saibaba-satcharitra-35-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

ముప్పై ఐదవ అధ్యాయం

ఊదీ మహిమ : కాకామహాజని స్నేహితుడు, యజమాని, బాంద్రా అనిద్ర రోగి, బాలాజీ పాటీలు నేవాస్కర్

ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ గురించి వర్ణిస్తున్నా. ఇందులో బాబా రెండు విషయాలు పరీక్షింపబడి లోపం లేదని కనుక్కోవడం కూడా చెప్పబడింది. బాబాను పరీక్షించే కథలు మొట్టమొదట చెప్పబడుతుంది.

ఆధ్యాత్మిక విషయాలలో లేదా సాధనాలలో, శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడతాయి. భగవంతుడు నిరాకారుడు అని నమ్మేవారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మేవారిని ఖండించి అది వట్టి భ్రమ అంటారు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే. కాబట్టి వారికి ఎందుకు నమస్కరించాలి? అంటారు. ఇతర శాఖలవారు కూడా ఆక్షేపణ చేస్తూ వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ ఎందుకు చేయాలి? అంటారు. సాయిబాబా గురించి కూడా అలాంటి ఆక్షేపణ చేశారు. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగారు. యోగులు ఈ ప్రకారంగా ధనం పోగుచేయడం శ్రేయస్కరమా? వారు ఇలా ధనం జాగ్రత్త చేసినట్లు అయితే వారి యోగి గుణాలు ఎక్కడ? అని విమర్శించారు. అనేకమంది బాబాను వెక్కిరించడానికి షిరిడీకి వెళ్ళి చివరికి వారిని ప్రార్థించడానికి అక్కడే ఉండిపోయారు. అటువంటి రెండు ఉదాహరణలు ఈ క్రింద ఇస్తున్నాము.

కాకామహాజని స్నేహితుడు

కాకామహాజని స్నేహితుడు నిరాకారుడు అయిన భగవంతుడిని ప్రార్థించేవాడు. విగ్రహారాధనకి అతడు విముఖుడు, అతడు ఊరికే వింతలు ఏమైనా తెలుసుకోవడానికి షిరిడీకి వెళ్ళడానికి అంగీకరించాడు. కాని, బాబాకు నమస్కరించనని, వారికి దక్షిణ ఇవ్వను అనీ చెప్పారు. కాకా ఈ షరతులకు ఒప్పుకున్నారు. ఇద్దరూ శనివారం రోజు బొంబాయి విడిచి ఆ మరుసటి రోజు షిరిడీకి చేరుకున్నారు. వారు మసీదు మెట్లు ఎక్కగానే కొంచెం దూరంలో ఉన్న బాబా, మహాజని స్నేహితుడిని మంచి మాటలతో ఆహ్వానించారు. ఆ కంఠధ్వని అత్యంత చిత్రంగా ఉంది. ఆ కంఠం అతని తండ్రి కంఠంలా ఉండింది. ఆ కంఠం గతించిన తన తండ్రిని జ్ఞాపకానికి తెచ్చింది. శరీరం సంతోషంతో ఉప్పొంగింది, కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెపుతాను? ఎంతగానో ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు 'ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే' అన్నారు. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనోనిశ్చయాన్ని మరిచిపోయిన వాడై, బాబా పాదాలకు నమస్కరించాడు. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడగ్గా మహాజని ఇచ్చారు. బాబా కాకానే దక్షిణ అడగుతూ ఉన్నారు. కానీ అతని స్నేహితున్ని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో 'బాబా నిన్నే రెండుసార్లు దక్షిణ అడిగారు నేను నీతో ఉన్నాను, నన్నెందుకు విడిచిపెడుతున్నారు?’ అన్నాడు. ‘నీవే బాబాను అడుగు' అని అతడు జవాబు చెప్పాడు. తన స్నేహితుడు ఏమని చెవిలో ఊదుతున్నాడు అని బాబా కాకామహాజనిని అడగ్గా, తన స్నేహితుడు తను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుతున్నాడు అన్నారు. బాబా 'నీకు ఇవ్వడానికి మనస్సులో ఇష్టం లేకపోయింది. కాబట్టి నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నట్లు అయితే ఇవ్వవచ్చు' అన్నారు. కాకా ఇచ్చినంత అంటే 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాడు. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంలో ఇలా చెప్పారు 'నీవు దాన్ని తీసేయి, మనకు మధ్యన ఉన్న అడ్డును తీసేయి. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూసుకోగలం, కలిసి కొనగలం!’ వెళ్ళడానికి బాబా వారికి సెలవు ఇచ్చారు. ఆకాశంలో మేఘాలతో కమ్మి ఉన్నప్పటికీ వర్షం వస్తుందేమో అనే భయం కలుగుతున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణం సాగుతుందని బాబా ఆశీర్వదించారు. ఇద్దరూ సురక్షితంగా బొంబాయి చేరుకున్నారు. అతను ఇంటికి వెళ్ళి తలుపు తీసేసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయింది. తానే కిటికీలు తెరచి ఉన్నట్లయితే పిచ్చుకలు రక్షింపబడి ఉండేవి. వాటి అదృష్టానుసారం అవి చచ్చాయి. మూడవదాన్ని రక్షించడానికే బాబా త్వరగా తనను పంపించారు అని అనుకున్నారు.

