saibaba-satcharitra-45-chapter

శ్రీసాయిసచ్చరిత్ర

ఏడవరోజు పారాయణ (బుధవారము)

నలభై ఐదవ అధ్యాయం

గత మూడు అధ్యాయాలలో బాబా మహాసమాధి గురించి చెప్పాము. వారి భౌతికశరీరం మన దృష్టి నుండి నిష్క్రమించిందిగాని, వారి అనంత స్వరూపం లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలిపే ఉంటుంది. ఇప్పటివరకు వారి జీవితకాలంలో జరిగిన లీలల గురించి చెప్పాము. వారు సమాధి చెందిన తరువాత కొత్త లీలలు జరుగుతున్నాయి. దీన్నిబట్టి బాబా శాశ్వతంగా ఉన్నారనీ, తమ భక్తులకు పూర్వంలా తోడ్పడుతున్నారనీ తెలుస్తుంది. ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూశారో వారు నిజంగా అదృష్టవంతులు. అటువంటివారిలో ఎవరైనా ప్రపంచ సుఖాలపట్ల, వస్తువులపట్ల మమకారం పోగొట్టుకోకపోతే, వారి మనస్సులు భగవంతునికి అర్పితం కాకపొతే అది వారి దురదృష్టం అని చెప్పవచ్చు. అప్పుడేకాదు ఇప్పుడు కూడా కావలసింది బాబాపట్ల హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావాలి. కొన్నింటిని మాత్రమే సేవలో లయం చేసి మిగిలినవాటిని వేరేలా సంచరించేలా చేసినట్లయితే ప్రయోజనం లేదు. పూజగాని, ధ్యానంగాని చేయాలని అనుకున్నట్లయితే దాన్ని మనఃపూర్వకంగా, ఆత్మశుద్ధితో చేయాలి. పతివ్రతకు తన భర్తపట్ల ప్రేమని, భక్తుడు గురువుపట్ల చూపవలసిన ప్రేమతో పోలుస్తారు. అయినప్పటికీ మొదటిది ఏ రెండవ దానితో పోల్చడానికి వీలులేదు. జీవితపరమావధిని పొందడానికి తండ్రిగాని, తల్లిగాని, సోదరుడుగని ఇంకా తదితర బంధువులు ఎవ్వరూ కాని తోడ్పడరు. ఆత్మసాక్షాత్కారానికి దారిని మనమే వెదుక్కుని ప్రయాణం సాగించాలి. నిత్యానిత్యాలకు భేదం తెలుసుకుని, ఇహలోక పరలోకాలలోని విషయ సుఖాలను విడనాడి తన బుద్ధిని, మనస్సును స్వాధీనంలో ఉంచుకుని మోక్షం కోసం ఆరాటపడాలి, కోరుకోవాలి. ఇతరులపై ఆధారపడటం కంటే మన స్వశక్తి పట్ల మనకు పూర్తి నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే మనం నిత్యనిత్యాలకు గల భేదాన్ని పాటిస్తామో, ప్రపంచం అబద్ధమని తెలుసుకుంటాము. దానివలన ప్రపంచ విషయాల పట్ల మోహం తగ్గి మనకు నిర్వ్యామొహం కలుగుతుంది. క్రమంగా గురువే పరబ్రహ్మస్వరూపం అని కాబట్టి వారు ఒక్కరే నిజమని గ్రహిస్తాము. వారు ఈ జగత్తును జయించినవారు ప్రపంచానికి అతీతులు. అప్పుడు వారిని ప్రతి జీవరాశిలో చూడగలిగి పూజిస్తాము. ఇదే అద్వైత భజన లేదా పూజ. ఎప్పడైతే మనం బ్రహ్మాన్ని లేదా గురువుని హృదయపూర్వకంగా ధ్యానిస్తామో మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారం పొందుతాము. వెయ్యేళ్ళు గురువు నామాన్ని జపించడం వలన, వారి స్వరూపాన్నే మనస్సులో ఉంచుకుని ధ్యానించడం చేత వారిని సర్వ జంతుకోటిలో చూడడానికి అవకాశం కలుగుతుంది. మనకి అది శాశ్వతానందం కలగజేస్తుంది. ఈ క్రింది కథ దీన్ని విశదీకరిస్తుంది.

