saibaba-satcharitra-39-chapter

   

 

శ్రీసాయిసచ్చరిత్ర

ముప్పైతొమ్మిదవ అధ్యాయము

ఈ అధ్యాయంలో భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి బాబా చెప్పిన అర్థం ఉంది. కొందరు బాబాకి సంస్కృతం తెలియదని, అది నానాసాహెబు ఛాందోర్కర్ చెప్పింది అనడంతో హేమాడ్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించారు. రెండు అధ్యాయాలలో ఒకే విషయం ఉండటంతో రెండూ ఇందులో పొందుపరచబడింది.

తొలిపలుకు :

షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయీ పావనమైనది. ఎలాగంటే శ్రీ సాయిబాబా అక్కడే నివశిస్తూ, తిరుగుతూ, మసలుతూ చివరికి అక్కడే మహాసమాధి చెందారు. షిరిడీ గ్రామస్థులు ధన్యులు. వారి అన్ని కార్యాలను బాబా నెరవేరుస్తూ ఉండేవారు. బాబా వారికోసమే ఎంతో దూరం నుండి అక్కడికి వచ్చారు. షిరిడీ చాలా చిన్న గ్రామం. సాయిబాబా అక్కడ నివశించటంతో దానికి గొప్ప ప్రాముఖ్యం ఏర్పడింది. చివరికి పవిత్రమైన యాత్రాస్థలం అయింది. అక్కడ ఉండే స్త్రీలు కూడా ధన్యులు. బాబాపట్ల వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైంది. బాబా మహిమను వారు స్నానం చేసే సమయంలో, విసురుతున్నప్పుడు, రుబ్బుతున్నప్పుడు, ధాన్యాన్ని దంచుతున్న సమయంలో, మిగిలిన గృహావసరాలు చేస్తున్నప్పుడు పాడుతూ ఉండేవారు. వారి భక్తీప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుతూ ఉండేవారు. అవి పాడినవారికి, విన్నవారికి మనఃశాంతి కలగజేస్తూ ఉండేది.

బాబా చెప్పిన అర్థం :

బాబాకి సంస్కృతం వచ్చునని నమ్మేవారు ఉండరు. ఒకరోజు భగవద్గీతలోని ఒక శ్లోకానికి బాబా చక్కని అర్థాన్ని నానాసాహెబు ఛాందోర్కర్ కి బోధించి ఆశ్చర్యం కలిగించారు. ఈ విషయం గురించి బి.వి.రావుగారు (శ్రీ సాయి లీల, సంపుటి - IV,5పుట – 563, 'స్ఫుటవిషయ' లో) వ్రాశారు. వారు స్వయంగా నానాసాహెబు ఛాందోర్కర్ దగ్గరనుంచి కొన్ని సంగతులు తెలుసుకోవడంతో ఆ వృత్తాంతం ఈ దిగువ ఇవ్వబడింది.

నానాసాహెబు ఛాందోర్కర్ వేదాంతాన్ని బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి ఉన్నందు వలన తన పాండిత్యానికి గర్విస్తూఉండేవాడు. బాబాకి ఈ విషయంకాని, సంస్కృతంకాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుకే ఒకరోజు బాబా అతని గర్వాన్ని అణిచేశారు. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రాని సమయంలో బాబా భక్తుల సంశయాలను తీర్చడానికి ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుతూ ఉన్నారు. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళుపడుతూ నోటిలో ఎదో గొణుక్కుంటూ ఉన్నారు.

బాబా: నానా! ఏమిటి గొణుగుతున్నావు?

నానా : సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను.

బాబా : ఏ శ్లోకం?

నానా : భగవద్గీతలోనిది

బాబా : గట్టిగా చదువు

నానా : (భగవద్గీత 4 -వ అధ్యాయం, 34వ శ్లోకం ఈ క్రింది విధంగా చదివారు)

తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేన సేవాయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః

బాబా : నానా! అది నీకు బోధపడిందా?

