు. ఇక్కడ దానికి ఒక ఉదాహరణ ఇస్తాము. ఒకరోజు బాపూసాహెబు జోగ్ కు ఒక పార్సిల్ వచ్చింది. అందులో తిలక్ రాసిన గీతారహస్యం ఉంది. అతడు పార్సిల్ ని తన చంకలో పెటుకొని మసీదుకు వచ్చాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు అది క్రిందపడింది. అది ఏమిటి అని బాబా అడిగారు. అక్కడే దాన్ని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకాన్ని ఉంచాడు. బాబా కొన్ని నిముషాలు పుస్తకంలోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో సహా పుస్తకాన్ని జోగుకి అందిస్తూ 'దీన్ని పూర్తిగా చదువు నీకు మేలు కలుగుతుంది' అన్నారు.

ఖాపర్డే దంపతులు

ఖాపర్డే వృత్తాంతంతో ఈ అధ్యాయాన్ని ముగిస్తాము. ఒకప్పుడు ఖపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలు ఉన్నారు. దాదాసాహెబు ఖాపర్డే సామాన్యుడు కాదు. అమరావతిలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ప్లీడరు, అత్యంత ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిల్ లో సభ్యుడు, అమిత తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందు ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడారు, వాదించేవారు కానీ ముగ్గురు మాత్రం  - ఖాపర్డే, నూల్కర్, బూటీ నిశ్శబ్దంగా కూర్చునేవారు. వారు వినయవిధేయతా కలిగిన ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందు మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు. నిజంగా మానవుడు ఎంత చదివిన వాడైనా, వేదపారాయణ చేసినవాడు అయినా, బ్రహ్మజ్ఞాని ముందు వెలవెలబోతారు. పుస్తకజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబు ఖాపర్డే 4 మాసాలు షిరిడీలో ఉన్నారు. కాని అతని భార్య 7 మాసాలు వుంది. ఇద్దరూ షిరిడీలో ఉండటంతో సంతోషించారు. ఖాపర్డే భార్య బాబా ముందు భక్తిశ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను అమితంగా ప్రేమిస్తూ ఉండేది. ప్రతిరోజూ 12 గంటలకి బాబా కోసం నైవేద్యం స్వయంగా తీసుకుని వస్తుండేది. దాన్ని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనం చేస్తుండేది. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించాలని అనుకున్నారు. ఆమె ఒకరోజు మధ్యాహ్న భోజన సమయంలో ఒక పళ్ళెంలో సంజా, పూరీ, అన్నం, పులుసు, పరమాన్నం మొదలైనవి మసీదుకు తెచ్చింది. గంటల కొద్దీ ఊరికే ఉండే బాబా ఆరోజు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుని ఆమె తెచ్చిన పళ్ళెంపై ఉన్న ఆకు తీసి త్వరగా తినడం ప్రారంభించారు. శ్యామా ఇలా అడిగారు 'ఎందుకీ పక్షపాతం? ఇతరుల పళ్ళాలను నెట్టివేస్తున్నావు? వాటివైపు చూడను కూడా చూడవు? దీన్ని నీ దగ్గరకి ఈడ్చుకుని తింటున్నావు? ఈమె తెచ్చిన భోజనం ఎందుకు అంత రుచికరం? ఇది మాకు సమస్యగా వుంది.’ బాబా ఇలా బోధించారు 'ఈ భోజనం యథార్థంగా అమూల్యమైనది. గతజన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలు ఇస్తూ ఉండేది. అక్కడినుండి నిష్క్రమించి, ఒక తోటమాలి ఇంట్లో జన్మించింది. తరువాత ఒక క్షత్రియుడి ఇంట్లో జన్మించి ఒక వర్తకుడిని వివాహమాడింది. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది. చాలాకాలం తరువాత ఆమెని నేను చూశాను. కాబట్టి ఆమె పళ్ళెం నుండి ఇంకా కొన్ని ప్రియమైన ముద్దలను తీసుకోనివ్వండి.’ ఇలా అంటూ బాబా ఆమె పళ్ళెం ఖాళీ చేశారు. నోరు చేతులు కడుక్కుని త్రేన్పులు తీస్తూ తిరిగి తన గద్దెపై కూర్చున్నారు. అప్పుడు ఆమె బాబకి నమస్కారం చేసింది. బాబా కాళ్ళను ఒత్తుతూ ఉంది. బాబా ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. బాబా కాళ్ళను ఒత్తుతున్న ఆమె చేతులను బాబా తోమటం ప్రారంభించారు. గురుశిష్యులు ఇద్దరూ సేవచేసుకోవడం చూసి శ్యామా ఇలా అన్నాడు 'చాలా బాగా జరుగుతుంది. భగవంతుడు, భక్తురాలు ఒకరికి ఒకరు సేవ చేసుకోవడం అత్యంత వింతగా ఉంది.’ ఆమె యథార్థమైన ప్రేమకు సంతోషించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించే కంఠంతో 'రాజారామ్' అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ జపించు అంటూ ఇలా అన్నారు 'నీవు ఇలా చేసినట్లు అయితే నీ జీవితాశయాన్ని పొందుతావు, నీ మనస్సు శాంతిస్తుంది, నీకు మేలు జరుగుతుంది.’ ఆధ్యాత్మికం తెలియనివారికి ఇది సామాన్య విషయంలా కనిపిస్తుంది కానీ అది అలా కాదు, అది శక్తిపాతం. అంటే గురువు శిష్యుడికి శక్తి ప్రసాదించడం. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి! ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణంలో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడ్డాయి. ఈ విషయం గురువుకి, శిష్యుడికి మధ్య ఉన్న సంబంధాన్ని బోధిస్తుంది. ఇద్దరూ పరస్పరం ప్రేమించి సేవ చేసుకోవాలి. వారిద్దరి మధ్య భేదం లేదు, ఇద్దరూ ఒక్కటే. ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదాలమీద పెట్టడం బాహ్య దృశ్యమే కానీ, యథార్థంగా వారిద్దరూ లోపల ఒక్కటే. వారి మధ్య భేదం పాటించేవారు పక్వానికి రానివారు, సంపూర్జ జ్ఞానం లేనివారు.

ఇరవైఏడవ అధ్యాయం సంపూర్ణం 

Products related to this article

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain

Wooden Elephant Key Chain..

$1.00

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter..

$13.00

0 Comments To "Saibaba Satcharitra 27Adyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!