కాకాసాహెబు సంశయము - ఆనందరావు అనుభవము :

కాకాసాహెబు దీక్షిత్ ని ప్రతిరోజూ శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథాలను అంటే భాగవతాన్ని, భావార్థరామాయణాన్ని చదవమని బాబా ఆదేశించారు. బాబా సమాధి చెందిన తరువాత కూడా అలాగే చేస్తుండేవాడు. ఒకరోజు ఉదయం బొంబాయి చౌపాటిలో ఉన్న కాకామహాజని ఇంట్లో కాకాసాహెబు దీక్షిత్ ఏకనాథభాగవతం చదువుతున్నారు. శ్యామా, కాకామహాజని కూడా అక్కడే ఉండి శ్రద్ధతో భాగవతాన్ని వింటున్నారు. దీక్షిత్ ఏకాదశ స్కంధంలోని ద్వితీయాధ్యాయం చదువుతున్నారు. అందులో వృషభకుటుంబంలోని నవనాథులు లేదా సిద్దులైన కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, ఆవిర్ హోత్ర, దృమిళ, చమన్ మరియు కరబాజన్ లు భాగవత ధర్మసూత్రాలను జనకమహారాజుకి చెపుతున్నారు. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగారు. వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అందులో మొదటివాడైన కవి భాగవత ధర్మాన్ని బోధించారు. హరి భక్తుని లక్షణాలను, అంతరిక్షుడు మాయని దాటడాన్ని, పిప్పలాయనుడు పరబ్రహ్మాన్ని, ఆవిర్ హోత్రుడు కర్మాను, దృమిళుడు భగవంతుని అవతారాలను వారి లీలల్ని, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన తరువాత పొందే స్థితిని, కరభాజనుడు యుగయుగాలలో భగవంతుణ్ణి ఉపాశించే వేర్వేరు విధానాలను సంతృప్తికరంగా బోధించారు. వాటి సారాంశం ఏమిటంటే కలియుగంలో మోక్షం పొందడానికి ఒక్కటే మార్గం ఉంది. అదేమిటంటే గురువు పాదారవిందములను స్మరించడం.

పారాయణ ముగించిన తరువాత కాకాసాహెబు నిరుత్సాహంతో శ్యామాతో ఇలా అన్నారు. ‘నవనాథుల భక్తి విషయం గురించి ఎంత అద్భుతంగా ఉంది? దాన్ని ఆచరించడానికి ఎంత కష్టం? నవనాథులు పూర్ణజ్ఞానులే కానీ మనలాంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందడానికి వీలవుతుందా? అనేక జన్మలు ఎత్తినా మనం దాన్ని సంపాదించలేము. అలాగైతే మనకు మోక్షం ఎలా వస్తుంది? కాబట్టి అలాంటి దాన్ని మనం ఆశించకూడదని తెలుస్తుంది.’ కాకాసాహెబు నిరుత్సాహం, నిరాశలు శ్యామా యిష్టపడలేదు. వెంటనే అతను ఇలా అన్నాడు 'ఎవరైతే వారి అదృష్టవశాత్తు బాబావంటి ఆభరణాన్ని పొందారో, అలాంటివారు నిరాశచెంది ఏడవడం విచారమైన సంగతే. వారికి బాబా పట్ల నిశ్చలమైన విశ్వాసం ఉన్నట్లయితే వారు నిరాశ చెందడం ఎందుకు? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చు కానీ మనది మాత్రం ప్రేమానురాగాలతో నిండి ఉండలేదా? హరినామస్మరణ గురునామస్మరణ మోక్షప్రదం అని బాబా చెప్పి ఉండలేదా? అలాగయితే భయానికిగాని, ఆందోళనకుగాని అవకాశం ఏది?’ శ్యామ చెప్పిన సమాధానంతో కాకాసాహెబు సంతృప్తి చెందలేదు. నవనాథుల భక్తిని పొందడం ఎలా? అనే మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉన్నాడు. ఆ మరుసటిరోజు ఉదయమే ఈ క్రింది అద్భుతం జరిగింది. ఆనందరావు పాఖాడే అనే అతను శ్యామాను వెదుకుతూ పురాణ కాలక్షేపం జరుగుతున్న ప్రదేశానికి వచ్చాడు. కాకాసాహెబు భాగవతం చదువుతూ ఉన్నాడు. పాఖాడే శ్యామాకి దగ్గరగా కూర్చుని అతని చెవిలో ఏదో చెబుతున్నాడు. అతను తనకి కనిపించిన స్వప్న దృశ్యాన్ని శ్యామాకి చెబుతున్నాడు. ఇది పురాణకాలక్షేపానికి కొంచెం ఆటకం కలగజేసింది. కాకాసాహెబు పురాణం చదవడం మానేసి విషయం ఏమిటని అడిగారు. శ్యామా ఇలా చెప్పాడు 'నిన్న నీ సంశయాన్ని తెలిపావు దానికి ఇదిగొ సమాధానం. బాబా పాఖాడేకి చూపించిన స్వప్న దృశ్యాన్ని విను. ‘రక్షకమైన భక్తి' కాక వేరేది ఏదీ దీన్ని సాధించలేదు. గురువు పాదాలను భక్తితో ధ్యానించినా చాలు అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు'. అందరు ముఖ్యంగా కాకాసాహెబు ఆ దృశ్యాన్ని వివరంగా వినాలని కోరారు. వారి కోరిక ప్రకారం పాఖాడే ఆ దృశ్యాన్ని ఈ క్రింది విధంగా చెప్పడం ప్రారంభించాడు.

