saibaba-satcharitra-31-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

ఐదవ రోజు పారాయణ (సోమవారం)

ముప్పై ఒకటవ అధ్యాయం

బాబా సుముఖమున మరణించినవారు - సన్యాసి విజయానంద్, బలారామ్ మాన్ కర్, తాత్యా సాహెబు నూల్కర్, మేఘశ్యాముడు, పులి

ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందడం గురించి హేమాడ్ పంతు వర్ణిస్తున్నారు.

మరణకాలంలో మనస్సులో ఉన్న కోరికగానీ, ఆలోచనగానీ ఆ వ్యక్తి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకాలలో శ్రేకృష్ణుడు ఇలా చెప్పాడు 'ఎవరు అయితే వారి అంత్యదశలో నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారో వారు నన్ను చేరుకుంటారు. ఎవరయితే మరొక దాన్ని ధ్యానిస్తారో, వారు దాన్నే పొందుతారు.’ అంత్యకాలంలో మనం మంచి ఆలోచనలే మనస్సులో ఉంచుకోగలం అనే నిశ్చయం లేదు. అనేకమంది అనేక కారణాల వల్ల భయపడి అదిరిపోతారు. కాబట్టి అంత్య సమయంలో మనస్సును నిలకడగా ఎదో మంచి ఆలోచనలోనే నిలుపుకోవాలి అంటే నిత్యం దాన్ని అభ్యసించడం అవసరం. భగవంతుడిని ధ్యానం చేస్తూ జ్ఞాపకంలో ఉంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినట్లయితే, మరణకాలంలో గాభరా పడకుండా ఉండగలం అని యోగీశ్వరులు అందరూ మనకు బోధిస్తూ ఉంటారు. భక్తులు యోగులకు సర్వస్వశరణాగతి చేస్తారు. ఎలాగంటే సర్వజ్ఞులైన యోగులు దారి చూపించి, అంత్యకాలంలో సహాయం చేస్తారు అని వారి నమ్మకం. అటువంటివి కొన్ని ఇక్కడ చెపుతాము.

విజయానంద్

విజయానంద్ అనే మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరానికి యాత్ర కోసం బయలుదేరాడు. మార్గంలో బాబా విషయం విని షిరిడీలో ఆగారు.

అక్కడ హరిద్వార్ నుంచి వచ్చిన సన్యాసి అయిన సోమదేవస్వామిని కలుసుకున్నారు. మానససరోవరం యాత్ర గురించి వివరాలను కునుక్కున్నారు. మానససరోవరం గంగోత్రీకి 500 మైళ్ళకుపైగా ఉందని, ప్రయాణంలో కలిగే కష్టాలను అన్నింటినీ ఆ స్వామి వర్ణించారు. మంచు ఎక్కువ అని ప్రతి 50 క్రోసులకు మారుతుందని, భూటాన్ ప్రజల అనుమానపు నిజాన్ని, వారు యాత్రికులను పెట్టే కష్టాలు మొదలైనవి వారికి చెప్పారు. దీన్ని విని సన్యాసి నిరాశపడి యాత్రను మానేశారు. అతడు బాబా దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోప్పడి ఇలా అన్నారు 'ఈ పనికిమాలిన సన్యాసిని తరిమేయండి. అతని సాంగత్యం మనకు ఉపయోగపడదు, మంచిది కాదు.’ సన్యాసికి బాబా నైజం తెలియకపోవడంతో అసంతృప్తి చెందారు. కూర్చుని జరుగుతున్న విషయాలు అన్నింటికీ గమనిస్తూ ఉన్నాడు. అది ఉదయం జరిగే దర్బారు సమయం కావడంతో మసీదు భక్తులతో కిక్కిరిసి ఉంది. వారు బాబాను అనేక విధాలుగా పూజిస్తూ ఉన్నారు. కొందరు వారి పాదాలకు అభిషేకం చేస్తున్నారు. వారి బ్రొటనవ్రేలు నుండి తీర్థాన్ని కొందరు తాగుతూ ఉన్నారు. కొందరు దాన్ని కళ్ళకు అద్దుకుంటున్నారు. కొందరు బాబా శరీరానికి అత్తరు, చందనాలను పూస్తున్నారు. జాతిమాత భేదాలు లేక అందరూ సేవ చేస్తున్నారు. బాబా తనను కోప్పడినప్పటికీ అతనికి బాబా పట్ల ప్రేమ కలిగింది. కాబట్టి అతనికి అ స్థలం విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోయింది.

