saibaba-satcharitra-37-chapter

శ్రీ సాయిసచరిత్ర

ముప్పై ఏడవ అధ్యాయం

చావడి ఉత్సవం :

హేమాడ్ పంతు ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయాలు ప్రస్తావించిన తరువాత చావడి ఉత్సవాన్ని గురించి వర్ణిస్తున్నారు.

తొలిపలుకు :

శ్రీ సాయి జీవితం అత్యంత పావనమయినది. వారి నిత్యకృత్యాలు ధన్యం. వారి పద్ధతులు, చర్యలు వర్ణించడానికి వీలులేదు. కొన్ని సమయాలలో వారు బ్రహ్మానందంతో మైమరచిపోయేవారు. మరికొన్ని సమయాలలో పరిజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒక్కొక్కప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కాని, నిద్రపోతూ కానీ కనిపించే వారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రంలా శాంతంగా తొణకకుండా ఉండేలా కనిపించినా వారి గాంభీర్యం, లోతు కనిపెట్టలేనివి. వర్ణానాతీతమైన వారి నైజం వర్ణించేవారు ఎవరు? పురుషులను అన్నదమ్ముల వలే, స్త్రీలను అక్కచెల్లెళ్ళుగా, తల్లులుగా చూసుకునేవారు. వారి శాశ్వత అస్ఖలిత బ్రహ్మచర్యం అందరికీ తెలిసినదే. వారి సాంగత్యంలో మనకు కలిగిన జ్ఞానం మనం మరణించే వరకు నిలుచుగాక! ఎల్లప్పుడూ హృదయపూర్వకమైన భక్తితో వారి పాదాలకు సేవ చేసెదముగాక! వారిని సకలజీవకోటిలో చూద్దాంగాక! వారి నామం ఎల్లప్పుడూ ప్రేమిద్దాంగాక!

వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసం చేసిన తరువాత హేమాడ్ పంతు చావడి ఉత్సవాన్ని వర్ణించడం మొదలుపెట్టారు.

చావడి ఉత్సవం :

బాబా శయనశాలను ఇదివరకే వర్ణించాను. వారు ఒకరోజు మసీదులోను, ఇంకొకరోజు చావడిలోను నిద్రిస్తూ ఉండేవారు. మసీదుకు దగ్గరలోనే చావడి రెండు గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెందేవరకు ఒకరోజు మాసీదులో, ఇంకొకసారి చావడిలో నిద్రిస్తూ ఉండేవారు 1910 డిసెంబరు 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజా, హారతులు జరపడం మొదలుపెట్టారు. బాబా కటాక్షంతో దీనినే ఇప్పుడు వర్ణిస్తున్నాను. చావడిలో నిద్రించే సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనుక రథం, కుడివైపు తులసీ బృందావనం, ముందు బాబా వీరి మధ్య భజన జరుగుతూ ఉండేది. భజనలో ప్రీతికల స్త్రీపురుషులు సరైన సమయంలో వస్తుండేవారు. కొందరు తాళాలు, కొందరు చిడతలు, మృదంగం, కంజీరా, మద్దెలు పట్టుకుని భజన చేస్తుండేవారు. సూదంటురాయిలా సాయిబాబా భక్తులందరినీ తన దగ్గరకు ఈడ్చుకునే వారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేస్తూ ఉన్నారు. కొందరు పల్లకిని అలంకరిస్తూ ఉన్నారు. కొందరు బెత్తాలను చేతపట్టుకుని 'శ్రీసాయినాథ మహారాజ్ కీ జై!’ అని కేకలు వేస్తూ ఉన్నారు. మసీదు మూలాలు తోరణాలతో అలంకరిస్తూ ఉన్నారు. మసీదు చుట్టూ దీపాల వరసలు కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. బాబా గుఱ్ఱం 'శ్యామకర్ణ' అలంకరించి బయట నిలబడి ఉండేది. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవారు.

