saibaba-satcharitra-33-chapter

  

శ్రీసాయిసచ్చరిత్ర

ముప్పైమూడవ అధ్యాయం

ఊదీ మహిమ: తేలుకాటు, ప్లేగు, జ్వరం నయం కావడం, జామ్నేర్ చమత్కారం, నారాయణరావు జబ్బు, బాలబువ సుతార్, హరిభాపు కర్ణిక్ అనుభవాలు

మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరిద్దాం. వారి కరుణాకటాక్షాలు కొండంత పాపాలను కూడా నశింపజేస్తాయి. మనలోని దుర్గుణాలను పోగొడతాయి. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధిస్తాయి, అమృతానందాన్ని ప్రసాదిస్తాయి. ఇది నాది, అది నీది అనే భేదభావాన్ని వారి మనస్సులో పుట్టదు. వారి ఋణాన్ని ఈ జన్మలోగాని వచ్చే జన్మలలోగాని మనం తీర్చుకోలేము.

ఊదీ ప్రసాదము

బాబా అందరి దగ్గరనుంచి దక్షిణ తీసుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో అధికభాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకుని (కట్టెలు) కొనేవారు. ఈ కట్టెలను బాబా ధునిలో వేస్తూ ఉండేవారు. దాన్ని నిత్యం మంటపెడుతూ ఉండేది. అది ఇప్పటికీ అలాగే మండుతుంది. అందులోని బూడిదనే ఊదీ అంటున్నాము. బాబా దాన్ని భక్తులకు తమతమ ఇళ్ళకు తిరిగి వెళుతున్నప్పుడు పంచిపెట్టేవారు.

ఊదీ వల్ల బాబా ఏమి బోధించాలని అనుకున్నారు? ప్రపంచంలో కనిపించే వస్తువులు అన్నీ బూడిదలా అశాశ్వతాలు. పంచభూతాలతో చేయబడిన మన శరీరాలు అన్నీ సౌఖ్యాలను అనుభవించిన తరువాత పతనమైపోయి బూడిద అవుతుంది. ఈ సంగతి జ్ఞాపకానికి తీసుకుని రావడానికి బాబా భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు. ఈ ఊదీ వల్లనే బ్రహ్మం నిత్యం అని, ఈ జగత్తు అశాశ్వతం అని ప్రపంచంలో ఉన్న బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవారు కారు అని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. ఊదీ అనేక విధాల శారీరక, మానసిక రోగాలను బాగు చేస్తుండేవి. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యాలకు ఉన్న తారతమ్యం, అనిత్యమైన వాటిలోని అభిమానరాహిత్యం గంటమ్రోతలా వినిపిస్తూ ఉండేది. మొదటిది (ఊదీ) వివేకాన్ని, రెండవది (దక్షిణ) వైరాగ్యాన్ని బోధిస్తూ ఉండేవి. ఈ రెండూ కలిగి ఉంటేనే కాని సంసారం అనే సాగరాన్ని దాటలేము. అందుకే బాబా దక్షిణ అడిగి తీసుకుంటూ ఉండేవారు. షిరిడీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదంగా ఇచ్చి, కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తాన్ని వారి శిరస్సుపై ఉంచుతూ ఉండేవారు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుతూ ఉండేవారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుతుండేవారు. దాని పల్లవి 'కళ్యాణరామ రారమ్ము! గోనెలతో ఊదీని తేతెమ్ము!’ బాబా దీన్ని చక్కని రాగంతో మధురంగా పాడుతూ ఉండేవారు. ఇదంతా ఊదీ యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా ఉంది. అది ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆతృతల నుండి విమోచనం మొదలైనవి పంచిపెడుతూ ఉండేవి. ఇక ఊదీ గురించిన కథలను ప్రారంభిస్తాము.