కాకామహాజని - యజమాని

ఠక్కర్ థరమ్సే జెఠాభాయి, హైకోర్టు ప్లీడరుకి ఒక కంపెనీ ఉండేది. దాన్లో కాకా మేనేజరుగా పనిచేస్తూ ఉండేవారు. యజమానీ, మేనేజరు అన్యోన్యంగా ఉండేవారు. కాకా షిరిడీకి అనేకసార్లు వెళ్ళడం, కొన్ని రోజులు అక్కడ నుండి తిరిగి బాబా అనుమతి పొంది రావడం, మొదలైనవి ఠక్కర్ కు తెలుసు. కుతూహలం కోసం బాబాను పరీక్షించే ఆసక్తితో, ఠక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. కాకా ఎప్పుడు తిరిగి వస్తారో అనేది నిశ్చయంగా తెలియదు కాబాట్టి ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళారు. ముగ్గురు కలిసి బయల్దేరారు. బాబాకి ఇవ్వడానికి కాకా రెండు శేర్ల ఎండుద్రాక్ష పండ్లు (గింజలతో ఉన్నవి) దారిలో కొన్నారు. వారు షిరిడీకి సరైన వేళకు చేరుకొని, బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళారు. అప్పుడు అక్కడ బాబాసాహెబు తర్ఖడ్ ఉన్నారు. ఠక్కర్ మీరు ఎందుకు వచ్చారు అని తర్ఖడ్ ని అడిగారు, దర్శనం కోసమని తర్ఖడ్ జవాబు ఇచ్చారు. మహిమలు ఏమైనా జరిగాయా అని ఠక్కర్ ప్రశ్నించారు. బాబా దగ్గర ఏమైనా అద్భుతాలు చూడటం తన నైజం కాదనీ, భక్తులు ప్రేమతో కాంక్షించేవి జరుగుతాయని తర్ఖడ్ చెప్పారు.