బాబా నిశ్చలంగా కూర్చునేవారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుతూ ఉండేవారు. తాత్యా, బాబాను 'మామా' అని పిలిచేవారు. నిజంగా వారి భాంధవ్యం అత్యంత సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫినీ వేసుకుని చంకలో సటకా పట్టుకొని, చిలుముని పొగాకును తీసుకుని పైన ఉత్తరీయం వేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తరువాత తాత్యా జలతారు, షెల్లాను బాబా ఒంటిపై వేసేవాడు. అటు తరువాత బాబా తన కుడిపాదం బొటనవ్రేలితో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుతున్న దీపాన్ని ఆర్పి, చావడికి బయలుదేరేవారు. అన్ని వాయిద్యాలు మ్రోగేవి, మతాబులు, మందుసామానులు అనేక రంగులు ప్రదర్శిస్తూ కాలేవి. పురుషులు, స్త్రీలు బాబా నామాన్ని పాడుతూ మృదంగం, వీణలు మ్రోగిస్తూ భజన చేస్తూ ఉత్సవంలో నడుస్తుండేవారు. కొందరు సంతోషంతో నాట్యం చేస్తూ ఉన్నారు. కొందరు జెండాలను చేత పట్టుకుని ఉండేవారు. బాబా మసీదు మెట్లపైకి రాగా కాపలాదారులు 'శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై!’ అని కేకలు పెడుతూ ఉన్నారు. బాబాకి ఇరుపక్కల చామరాలు మొదలైనవి పట్టుకుని విసురుతూ ఉన్నారు. మార్గం అంతా అడుగులకు మడుగులు పరిచేవారు. వాటిపై బాబా భక్తులు నడిచేవారు. తాత్యా ఎడమచేతిని, మహాల్సాపతి కుడిచేతిని, బాపు సాహెబు జోగు శిరస్సుపై ఛత్రాన్ని పట్టుకునేవారు. ఈ ప్రకారంగా బాబా చావడికి ప్రయాణం అవుతుండేవారు. పూర్తిగా అలంకరించిన ఎర్రగుఱ్ఱం శ్యామకర్ణ దారి తీస్తూ ఉండేది. దాని వెనుక పాటలు పాడేవారు, భజన చేసేవారు, వాయిద్యాలు మ్రోగించేవారు, భక్తుల ప్రవాహం ఉండేది. హరినామ స్మరణతో, బాబా నామ స్మరణతో ఆకాశం బద్దలు అయ్యేలా మారుమ్రోగుతూ ఉంది. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొనే వారు అందరూ ఆనందిస్తూ ఉన్నారు.

ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడివైపు ముఖం పెట్టి నిలబడి ఒక విచిత్రమైన ప్రకాశంతో వెలిగేవారు. వారి ముఖం ఉదయసంధ్యలా లేదా బాలబానుడిలా ప్రకాశిస్తూ ఉంది. అక్కడ బాబా ఉత్తరంవైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలబడేవారు. వారెవరినో పిలుస్తున్నట్లు కనిపించేది. సమస్త వాయిద్యాలు మ్రోగుతున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండిపళ్ళెంలో పువ్వులు, గులాల్ పొడిని తీసుకుని బాబాపై అనేకసార్లు చల్లుతున్నారు. అలాంటి సమయంలో సంగీత వాయిద్యాలు వారి శక్తికొలది ధ్వనిస్తూ ఉన్నాయి. బాబా ముఖం స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోనూ, సౌందర్యంతోనూ వెలుగుతూ ఉంది. అందరూ ఆ ప్రకాశాన్ని మనసారా గ్రోలుతూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని ఆ శోభను వర్ణించడానికి మాటలు చాలవు, ఒక్కొక్కప్పుడు ఆ ఆనందాన్ని భరించలేక మహాల్సాపతి దేవత ఆవహించినవాడిలా నృత్యం చేసేవాడు. కానీ బాబా యొక్క ధ్యానం ఏమాత్రం చెదరకుండా ఉండేది. చేతిలో లాంతరు పట్టుకుని తాత్యాపాటీలు బాబాకు ఎడమపక్క నడుస్తూ ఉన్నారు. భక్త మహాల్సాపతి కుడివైపు నడుస్తూ బాబా శెల్లా అంచును పట్టుకునేవారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పలనవి కానిది. ఈ పల్లకి ఉత్సవాన్ని చూడడానికి పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుతూ ఉన్నారు. బాబా నెమ్మదిగా నడుస్తూ ఉన్నారు. భక్తిప్రేమలతో భక్తమండలి బాబాకి ఇరుపక్కలా నడుస్తూ ఉండేవారు. వాతావరణం అంతా ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుతూ ఉండేది. ఆ దృశ్యం, ఆ కాలం గడిచిపొయానాయి. ప్రస్తుతంగాని, ఇక ముందుగాని ఆ దృశ్యాన్ని చూడలేము. ఐనా ఆ దృశ్యం జ్ఞాపకం తెచ్చుకుని తలచునట్లయితే మనస్సుకు శాంతి, తృప్తి కలుగుతుంది.