తేలుకాటు

నాసిక్ నివాసి అయిన నారాయణ మోతీరాంజాని అనే అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అనే బాబా భక్తుని దగ్గర ఉద్యోగం చేస్తుండేవాడు. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పారు. కొన్ని రోజుల తరువాత బాబా మాట సత్యమయ్యాయి. నారాయణ జానీ ఉద్యోగాన్ని మానేసి స్వయంగా 'ఆనందాశ్రమం' అనే హోటలు పెట్టుకున్నాడు. అది బాగా అభివృద్ధి చెందింది. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టుంది. దాని బాధ భరింపరానంతగా ఉంది. అటువంటి విషయాలలో ఊదీ బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్న చోట ఊదీని రాయాలి. అందుకే నారాయణరావు ఊదీ కోసం వెదికాడు. కాని అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందు నిలబడి బాబా సహాయాన్ని కోరి, బాబా నామ జపం చేసి, బాబా పటం ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దాన్ని ఊదీగా భావించి, నొప్పి ఉన్న చోట రాశాడు. అతడు ఊదీ రాసిన చేయి తీసి వేయగానే నొప్పి తగ్గిపోయింది. ఇద్దరూ ఆశ్చర్యానందాలలో మునిగిపోయారు.

ప్లేగు జబ్బు

ఒకానొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తుడికి, వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుతుంది అని తెలిసింది. అతడు తన దగ్గర ఊదీ లేదనీ, కాబట్టి ఊదీ పంపించమని నానాసాహెబు ఛాందోర్కరుగారికి కబురు పంపించారు. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషన్ దగ్గర తెలిసింది. అప్పుడు అతను భార్యతో కలిసి కళ్యాణ్ వెళుతున్నాడు. వారి దగ్గర అప్పుడు ఊదీ లేకపోయింది. కాబట్టి నానాసాహెబు రోడ్డుపై ఉన్న మట్టిని కొంచెం తీసి, సాయి నామ జపం చేసి, బాబా అనుగ్రహాన్ని అభ్యర్ధించి తన భార్య నుదుటిపై రాసారు. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూశాడు. అ భక్తుడు ఇంటికి వెళ్ళేసరికి, మూడు రోజుల నుండి బాధపడుతున్న అతని కుమార్తె జబ్బు నానాసాహెబు తన భార్య నుదుటిపై మట్టిని పూసిన దగ్గరనుండి తగ్గింది అని విని ఎంతగానో సంతోషించాడు.

జామ్నేర్ లీల

1904 – 1905 సంవత్సరంలో నానాసాహెబు ఛాందోర్కరు జామ్నేర్ లో మామల్తదారుగా ఉన్నాడు. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఆమె స్థితి బాగా లేకుండా ఉంది. ఆమె రెండు మూడు రోజుల నుంచి ప్రసవవేదన పడుతూ ఉంది. నానాసాహెబు ఔషధాలన్నీ వాడాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు బాబాను జ్ఞాపకానికి తెచ్చుకుని వారి సహాయాన్ని వేడుకున్నాడు. షిరిడీలో రామ్ గీర్ బువా అనే సన్యాసి ఉన్నాడు. బాబా అతన్ని 'బాపూగీర్ బువా' అనేవారు. అతని స్వగ్రామం ఖాందేషులో ఉంది. అతను అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యలో జామ్నేర్ లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబుకు ఊదీని, హారతి పాటను ఇవ్వమన్నారు. తన దగ్గర రెండే రూపాయలు ఉన్నాయని అవి జలగామ్ వరకు రైలు టికెట్టుకు సరిపోతాయని కాబట్టి జలగామ్ నుండి జామ్నేర్ వెళ్ళడానికి (సుమారు 30 మైళ్ళు) ధనం లేదని రామ్ గీర్ బువా చెప్పాడు. అన్నీ సరిగా అమరుతాయి కాబట్టి అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికారు. శ్యామాను పిలిచి మాధవ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమన్నారు. హారతి పాటను ఊదీని రామ్ గీర్ బువకి యిచ్చి నానాసాహెబుకు అందజేయమన్నారు. బాబా మాటలపై ఆధారపడి రామ్ గీర్ బువా షిరిడీ విడిచి, రాత్రి రెండున్నర గంటలకు జలగామ్ చేరుకున్నాడు. అక్కడికి చేరుకునే సమయానికి అతని దగ్గర 2 అణాలు మాత్రమే ఉన్నాయి, కాబట్టి కష్టదశలో ఉన్నాడు. అప్పుడే ఎవరో బాపూగీర్ బువా ఎవరు?’ అని కేకలు వేస్తున్నారు. బువా అక్కడికి వెళ్ళి తానే అని చెప్పాడు. నానాసాహెబు పంపించారని చెపుతూ, అ బంట్రోతు బువను ఒక చక్కని టాంగా దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. దానికి రెండు మంచి గుఱ్ఱాలను కట్టి ఉన్నాయి. ఇద్దరూ అందులో కూర్చుని బండిని వదిలారు. టాంగా వేగంగా వెళ్ళింది. తెల్లవారుఝామున టాంగా ఒక సెలయేరు దగ్గరకు చేరుకుంది. బండి తోలేవాడు గుఱ్ఱాలకు నీళ్ళు త్రాతించడానికి వెళ్ళాడు. బంట్రోతు రామ్ గీర్ బువాను ఫలహారం చేయమని, ఫలహారపు దినుసులను పెట్టాడు. గడ్డం, మీసాలు ఉన్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్ గీర్ బువా అతను మహమ్మదీయుడు అని సంశయించి ఫలహారాన్ని తినకుండా కూర్చున్నాడు. కాని ఆ బంట్రోతు తాను హిందువుని అని, గర్ వాల్ దేశపు క్షత్రియుడిని అని, నానాసాహెబు ఆ ఫలహారాన్ని పంపించారు కాబట్టి, తినడానికి ఎలాంటి అనుమానం వద్దని చెప్పాడు. అప్పుడు ఇద్దరూ కలిసి ఫలహారాన్ని చేసి బయలుదేరారు. ప్రాతఃకాలంలో జామ్నేర్ చేరుకున్నారు. ఒంటికి పోసుకోవడానికి రామ్ గీర్ బువా టాంగా దిగి రెండు మూడు నిముషాలలో వచ్చాడు. తిరిగి వచ్చేసరికి టాంగాగాని, టాంగా తోలేవాడు గాని, బంట్రోతుగాని లేరు, బాపుగీర్ బువా నోటివెంట మాటరాలేకపోయింది.