అతడు షిరిడీలో రెండు రోజులు ఉన్న తరువాత తల్లికి జబ్బుగా ఉందని మద్రాసు నుండి ఉత్తరం వచ్చింది. విసుగు చెంది అతడు తన తల్లి దగ్గరికి వెళ్లాలని అనుకున్నాడు. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకపోయాడు. ఉత్తరం తీసుకుని బాబా దర్శనం కోసం వెళ్ళాడు. ఇంటికి వెళ్ళడానికి బాబా ఆజ్ఞ వేడుకున్నాడు. సర్వజ్ఞుడు అయిన బాబా ముందు జరగబోతున్నది గ్రహించి 'నీ తల్లిని అంత ప్రేమించేవాడివైతే సన్యాసం ఎందుకు తీసుకున్నావు? కాషాయవస్త్రాలు ధరించేవారికి దేనిలోనూ అభిమానం చూపిచడం తగదు. నీ బసకు వెళ్ళి హాయిగా కూర్చో, ఓపికతో కొద్ది రోజులు కూర్చో. వాడాలో ఎక్కువ దొంగలు ఉన్నారు, తలుపు గడియ పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. శరీరం శిథిలమై చివరికి నశిస్తుంది. దీన్ని తెలుసుకుని, నీ కర్తవ్యాన్ని చేయి. ఇహలోక పరలోక వస్తువులు అన్నింటిలో ఉన్న అభిమానాన్ని విడిచిపెట్టు. ఎవరు అయితే ఈ ప్రకారంగా చేసి హరియొక్క పాదాలను శరణు వేడుకుంటారో, వారు సకల కష్టాలనుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతారు. ఎవరయితే భక్తిప్రేమలతో భగవంతుడి ధ్యానం చేసి మననం చేస్తారో వారికి దేవుడు పరిగెత్తుకుని వెళ్ళి సహాయం చేస్తాడు. నీ పూర్వపుణ్యం ఎక్కువ కావడంతో నీవు ఇక్కడికి రాగలిగావు. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని చూడు. కోరికలు లేనివాడివి అయి రేపటి నుండి భాగవతాన్ని పారాయణ చేయి. శ్రద్ధతో మూడు సప్తాహాలు చేయి. భగవంతుడు సంతృప్తి చెంది నీ విచారాలను తొలగిస్తాడు. నీ భ్రమలు నిష్క్రమిస్తాయి. నీకు శాంతి కలుగుతుంది' అన్నారు. అతని మరణం సమీపించడంతో బాబా అతనికి ఈ విరుగుడుని ఉపదేశించారు. బాబా కూడా తన దేహావసాన సమయంలో మృత్యుదేవతకు ప్రీతి కలిగించే 'రామవిజయం' చదివించారు. ఆ మరుసటి ఉదయం స్నానం మొదలైనవి ఆచరించిన తరువాత విజయానందు భాగవతాన్ని లెండి తోటలో ఏకాంతంలో చదవడం ప్రారంభించారు. రెండు పారాయణలు చేయగానే అలసిపోయారు. వాడాకు వచ్చి రెండు రోజులు ఉన్నారు. మూడవ రోజున ఫకీరు (బడే) బాబా తొడపై ప్రాణాలను వదిలారు. బాబా ఒక రోజంతా శవాన్ని అలాగే ఉంచమన్నారు. తరువాత పోలీసువాళ్లు వచ్చి విచారణ జరిపి శవసంస్కారాన్ని కావించారు. యథోచితంగా శరీరాన్ని తగిన స్థలంలో పూడ్చిపెట్టారు. ఈ విధంగా బాబా అ సన్యాసి సద్గతికి సహాయపడ్డారు.

 

 

 

బలరామ్ మాన్ కర్ :