కాకా బాబా పాదాలకు నమస్కరించి ఎండుద్రాక్ష పళ్ళను అర్పించారు. బాబా వాటిని పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. ఠక్కర్ కు కొన్ని ద్రాక్షాలు దొరికాయి. అతనికి అవి తినాలని అనిపించలేదు. ఎందుకంటే తన వైద్యుడు కడిగి శుభ్రపరచకుండా ద్రాక్షాపళ్ళు తినకూడదు అని సలహా చెప్పాడు. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచింది తనకు వాటిని తినడం ఇష్టం లేదు అని కానీ బాబా తినడానికి ఆజ్ఞాపించడంతో పారేయలేక పోయాడు. పారేసినట్లయితే బాగుండదని వాటిని నోటిలో వేసుకున్నారు. గింజలని ఏం చేయాలో తోచకుండా ఉంది. మసీదులో గింజలు ఉమ్మడానికి జంకుతూ ఉన్నాడు. తన యిష్టానికి వ్యతిరేకంగా చివరికి గింజలు తన జేబులో వేసుకున్నారు. బాబా యోగి అయినట్లయితే తనకు దాక్షాపళ్ళు ఇష్టం లేదు అని తెలియదా? బాబా వాటిని ఎందుకు బలవంతంగా ఇచ్చారు? ఈ ఆలోచన తన మనస్సులో అనుకుంటూ ఉండగానే బాబా ఇంకా మరికొన్ని ద్రాక్షాలు ఇచ్చారు. అతడు వాటిని తినలేదు, చేతిలో పట్టుకున్నారు. బాబా వాటిని తినమని అన్నారు. వారి ఆజ్ఞానుసారం తినగా, వాటిలో గింజలు లేవు. అందుకు అతడు ఎక్కువగా ఆశ్చర్యపడ్డాడు. అద్భుతాలు చూడలేదు అని అనుకున్నాడు, కాబట్టి అతనిపై ఈ అద్భుతం ప్రయోగించబడింది. బాబా తన మనస్సు కనిపెట్టి గింజలు ఉన్న ద్రాక్షాపళ్ళను గింజలు లేనివాటిగా మార్చివేశారు. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించడానికి తర్ఖడుకి ఏలాంటి ద్రాక్షాపళ్ళు దొరికాయని అడిగారు. గింజలతో ఉన్నవి దొరికాయి అని తర్ఖడు చెప్పారు. ఠక్కర్ ఆశ్చపోయాడు. తనలో ఉద్భవిస్తున్న నమ్మకం దృఢపరచడానికి బాబా యథార్తంగా యోగి అయినట్లు అయితే ద్రాక్షాపళ్ళు మొట్టమొదట తనకి ఇవ్వాలి అనుకున్నారు. అతని మనస్సులో ఉన్న ఈ సంగతి కూడా గ్రహించి, బాబా కాకా దగ్గర ఎండుద్రాక్షల పంపిణీ ప్రారంభించాలని ఆజ్ఞాపించారు. ఈ నిదర్శనంతో ఠక్కరు సంతృప్తి చెందాడు.

ఠక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశారు. అందుకు బాబా ఇలా అన్నారు ‘అతను ఎలా అతనికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు ఉన్నారు..’ కాకా ఈజవాబుకు చాలా సంతోషపడ్డాడు. తన మనోనిశ్చయం మరిచిపోయి ఠక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగి వెళ్ళిపోయారు. మధ్యాహ్న హారతి అయిన తరువాత, వారు అందరూ బాబా దగ్గర శెలవు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళారు. శ్యామా వారి పక్షాన మాట్లాడారు. బాబా ఇలా చెప్పడం మొదలుపెట్టారు:

'ఒకచంచల మనస్సు గల పెద్దమనిషి ఉండేవాడు. అతనికి ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా వుంది. ఎలాంటి విచారలు లేకుండా ఉన్నారు. అనవసరమైన ఆరాటం పైన వేసుకుని, అక్కడక్కడ తిరుగుతూ మనశ్శాంతిని పోగొట్టుకున్నాడు. ఒక్కొక్కప్పుడు భారాలు అన్నీ వదిలేస్తూ ఉండేవాడు. మరొకప్పుడు వాటిని మోస్తూ ఉన్నాడు. అతని మనస్సుకు నిలకడ లేకుండా పోయింది. అతని స్థితిని కనిపెట్టి కనికరించి నేను ఒక చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండు' అని చెప్పాను.

వెంటనే ఠక్కరు అది అంతా తన గురించే అని గ్రహించారు. కాకా కూడా తన వెంట రావాలని అనుకున్నాడు. కానీ కాకాకు అంత త్వరగా షిరిడీ విడిచిపెట్టడానికి ఆజ్ఞ దొరుకుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. బాబా దీన్ని కూడా కనిపెట్టి కాకాను అతని యజమానితో వెళ్ళడానికి ఆజ్ఞ ఇచ్చారు. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అనడానికి ఠక్కరుకి ఇంకొక నిదర్శనం దొరికింది.

బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకుని అతనికి ఇలా చెప్పారు : ‘నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి దగ్గరనుండి కాని తీసుకున్నట్లయితే దానికి పదిరెట్లు యివ్వాలి. నేను ఊరికే ఏమీ తీసుకొను. యుక్తాయుక్తలు తెలియకుండా నేను ఎవరినీ అడగను. ఫకీరు ఎవరిని చూపిస్తారో వారి దగ్గరే నేను తీసుకుంటాను. ఎవరైనా ఫకీరుకు గతజన్మనుంచి బాకీ ఉన్నట్లయితే, అతని దగ్గరే ధనం పుచ్చుకుంటాను. దానం చేసేవాడు ఇచ్చేది ప్రస్తుతం విత్తనాలు నాటటం వంటిది. అది మున్ముందు గొప్ప పంట అనుభవించడం కోసమే. ధర్మం చేయడానికి ధనాన్ని ఉపయోగించాలి. దాన్ని సొంతానికి వాడుకుంటే అది వ్యర్థం అవుతుంది. గతజన్మలో నీవు ఇచ్చి ఉంటేనే గాని, నీవు ఇప్పుడు అనుభవించలేవు. కాబట్టి ధనాన్ని పొందాలి అనుకుంటే, దాన్ని ప్రస్తుతం ఇతరులకు ఇవ్వడం సరైన మార్గం. దక్షిణ ఇస్తున్నట్లయితే వైరాగ్యం పెరుగుతుంది. దాని వలన భక్తిజ్ఞానాలు కలుగుతాయి. ఒక రూపాయి ఇచ్చి 10 రూపాయలను పొందవచ్చు.

ఈ మాటలు విని, ఠక్కరు తన నిశ్చయాన్ని మరచిపోయి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టారు. షిరిడీకి రావడం మేలైనది అని అనుకున్నాడు. ఎలాగంటే అతని సంశయాలు అన్నీ తొలగిపోయాయి. అతడు ఎంతో నేర్చుకున్నాడు. అటువంటి వారి విషయాలలో బాబా ప్రయోగించే యుక్తి అత్యంత అమోఘమైనది. అన్నీ బాబాయే చేస్తున్నా, దేనిలోనూ అభిమానం ఉంచలేదు. ఎవరయినా నమస్కరించినా నమస్కరించకపోయినా, దక్షిణ ఇచ్చినా, ఇవ్వకపోయినా తనకి అందరూ సమానమే. బాబా ఎవరినీ అవమానించలేదు, తనను పూజించినందుకు బాబా గర్వపడేవారు కాదు. తనను పూజించలేదు అని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు.

బాంద్రా అనిద్ర రోగి

బాంద్రా నివాసి అయిన కాయస్థప్రభు కులానికి చెందిన ఒక పెద్దమనిషి చాలాకాలం నిద్రపట్టక బాధపడుతూ ఉండేవాడు. నిద్రపోవడానికినడుం వాల్చగానే గతించిన తన తండ్రి కలలో కనిపించి తీవ్రంగా తిడుతూ ఉండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రిళ్ళు అస్థిరం చేస్తూ ఉండేవి. ప్రతిరోజూ ఇలా జరిగడంతో ఏం చేయడానికి తోచలేదు. ఒకరోజు అతడు బాబా భక్తుడితో ఈ విషయాన్ని మాట్లాడాడు. బాబా ఊదీయే దీన్ని తప్పనిసరిగా బాగుచేస్తుందని అతడు సలహా ఇచ్చాడు. అతడు అతనికి కొంత ఊదీ ఇచ్చి ప్రతిరోజూ నిద్రపోయేముందు కొంచెం నుదుటికి రాసుకుని మిగతా పొట్లాన్ని తలక్రింద దిండుకింద పెట్టుకోమన్నాడు. ఇలా చేసిన తరువాత సంతోషం, ఆశ్చర్యం కలిగించేలా అతనికి మంచి నిద్ర పట్టింది. ఎలాంటి చికాకులు లేకుండాపోయాయి. అతడు సాయిని నిత్యం స్మరిస్తూ ఉన్నాడు. సాయిబాబా చిత్రపటాన్ని తెచ్చి గోడపై వ్రేలాడదీశాడు. దాన్ని ప్రతిరోజూ పూజిస్తూ ఉన్నాడు. గురువారం రోజు పూలమాల వేస్తుండేవాడు, నైవేద్యం సమర్పిస్తూ ఉండేవాడు, తరువాత అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది.