దగ్గరలోనే ఉన్న కచేరికీ వెళ్ళి అడగ్గా నానాసాహెబు ఇంటి దగ్గరే ఉన్నట్లు తెలిసింది. అతడు నానాసాహెబు గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా దగ్గరనుండి వచ్చినట్లు తెలిపాడు. బాబా ఇచ్చిన ఊదీ, హారతి పాట నానాసాహెబుకు అందజేశారు. మైనతాయి చాలా అవస్థపడుతూ దీనస్థితిలో ఉంది. అందరూ ఆమె గురించి ఆందోళన పడుతూ ఉన్నారు. నానాసాహెబు తన భార్యని పిలిచి ఊదీని నీళ్ళలో కలిపి కుమార్తెకు ఇచ్చి హారతిని పాడమని చెప్పారు. బాబా మంచి సమయంలో సహాయం పంపించారు అనుకున్నారు. కొద్ది నిముషాలలో ప్రసవం సుఖంగా జరిగింది అని వార్త వచ్చింది. గండం గడిచిందని చెప్పారు. నానాసాహెబుగారు టాంగాను, నౌకరును, ఫలహారాలను పంపించినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞతా తెలుపగా అతడు ఆశ్చర్యపడ్డాడు. షిరిడీ నుండి ఎవరు వస్తున్నదీ తనకు తెలియదని, కాబట్టి అతడు ఏమీ పంపించలేదని చెప్పారు.

బి.వి.దేవ్ గారి విషయమై నానాహేబు ఛాందోర్కరు కొడుకు బాపూరావు ఛాందోర్కరు, రామ్ గీర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మాగజైన్ లో (xiii – 11, 12, 13) గొప్ప వ్యాసాన్ని ప్రచురించినవారు బి.వి. నరసింహాస్వామిగారు మైనతాయి. బాపూరావు ఛాందోర్కరు, రామ్ గీర్ బువాల వాంగ్మూలాన్ని సేకరించి 'భక్తుల అనుభవాలు' అనే గ్రంథాన్ని (3వ భాగం) ప్రచురించారు.

భక్త నారాయణరావు బాబాను రెండుసార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. బాబా సమాధి చెందిన మూడేళ్ళకు షిరిడీకి వెళ్ళాలి అని అనుకున్నారు. కాని వెళ్లలేకపోయారు. బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బు పడి ఎక్కువ బాధపడుతూ ఉన్నాడు. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు. కాబట్టి రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించారు. ఒకరోజు స్వప్నంలో ఒక దృశ్యాన్ని చూశారు. అందులో బాబా అతన్ని ఓదార్చి ఇలా అన్నారు 'ఆందోళన పడవద్దు, రేపటి నుండి బాగావుతుంది. వారం రోజులలో నడవగలవు' స్వప్నంలో చెప్పిన తీరుగా రోగం వారంలో కుదిరింది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఇది. ‘శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉన్నారా? శరీరం పోయింది కాబట్టి చనిపోయారా?’ లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జననమరణాలకు అతీతులు. ఎవరు అయితే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎలాంటి సమయంలోగాని బాబా నుండి తగిన జవాబు పొందుతారు. వారు ఎల్లప్పుడూ మన ప్రక్కనే ఉంటారు. ఏ రూపంలోనో భక్తులకు దర్శనం ఇచ్చి వారి కోరికలను నెరవేరుస్తారు.