బలరామ్ మాన్ కర్ అనే గృహస్థుడు ఒకడు బాబా భక్తుడిగా ఉండేవాడు. అతని భార్య చనిపోయింది. అతడు విరక్తి చెంది కొడుకుకి ఇంటి భారాన్ని అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉన్నాడు. అతని భక్తికి బాబా మెచ్చుకుని, అతనికి సద్గతి కలగచేయాలని ఈ క్రింది విధంగా చేశారు. బాబా అతనికి 12రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగడ్ లో ఉండమని చెప్పారు. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగడ్ లో ఉండటం అతనికి ఇష్టంలేదు. కాని ఇదే అతినికి మంచి మార్గం అని బాబా ఒప్పించారు. అక్కడ రోజుకు మూడుసార్లు ధ్యానం చేయమని చెప్పారు. బాబా మాటలలో నమ్మకాన్ని వుంచి మాన్ కర్ మచ్చింద్రగడ్ వెళ్ళారు. అక్కడి చక్కని దృశ్యాన్ని, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి సంతోషించి, బాబా సెలవిచ్చిన ప్రకారం తీవ్రంగా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తరువాత ఒక దృశ్యం చూశారు. సాధారణంగా భక్తులు సమాధిస్థితిలో దివ్యానుభవాలను పొందుతారు. కాని మాన్ కర్ విషయంలో అలా కాకుండా చైతన్యానికి వచ్చిన తరువాత దివ్యదర్శనం లభించింది. అతనికి బాబా సాయంగా కనిపించారు. మాన్ కర్ బాబాను చూడటమే కాకుండా తనను అక్కడికి ఎందుకు పంపించావు అని అడిగారు. బాబా ఇలా చెప్పారు 'షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సులో లేచాయి. నీ చంచల మనస్సుకు నిలకడ కలిగించాలని ఇక్కడికి పంపించాను. నీవు పంచేంద్రియాలతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించావు. నేను ఎల్లప్పుడూ షిరిడీలోనే ఉంటాను అనుకున్నావు. ఇప్పుడు నీవు ఇక్కడ చూసిన నా రూపం షిరిడీలో చూసిన రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారించు. ఇందుకే నిన్ను ఇక్కడికి పంపించాను.’ కొంతకాలం గడిచిన తరువాత మాన్ కర్ మచ్చింద్రగడ్ విడిచి బాంద్రాకు ప్రయాణం అయ్యారు. పూణా నుండి దాదరుకు రైలులో వెళ్లాలని అనుకున్నారు. టికెట్టు దొరకలేదు. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరివాడు వచ్చి 'మీరు ఎక్కడికి వెళుతున్నారు?’ అని అడిగాడు. దాదరుకు అని మాన్ కర్ బదులు చెప్పాడు. అతడు ఇలా అన్నాడు 'దయచేసి నా దాదరు టికెట్టు తీసుకోండి. నాకు అవసరమైన పని ఉండటంతో దాదరుకు వెళ్ళటం మానుకున్నాను.’ టికెట్టు లభించినందుకు మాన్ కర్ ఎంతో సంతోషించారు. జేబులో నుండి పైకం తీసే లోపలే ఆ పల్లెటూరివాడు అంతర్థానం అయ్యాడు. మాన్ కర్ అ గుంపులో అతనికోసం వెతికారు, కానీ లాభం లేకపోయింది. అతని కోసం బండి కదిలే వరకూ ఆగరు, కాని అతని జాడ కనిపించలేదు. మాన్ కర్ కు కలిగిన వింత అనుభవాలలో ఇది రెండవది. ఇంటికి వెళ్ళి వచ్చి తిరిగి మాన్ కర్ షిరిడీ చేరుకున్నారు. అప్పటినుండి షిరిడీలోనే బాబా పాదాలను ఆశ్రయించి ఉన్నారు. వారి సలహాలను అనుసరించి నడుచుకుంటూ ఉన్నాడు. చివరికి బాబా సముఖంలో వారి ఆశీర్వాదాలతో ఈ ప్రపంచాన్ని విడిచినందు వలన అతడు ఎంతో అదృష్టవంతుడు అని చెప్పవచ్చు.

తాత్యా సాహెబు నూల్కర్

తాత్యాసాహెబు నూల్కర్ గురించి హేమాడ్ పంతు ఏమీ చెప్పలేదు. వారు షిరిడీలో కాలం చేశారని మాత్రం చెప్పారు. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతాన్ని గ్రహించాము.