బాలాజీ పాటీలు నేవాస్కరు

యితడు బాబాకు గొప్ప భక్తుడు. యితడు ఫలాపేక్ష లేకుండా చాలామంచి సేవచేశారు. యితడు షిరిడీలో బాబా ఏఏ మార్గాల ద్వారా వెళుతూ ఉండేవారో వాటిని అన్నింటినీ తుడిచి శుభ్రం చేస్తుండేవాడు. అతని తరువాత ఈ పని రాధాకృష్ణమాయి ఎంతో శుభ్రంగా నెరవేరుస్తూ ఉండేది. ఆమె తరువాత అబ్దుల్లా చేస్తుండేవాడు. బాలాజీ ప్రతి సంవత్సరం పంట కోయగానే దాన్ని అంతా తెచ్చి బాబాకి అర్పితం చేస్తూ ఉండేవాడు. అతడు బాబా ఇచ్చినదానితో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ ప్రకారంగా అతడు చాలా సంవత్సరాలు చేశాడు. అతని తరువాత అతని కుమారుడు దాన్ని అవలంభించాడు.

ఊదీ ప్రభావము

ఒకరోజు బాలాజీ సంవత్సరీకం రోజు నేవాస్కరు కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనానికి పిలిచారు. భోజన సమయానికి పిలిచినా వారికంటే మూడురెట్లు బంధువులు వచ్చారు. నేవాస్కరు భార్యాకు సంశయం కలిగింది. వండిన పదార్థాలు వచ్చినవారికి చాలవు అని, కుటుంబ గౌరవానికి భంగమ కలుగుతుందని ఆమె భయపడింది. ఆమె అత్తగారు ఓదారుసూ 'భయపడకు, ఇది మంది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పేయి. వాటిలో కొంచెం ఊదీ వేయి, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయి, సాయి మనల్ని కాపాడుతారు' అన్నది. ఆమె సలహా ప్రకారమే చేసింది. వచ్చిన వారికి భోజనపదార్థాలు సరిపోవడమే కాకుండా ఇంకా చాలా మిగిలిపోయింది. తీవ్రంగా ప్రార్థించినట్లయితే యథాప్రకారం ఫలితం పొందవచ్చు అని ఈ సంఘటన తెలియజేస్తుంది.

సాయి పాములా కనిపించడం :

ఒకరోజు షిరిడీ నివాసి రఘుపాటీలు నేవాసెలో ఉన్న బాలాజీ పాటీలు ఇంటికి వెళ్ళారు. ఆరోజు సాయంకాలం ఒక పాము అవులకొట్టం లోపలికి బుసకొడుతూ దూరింది. అందులోని పశువులు అన్నీ భయపడి కదలడం మొదలుపెట్టాయి. ఇంట్లోని వారందరూ భయపడ్డారు, కానీ బాలాజీ శ్రీసాయియే ఆ రూపంలో వచ్చారని భావించాడు. ఏమీ భయపడక గిన్నెతో పాలుతెచ్చి పాము ముందు పెట్టి ఇలా అన్నాడు 'బాబా ఎందుకు బుసకొడుతున్నావు? ఎందుకీ అలజడి? మమ్మల్ని భయపెట్టదలిచావా? ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగు' ఇలా అంటూ అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చున్నాడు. ఇంట్లోని మిగిలినవారు భయపడ్డారు. వారికి ఏమీ చేయడానికి తోచలేదు. కొద్దిసేపటిలో పాము తనంతట తానే మాయమైపోయింది. ఎంత వెదికినా కనిపించలేదు.

బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలు ఉన్నారు. బాబా దర్శనం కోసం వారు అప్పుడప్పుడూ షిరిడీకి వెళ్తుండేవారు. బాబా వారికోసం చీరలు, బట్టలుకొని ఆశీర్వాదాలతో ఇస్తూ ఉండేవారు.

ముప్పైఐదవ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "saibaba-satcharitra-35-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!