బాలబువ సుతార్

బొంబాయిలో ఉండే ప్రముఖ సంగీతకారుడు బాలబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చాడు. అతను గొప్ప భక్తుడు, ఎల్లప్పుడూ అతడు భగవంతుని ధ్యానంలో, భజనలోనే తత్పరుడై ఉండేవాడు. అందుకే ప్రజలు వారిని 'నవయుగ తుకారా,’ అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా బాబా 'నేను ఇతన్ని నాలుగు సంవత్సరాల నుండి ఎరుగుదును' అన్నారు. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవాడు కావడంతో బాలబువా ఇది ఎలా సంభవం అని అనుకున్నాడు. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు 'యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు? తమ భక్తుల పట్ల వారికి ఎంత ప్రేమ? నేను వారి ఫోటోను చూడటం వారిని స్వయంగా చూసిన దానితో సమానం అని నాకు బోధించారు.’

అప్పా సాహెబు కులకర్ణి

1917వ సంవత్సరంలో అప్పాసాహెబు కులకర్ణి వంతు వచ్చింది. అతడు ఠాణాకు బదిలీ అయ్యారు. బాలాసాహెబు భాటే అతనికి బాబా ఫోటో అంతకు ముందే ఇచ్చాడు. అతడు దాన్ని జాగ్రత్తగా పూజిస్తూ ఉండేవాడు. పువ్వులు, చందనం, నైవేద్యం బాబాకు నిత్యం అర్పిస్తూ బాబాను చూడాలని తీవ్రమైన కాంక్షతో ఉండేవాడు. ఈ సందర్భంలో బాబా పటాన్ని మనఃస్ఫూర్తిగా చూస్తే బాబాను ప్రత్యక్షంగా చూసిన దాంతో సమానమే అని చెప్పవచ్చు (దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ).

కులకర్ణి ఠాణాలో ఉండగా భీవండి పర్యటనకు వెళ్ళవలసి వచ్చింది. ఒక వారం రోజుల లోపల తిరిగి రావడానికి అవకాశం లేకపోయింది. అతడు లేనప్పుడు మూడవరోజున ఈ క్రింది ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మధ్యాహ్నం 12గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి ఇంటికి వచ్చారు. వారి ముఖలక్షణాలు సాయిబాబా ముఖలక్షణాలతో సరిపోయాయి. కులకర్ణిగారి భార్యాబిడ్డలు వారు షిరిడీ సాయిబాబాగారా అని అడిగారు. వారు ఇలా సమాధానం చెప్పారు 'లేదు, నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాను' అలా అంటూ దక్షిణ అడిగారు. ఆమె ఒక రూపాయి ఇచ్చింది. వారు ఒక చిన్న పొట్లంతో ఊదీని ఇచ్చి, దాన్ని పూజలో ఫోటోతో పాటు ఉంచుకుని పూజించమని చెప్పారు. తరువాత ఇళ్ళు విడిచి వెళ్ళిపోయారు. ఇక చిత్రమైన సాయిలీలలను వినండి. బీవండీలో తన గుఱ్ఱం జబ్బు పడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకోవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇళ్ళు చేరుకున్నారు. ఫకీరుగారి రాక భార్యవల్ల విన్నారు. ఫకీరుగారి దర్శనం దొరకనందుకు ఎంతగానో మనోవేదన పొందరు. ఫకీరుకు ఒక్క రూపాయి మత్రమే దక్షిణగా ఇవ్వడం ఇష్టపడలేదు. తాను కనుక ఇంట్లో ఉన్నట్లయితే 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేవాడిని అని అన్నాడు. వెంటనే ఫకీరును వెదకడానికి బయలుదేరారు. అతని అన్వేషణ సఫలం కాలేదు. ఇంటికి వచ్చి భోజనం చేశారు. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుడిని వెదకరాదని బాబా చెప్పింది చదివేవాళ్ళు గమనించాలి. అప్పాసాహెబు ఇక్కడ ఒక నీతిని నేర్చుకున్నారు. భోజనం అయిన తరువాత చిత్రే అనే స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళగా ఎవరో వారి వైపు వస్తున్నట్లు కనిపించింది. వారి ముఖలక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చినవారే అని అనుకున్నారు. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగారు. అప్పాసాహెబు ఒక రూపాయి ఇచ్చారు. వారు తిరిగి అడగ్గా ఇంకా రెండు రూపాయలు ఇచ్చారు. అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే దగ్గరనుండి మూడు రూపాయలు తీసుకుని ఫకీరుకి ఇచ్చారు. వారు ఇంకా దక్షిణ కావాలని అన్నారు. అప్పాసాహెబు వారిని ఇంటికి రావలసిందిగా వేడుకున్నారు. అందరూ ఇల్లు చేరారు. అప్పాసాహెబు వారికి మూడు రూపాయలు ఇచ్చారు. మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టాయి. అప్పటికీ సంతృప్తి చెందక ఫకీరు ఇంకా దక్షిణ ఇవ్వమని అడిగారు. అప్పాసాహెబు తన దగ్గర పదిరూపాయాల నోటు ఉందని అన్నారు. ఫకీరు దాన్ని పుచ్చుకుని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చేసి అక్కడనుండి వెళ్ళిపోయారు.