నానా : అవును

బాబా : నీకు తెలిస్తే నాకు చెప్పు

నానా: దాని తాత్పర్యం ఇది. సాష్టాంగ నమస్కారం చేయడం అంటే పాదాలపై పడటం, గురువుని ప్రశ్నించడం, వారి సేవ చేయడం ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకో. అప్పుడు మోక్షాన్ని పొందే జ్ఞానం కలవారు అనగా పరబ్రహ్మాన్ని తెలిసినవారు ఆ జ్ఞానాన్ని ఉపదేశించెదరు.

బాబా : నానా! శ్లోకం యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థం వ్యాకరణ ఇంకా దాని అర్థం చెప్పు.

అప్పుడు నానా ప్రతిపదానికి అర్థం చెప్పారు.

బాబా : నానా! ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా?

నానా : ప్రణిపాత అనే పదానికి ఇంకొక అర్థం నాకు తెలియదు. ప్రణిపాత అంటే సాష్టాంగ నమస్కారం అని నాకు తెలుసు

బాబా : పరిప్రశ్న అంటే ఏమిటి?

నానా : ప్రశ్నలు అడగడం

బాబా: ప్రశ్న అంటే ఏమిటి?

నానా : అదే, అంటే ప్రశ్నించటం

బాబా : పరిప్రశ్న అన్నా ప్రశ్న అన్నా ఒక్కటే అయినట్లయితే, వ్యాసుడు 'పరి' అనే ప్రత్యయానికి ప్రశ్నకు ముందు ఎలా ఉపయోగించారు? వ్యాసుడు తెలివితక్కువ వాడా?

నానా : పరిప్రశ్న అనే మాటకు నాకు ఇతర అర్థం ఏమీ తెలియదు

బాబా : సేవ అంటే ఎలాంటిది?

నానా : ప్రతిరోజూ మేము చేసేది

బాబా : అలాంటి సేవ చేసినా చాలా?

నానా : సేవ అనే పదానికి ఇంకా వేరే అర్థం ఏమి ఉందో నాకు తోచటం లేదు.

బాబా : రెండవ పంక్తిలోని 'ఉపదేక్ష్యంతి తే జ్ఞానం' అనే దానిలో జ్ఞానం అనే పదం ఉపయోగించకుండా ఇంకొక పదాన్ని ఉపయోగించగలవా?

నానా : అవును

బాబా : ఏ పదం?

నానా : అజ్ఞానం

బాబా : జ్ఞానానికి బదులు అజ్ఞానం ఉపయోగించినట్లయితే ఈ శ్లోకంలో ఏమైనా అర్థం ఉందా?

నానా : లేదు, శంకరభాష్య ఆ విధంగా చెప్పడం లేదు

బాబా : వారు చెప్పకపోతే పోనివ్వు. అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించినట్లయితే సరైన అర్థం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించడానికి ఏమైనా ఆక్షేపణ ఉందా?

నానా : అజ్ఞానం అనే పదాన్ని చేర్చి దాని అర్థాన్ని వివరించడం నాకు తెలియదు.

బాబా : కృష్ణుడు అర్జునుడికి జ్ఞానులకు తత్త్వదర్శులకు నమస్కారం, ప్రశ్నించడం, సేవ చేయమని చెప్పడం ఎందుకు? స్వయంగా కృష్ణుడు తత్త్వదర్శి కాదా? వారు నిజంగా జ్ఞానమూర్తే కదా!

నానా : అవును, అతడు తత్త్వదర్శే . కానీ అర్జునుడు ఇతర జ్ఞానులను ఎందుకు సేవించమని అన్నారో నాకు తోచడం లేదు.

బాబా : నీకిది బోధపడలేదా?

నానా సిగ్గుపడ్డాడు అతని గర్వం అణిగింది. అప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించారు.

1. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు. మనం సద్గురువుకి సర్వస్య శరణాగతి చేయాలి,

2. ఊరికే ప్రశ్నించడం చాలదు. దుర్బుద్ధితో కాని, దొంగ ఎత్తుతో కాని, వారిని బుట్టలో వేసుకోవడానికి కానీ, వారి తప్పులను పట్టుకోవడం కాని, పనికిమాలిన ఆసక్తితో అడగకూడదు. నిజంగా తెలుసుకొని దాంతో మోక్షం పొందడానికి కాని, ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగాలి.

3. సేవ అంటే ఇష్టం ఉన్నట్లయితే చేయవచ్చు లేకపోతే మానేయవచ్చు అనే అభిప్రాయంతో చేసేది సేవ కాదు. శరీరం తనది కాదు అని, దానికి తాను యజమాని కాదు అని శరీరం గురువుగారిది అని, వారి సేవ కోసమే శరీరం ఉన్నది అని భావించాలి. ఇలా చేసినట్లయితే సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానాన్ని బోధిస్తుంది.

గురువు అజ్ఞానాన్ని బోధిన్స్తారు అంటే నానాకు అర్థం కాలేదు.

బాబా : జ్ఞానం ఉపదేశం ఎలా అవుతుంది? అంటే సాక్షాత్కారం బోధించడం ఎలా అవుతుంది? అజ్ఞానాన్ని నశింప చేయడమే జ్ఞానం.

జ్ఞానేశ్వర మహారాజు ఇలా చెప్పారు 'అజ్ఞానాన్ని తొలగించడం ఇలా. ఓ అర్జునా! స్వప్నం, నిద్ర తొలగిపోయినట్లయితే మిగిలేది నీవుగా గ్రహించు. జ్ఞానం అంటే అజ్ఞానాన్ని నశింపజేయటమే. చీకటిని తరమడమే వెలుతురు. ద్వైత్వాన్ని నశింప చేసేది ఏమిటంటే, అద్వైతాన్ని గురించి చెప్పడమే. చీకటిని నశింప చేసేది ఏమిటంటే వెలుతురు గురించి చెప్పడం.  అద్వైత్వం పొందాలి అంటే, అద్వైత్వం అనే భావాన్ని మనసులో నుండి తీసివేయాలి. అదే అద్వైత్వాన్ని పొందే జ్ఞానం. ద్వైత్వంలోనే ఉండి అద్వైత్వాన్ని గురించి మాట్లాడగలవారు ఎవరు? ఎవరైనా అలా చేసినట్లయితే నా స్థితిలోకి వారు రానిదే వారికి అది ఎలా తెలుస్తుంది? దాన్ని ఎలా పొందుతారు? శిష్యుడు గురువులా జ్ఞానమూర్తే. వీరిద్దరికీ భేదం ఏమిటంటే గ్రహించే తీరు, గొప్ప సాక్షాత్కారం, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వం ఇంకా ఐశ్వర్యయోగం. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారంలో అవతరించడం, జగత్తును మానవాళిని ఉద్ధరించడానికి మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెం కూడా వికారం చెందదు. వారి సత్యస్వరూపం, దైవికశక్తి, జ్ఞానం తరగకుండా ఉంటుంది. శిష్యుడు కూడా అలాంటి స్వరూపం కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధచైతన్యం అనే సంగతిని కప్పివేస్తుంది. అతడు 'నేను సామాన్య నికృష్టజీవుడిని' అనుకుంటాడు. గురువు ఈ అజ్ఞానాన్ని మూలంతో సహా తీసివేయాలి, తగిన ఉపదేశం ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మలనుండి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించాలి. ఎన్నో జన్మలనుండి తాను నికృష్టజీవుడు అనుకునే శిష్యుడికి గురువు 'నీవే దైవం, శక్తిమంతుడివి, ఐశ్వర్యశాలివి' అని బోధిస్తారు. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమని, తానొక జీవినని లేదా అహంకారమని, దేవుడు, లోకం తనకంటే వేరు అని తలంచి అంతా భ్రమ అనేక జన్మలనుండి వస్తున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మలనుండి వాడికి సంతోషం, విచారం ఈ రెండింటి యొక్క మిశ్రమం కలుగుతుంది. ఈ భ్రమను, ఈ దోషాన్ని, ఈ మూల అజ్ఞానాన్ని గురించి అతడు విచారం ఆరంభించాలి. ఈ అజ్ఞానం ఎలా అంకురించింది? అది ఎక్కడుంది? అనే దాన్ని చూపించడమే గురువు ఉపదేశం అంటారు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణాలు :

1. నేను జీవిని (ప్రాణిని)

2. శరీరమే ఆత్మ (నేను శరీరాన్ని)

3. భగవంతుడు, ప్రపంచం, జీవుడు వేరువేరు

4. నేను దేవుడిని కాదు

5. శరీరం ఆత్మ కాదని తెలుసుకోలేకపోవడం

6. దేవుడు జీవుడు, ప్రపంచం ఒక్కటే అని తెలియకపోవడం.

ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడు అంటే, ప్రపంచం అంటే, శరీరం అంటే ఏమిటో తెలుసుకోలేడు. వాడిలో వాడికి ఎలాంటి సంబంధం కలదో ఒకటి యింకొకటి కంటే వేరైనదా లేక రెండూ ఒక్కటేనా అనే విషయాన్ని గ్రహించలేడు. ఈ సంగతులను బోధించడానికి వాడి అజ్ఞానం నశింప చేయడానికి చెప్పేదే జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయినా జీవుడికి జ్ఞానోపదేశం ఎందుకు చేయాలి? ఉపదేశం అనేది వాడి తప్పును వాడికి చూపించి వాడి అజ్ఞానాన్ని నశింప చేయడం కోసమే. బాబా ఇంకా ఇలా వివరించారు …

1. ప్రాణిపాత అంటే శరణాగతి చేయడం. 2. శరణాగతి అంటే తను (శరీరం) మన (మనస్సు) ధనాలని (ఐశ్వర్యం) అర్పించడం. 3. శ్రీకృష్ణుడు ఆర్జునుడిని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకు చెప్పాడు? సద్భక్తుడు సర్వం వాసుదేవమయంగా భావిస్తాడు. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిలా భావిస్తాడు. గురువు శిష్యుణ్ణి వాసుదేవుడిగానూ, శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణం ఆత్మలుగానూ భావిస్తాడు. అటువంటి భక్తులు, గురువులు ఉన్నారని శ్రీకృష్ణుడికి తెలిసి ఉండటంతో వారిని గురించి అర్జునుడికి చెప్పాడు. అలాంటి వారి గొప్పతనం పెరిగి అందరికీ తెలియాలనే శ్రీకృష్ణుడు అలా అన్నాడు.

సమాధి మందిర నిర్మాణము :

బాబా తాను చేయాలనుకుని నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఎటువంటి సందడి చేసేవారు కాదు. సంగతి సందర్భాలను వాతావరణాన్ని అత్యంత యుక్తిగా ఏర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగిస్తూ ఉండేవారు. దానికి సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ.

నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపూసాహెబు బూటీ షిరిడీలో కుటుంబంతో ఉండేవారు. అతనికి అక్కడ సొంత భవనం ఉంటే బాగుంటుంది అని ఆలోచన కలిగింది. కొద్దిరోజుల తరువాత దీక్షిత్ వాడాలో నిద్రపోతుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది. బాబా స్వప్నంలో కనపడి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమని చెప్పారు. అక్కడ నిద్రపోతున్న శ్యామాకి కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. బాపూసాహెబు లేచి శ్యామా ఏడవడం చూసి కారణం అడిగారు. శ్యామా ఇలా చెప్పాడు 'బాబా నా దగ్గరికి వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మించు అని. నేను అందరి కోరికలను నెరవేరుస్తానని అన్నారు. బాబా ప్రేమమధురమైన పలుకులు విని భావావేశంతో మైమరచిపోయాను. నా గొంతు ఎండిపోయింది. నా కళ్ళనుండి నీరు కారుతూ ఉంది, నేను ఏడవడం మొదలుపెట్టాను'. వారిద్దరి దివ్యస్వప్నాలు కావడంతోనూ చేతనయిన వాడు అవడంతో, అక్కడొక వాడాను నిర్మించడానికి నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయంతో ఒక ప్లాను గీశారు. కాకాసాహెబు దీక్షిత్ దానికి అంగీకరించారు. కట్టడం ప్రారంభించారు. శ్యామా పర్యవేక్షణ చేస్తున్నాడు. భూమిపైన ఇళ్ళు, భూమి క్రింద ఇళ్ళు, బావి పూర్తయ్యాయి. బాబా కూడా లెండికి వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు కొన్ని మార్పులను సూచిస్తూ సలహాలను ఇస్తున్నారు. మిగిలిన పని అంతా బాపూసాహెబు జోగును చూడమని చెప్పారు. అది నిర్మిస్తున్నప్పుడు బాపూసాహెబు బూటీకి ఒక ఆలోచన కలిగింది. చుట్టూ గదులు ఉండే విధంగా, దాని మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీకృష్ణుడి) విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనిపించింది. బాబాకి ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయాన్ని కనుక్కోవాలని శ్యామాకు చెప్పాడు. వాడా పక్కనుంచి బాబా వెళ్తుండగా వారిని శ్యామా ఈ విషయాన్ని అడిగారు. బాబా అందుకు ఒప్పుకుని 'దేవాలయం పూర్తికాగానే నేనే అక్కడ నివశించడానికి వస్తాను' అని వాడావైపు చూస్తూ 'వాడా పూర్తయిన తరువాత మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. మనమందరం అక్కడ ఉందాము. అందరూ కలిసిమెలిసి ఆడుకుందాము. ఒకరినొకరు కౌగలించుకుని సంతోషంగా ఉండవచ్చు' అన్నారు. దేవస్థానం మధ్యలో మందిరం కట్టడానికి అది తగిన శుభసమయమా అని శ్యామా అడగ్గా, బాబా సమ్మతించడంతో శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించాడు. కొద్ది రోజులలో పని పూర్తయింది. మురళీధర్ విగ్రహం తయారు చేయడానికి ఆజ్ఞాపించారు. అది తయారు కాకముందే కొత్త సంగతి జరిగింది. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. వారు భౌతికకాయాన్ని విడవడానికి సిద్ధంగా ఉన్నారు. బాపూసాహెబు ఎంతో విచారించాడు, నిరశపడ్డాడు. బాబా సమాధి చెందినట్లయితే, తన వాడా బాబా పాదాలతో పవిత్రం కాదని, తాను ఖర్చుపెట్టిన లక్షరూపాయలు వ్యర్థం అవుతాయని చింతించాడు. కానీ బాబా సమాధి చెందకముందు 'నన్ను రాతి వాడాలో ఉంచండి' అన్నట్లు పలుకులు బాపూసాహెబుకే కాకుండా అందరికీ ఊరట కలిగించాయి. సకాలంలో బాబా పవిత్రశరీరాన్ని మధ్య మందిరంలో పెట్టి సమాధి చేశారు. ఇలా మురళీధరుని కోసం నిర్ణయించిన స్థలంలో బాబా సమాధి చేయడంతో బాబాయే మురళీధరుడని, బూటీవాడాయే సమాధి మందిరం అని అర్థాన్ని గ్రహించాలి. వారి విచిత్ర జీవితం లోతును కనుక్కోవడం సాధ్యం కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరం సమాధి అవడంతో బాపూసాహెబు బూటీ ఎంతో అదృష్టవంతుడు, ధన్యుడు.

ముప్పైతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం

    

0 Comments To "saibaba-satcharitra-39-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!