చావాడిని చక్కగా అలంకరిస్తూ ఉండేవారు. దాన్ని తెల్లని పైకప్పుతోనూ, నిలువు అద్దాలతోనూ అనేక రంగుల దీపాలతోనూ, వ్రేలాడగట్టిన గాజుబుడ్డీలతోనూ అలంకరిస్తూ ఉండేవారు. చావడి చేరగానే తాత్యా ముందుగా ప్రవేశించి ఒక ఆసనం వేసి బాలీసు నంచి బాబాను కూర్చోబెట్టి మంచి అంగరఖా తొడిగించిన తరువాత భక్తులు బాబాను వేయి విధాలా పూజిస్తూ ఉన్నారు. బాబా తలపై తురాయి కిరీటము పెట్టి పువ్వుల మామలు వేసి, మెడలో నగలు వేస్తుండేవారు. ముఖానికి కస్తూరి నామాన్ని, మధ్యలో బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరంగా చూసేవారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీస్తూ ఉండేవారు లేకపోతే బాబా దాన్ని విసిరివేస్తారని వారి భయం. బాబా భక్తుల అంతరంగాన్ని గ్రహించి వారి కోరికలకు లొంగి ఉండేవారు. వారు చేసేదానికి అభ్యంతరం పెట్టేవారు కాదు. ఈ అలంకరణతో బాబా ఇంకా సుందరంగా కనిపిస్తూ ఉండేవారు.

నానాసాహెబు నిమోణ్ కర్ గిర్రున తిరిగే కుచ్చుల ఛత్రాన్ని పట్టుకుంటూ ఉండేవారు. బాపూసాహెబు జోగ్ ఒక వెండి పెల్లెమ్లో బాబా పాదాలను కడిగి, ఆర్ఘ్యపాద్యాలు అర్పించి చేతులకు గంధాన్ని పూసి, తాంబూలం ఇస్తుండేవారు. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలైన భక్తులు వారి పాదాలకు నమస్కరిస్తూ ఉండేవారు. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరాలతోనూ, విసినకర్రాలతోనూ విసురుతూ ఉండేవారు. అప్పుడు శ్యామా చిలుము తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా అతను ఒక పీల్పు పీల్చి బాబాకి ఇస్తుండేవారు. బాబా పీల్చిన తరువాత భక్త మహాల్సాపతికి ఇచ్చేవారు. తరువాత ఇతరులకు లభిస్తూ ఉండేది. జడమైన చిలుము ధన్యమైనది, మొట్టమొదట అది అనేక తపః పరీక్షలకి ఆగవలసి వచ్చింది, కుమ్మరులు దాన్ని తొక్కడానికి, ఎండలో ఆరబెట్టడానికి, నిప్పుల్లో కాల్చడం వంటివి సహించి చివరికి అది బాబా ముద్దుకు, చేతిస్పర్షకు నోచుకుంది. ఈ ఉత్సవం పూర్తయిన తరువాత భక్తులు పూలదండలు బాబా మెడలో వేసేవారు. వాసన చూడటానికి పువ్వుల గుత్తులను చేతికి ఇచ్చేవారు. బాబా నిర్వ్యామొహం, అభిమానరాహిత్యాలకు అవతారం కావడంతో ఆ అలంకరణలను గాని మర్యాదలను గాని లేక్కపెట్టేవారు కాదు, భక్తులలో గల అనురాగంతో, వారి సంతోషం కోసం వారి ఇష్టానుసారం చేయడానికి ఒప్పుకునేవారు. ఆఖరుకు బాపూసాహెబు జోగ్ సర్వలాంచనాలతో హారతి ఇచ్చేవారు. హారతి సమయంలో భాజాభజంత్రీ మేళతాళాలు వాయించేవారు. హారతి ముగిసిన తరువాత భక్తులు ఆశీర్వాదం పొంది బాబాకి నమస్కరించి ఒకరి తరువాత ఒకరు తమతమ ఇళ్ళకు వెళ్తుండేవారు. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన తరువాత తాత్యా ఇంటికి వెళ్ళడానికి లేవగా, బాబా ప్రేమతో అతినితో ఇలా అన్నారు. ‘నన్ను కాపాడు, నీకు ఇష్టం ఉంటే వెళ్ళు కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుక్కుంటూ ఉండు.’ అలాగే చేస్తాను అంటూ తాత్యా చావడి వదిలి ఇంటికి వెళ్ళేవారు. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై మరొకటి వేసి దానిపై పడుకునేవారు.

మనం కూడా ఇప్పుడు విశ్రమిద్దాం. ఈ అధ్యాయాన్ని ముగించక ముందు భక్తులకు ఒక మనవి, ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు సాయిబాబాను, వారి చావడి ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.

ముప్పై ఏడవ అధ్యాయం సంపూర్ణం

ఐదవరోజు పారాయణ సమాప్తం