అప్పాసాహెబు పదిరూపాయలు ఇస్తాను అని అన్నారు కాబాట్టి ఆ మొత్తాన్ని తీసుకుని పవిత్రపరిచిన తరువాత తొమ్మిది రూపాయలను ఇచ్చేశారు. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేస్తుంది. (బాబా లక్ష్మీబాయి షిండేకి 9 రూపాయలు సమాధిసమయంలో ఇచ్చారు) అప్పాసాహెబు ఊదీ పొట్లాన్ని విప్పి చూశారు. అందులో పువ్వురేకులు అక్షింతలు ఉన్నాయి. కొంతకాలం తరువాత బాబాను షిరిడీలో దర్శించుకున్నప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కింది. అతడు ఊదీ పొట్లాన్ని, వెంట్రుకను, ఒక తాయెత్తులో పెట్టి తన దండెపై కట్టుకున్నారు. అప్పాసాహెబు ఊదీ ప్రభావాన్ని గ్రహించారు. అతడు అత్యంత తెలివైనవాడు అయినప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుతూ ఉండేది. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కన్నా ఎన్నో రెట్లు ఆదాయం వచ్చింది. మంచి పలుకుబడి, అధికారం లభించాయి. ఈ లౌకికమైన కానుకలే కాకుండా దైవభక్తి కూడా వృద్ధి అవుతూ ఉంది. కాబట్టి బాబా ఊదీని పొందే భాగ్యం కలవారు స్నానం చేసిన తరువాత ఊదీని నుదుట రాసుకొని, కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకోవాలి.

హరిభావ్ కర్ణిక్

ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ్ కర్ణిక్ అనే అతడు 1917వ సంవత్సరంలో గురుపౌర్ణమి రోజు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించారు. వస్త్రాలను, దక్షిణ సమర్పించారు. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగారు. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తోచి మసీదు మెట్లు మళ్ళీ ఎక్కుతుండగా, బాబా సెలవు పొందిన తరువాత తిరిగి వెనక్కి రాకూడదని విని యింటికి బయలుదేరారు. మార్గమధ్యంలో నాసిక్ లో కాలారాముని మందిరంలో ప్రవేశించి దర్శనం చేసుకుని బయటికి వస్తుండగా నరసింగ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి, హరిభావ్ ముంజేతిని పట్టుకుని 'నా రూపాయి నాకు ఇవ్వు' అన్నారు. కర్ణిక్ ఎంతో ఆశ్చర్యపోయారు. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబాకు ఈ విధంగా తాను ఇవ్వాలని నిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజ్ ద్వారా గ్రహించారు అనుకున్నారు.

యోగీశ్వరులు అందరూ ఒక్కటే అని ఏకాత్మతాభావంతో కార్యం ఒనర్చుతారు అని ఈ కథ తెలుపుతుంది.

ముప్పైమూడవ అధ్యాయం సంపూర్ణం

  

0 Comments To "saibaba-satcharitra-33-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!