1909 సంవత్సరంలో తాత్యాసాహెబు పండరీపురంలో సబ్ జడ్జీగా ఉండేవారు. అప్పుడు నానాసాహెబు ఛాందోర్కరు అక్కడ మామల్తదారుగా ఉన్నారు. ఇద్దరు చాలాసార్లు కలుసుకుని మాట్లాడుతూ ఉండేవారు. తాత్యాసాహెబుకు యోగుల పట్ల నమ్మకం లేదు. నానాసాహెబుకు వారు అంటే అత్యంత ప్రేమ. అనేకసార్లు నానాసాహెబు, నూల్కర్ కు బాబా లీలలను చెప్పి షిరిడీకి వెళ్ళి వారి దర్శనం చేసుకోమని బలవంత పెట్టారు. చివరికి రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకున్నారు. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకాలి. రెండవది బహుకరించడానికి చక్కని నాగపూరు కమలాఫలాలు దొరకాలి. భగవత్కటాక్షంతో ఈ రెండూ దొరికాయి. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు దగ్గరకు రాగా అతడు వాణ్ణి తాత్యాసాహెబు నూల్కరు దగ్గరికి పంపారు. ఎవరోగాని వంద కమలాఫలాలను నూల్కర్ కు పంపారు. రెండు షరతులు నెరవేరటంతో తాత్యాసాహెబు షిరిడీకి తప్పక వెళ్ళవలసి వచ్చింది. మొట్టమొదట బాబా అతనిపై కోపగించుకున్నారు, క్రమంగా బాబా అవతార పురుషుడు అని తగిన నిదర్శనలు తాత్యసాహెబు నూల్కర్ కు లభించాయి. కాబట్టి అతడు బాబా పట్ల ఇష్టం ఏర్పడి తన అంత్యదశవరకు షిరిడీలోనే ఉన్నాడు. తన అంత్యదశలో మతగ్రంథాల పారాయణ విన్నారు. చివరి సమయంలో బాబా

పాదతీర్థాన్ని అతనికి ఇచ్చారు. అతని మరణవార్త విని బాబా ఇలా అన్నారు 'అయ్యో! తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయారు. అతనికి పునర్జన్మ లేదు.’

మేఘశ్యాముడు

28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పాము. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులు అందరూ శవం వెంట వెళ్ళారు. బాబా కూడా వెంబడించారు. బాబా అతని శవంపై పువ్వులు చల్లారు. దహనసంస్కారం అయిన తరువాత బాబా కంట నీళ్ళు కారాయి. సాధారణ మానవునిలా బాబా చింతా విచారగ్రస్థుడు అయినట్లు కనిపించారు. శవాన్ని అంతా పూలతో కప్పి దగ్గరి బంధువులా ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చారు.

యోగులు అనేకులు భక్తులకు సద్గతి ఇవ్వటం వింటాం. కాని బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతి పొందింది అ కథే ఇప్పుడు చెపుతాను.

పులి

బాబా సమాధి చెందటానికి 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగింది. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందు ఆగింది. ఆ బండిపై ఇనుపగొలుసులతో కట్టి ఉంచిన పులి ఉంది. దాని భయంకరమైన ముఖం వెనుకకు తిరిగి వుంది. దాన్ని ముగ్గురు దర్వీషులు పెంచుతూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకుంటూ ఉండేవారు, అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుతుంది. అన్ని విధాల ఔషధాలను వాడారు. కాని వారి ప్రయత్నాలు నిష్ఫలం అయ్యాయి. బాబా కీర్తి విని వారు దాన్ని షిరిడీకి తీసుకుని వచ్చారు. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారం దగ్గర నిలబెట్టి, దర్వీషులు బాబా దగ్గరికి వెళ్ళి దాని విషయం అంతా బాబాకు చెప్పారు. అది చూడటానికి భయంకరంగా ఉంది, జబ్బుతో బాధపడుతూ ఉంది. అందుకే అది అత్యంత చికాకు పడుతూ ఉంది. భయంగా, ఆశ్చర్యంగా ప్రజలు అందరూ దానివైపు చూస్తూ ఉన్నారు. బాబా దాన్ని తన దగ్గరికి తీసుకుని రమ్మన్నారు. అప్పుడు దాన్నిబాబా ముందుకు తీసుకుని వెళ్ళారు. బాబా కాంతికి తట్టుకోలేక అది తల వాల్చేసింది. బాబా దానివైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూసింది. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చిపోయింది. అది చావడాన్ని చూసి దర్వీషులు విరక్తి చెంది విచారంలో మునిగిపోయారు. కొంతసేపటికి వారికి తెలివి వచ్చింది. ఆ జంతువు రోగంతో బాధపడుతూ చావడానికి సిద్ధంగా ఉండటంతో అది బాబా సముఖంలో వారి పాదాల దగ్గర ప్రాణాలు కోల్పోవడం దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించారు. అది వారికి బాకీపడి ఉంది. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదాల దగ్గర ప్రాణాలు విడిచింది. యోగుల పాదాల దగ్గర వినమృలై ప్రాణాలు విడిచేవారు రక్షింపబడతారు. వారెంతో పుణ్యం చేయనిదే వారికి అలాంటి సద్గతి ఎలా కలుగుతుంది?

ముప్పై ఒకటవ అధ్యాయం సంపూర్ణం