లోతైన సముద్రంలో నడుమువరకు దిగి అక్కడ నిలబడ్డాను. హఠాత్తుగా అక్కడ సాయిబాబాని చూశాను. రత్నాలు పొదిగిన చక్కని సింహాసనంపై బాబా కూర్చుని ఉన్నారు. వారి పాదాలు నీటిలో ఉన్నాయి, బాబా స్వరూపాన్ని చూసి ఎంతగానో ఆనందించాను. అది నిజంలా ఉందే కానీ స్వప్నంలా కనిపించడం లేదు. దాన్ని నేను స్వప్నం అని అనుకోలేదు. మాధవరావు కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. శ్యామా 'ఆనందరావు! బాబా పాదాలపై పడు' అని సలహా ఇచ్చారు. ‘నాకు కూడా నమస్కరించాలనే ఉంది. కాని వారి పదాలు నీటిలో ఉన్నాయి. కాబట్టి నా శిరస్సు వారి పాదాలపై ఎలా ఉంచగలను? నేను నిస్సహాయుడిని' అని నేను అన్నాను. అది విని అతడు బాబాతో ఇలా అన్నారు 'ఓ దేవా! నీటిలో ఉన్న నీ పాదాలను బయటికి తీయండి.’ వెంటనే బాబా తన పాదాలను బయటికి తీశారు. క్షణమైనా ఆలస్యం చేయకుండా నేను వారి పాదాలకు మ్రోక్కాను. దీన్ని చూసి బాబా నన్ను దీవించి ఇలా అన్నారు 'ఇక వెళ్ళు, నీవు క్షేమాన్ని పొందుతావు. భయంగాని, ఆందోళనగాని అవసరం లేదు. శ్యామాకి పట్టుపంచె ఒకటి దానం చేయి. దానివల్ల మేలు పొందుతావు.’

బాబా ఆజ్ఞానుసారం పాఖాడే పట్టుధోవతిని తెచ్చాడు. మాధవరావుకి ఇవ్వవలసింది అని కాకాసహేబుకి ఇవ్వవలసినదిగా వేడుకున్నాడు. శ్యామా అందుకు ఒప్పుకోలేదు. ఎలాగంటే బాబా తనకు అలాంటి సలహాని ఇవ్వలేదు కాబట్టి. కొంతవివాదం జరిగిన తరువాత కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకోవడానికి అంగీకరించాడు. సంశయ విషయాలలో చీటీ వేసి సంశయం తీర్చుకోవడం కాకాసాహెబు స్వభావం. ‘పుచ్చుకో', ‘నిరాకరించు' అనే రెండు చీటీలు రాసి బాబా పాదుకల దగ్గర పెట్టారు. ఒక బాలుడితో అందులో ఒకదాన్ని తీయించారు. ‘పుచ్చుకో' అనే చీటీని ఎంచుకోవడంతో మాధవరావుకి ధోవతి ఇచ్చారు. దాన్ని శ్యామా అంగీకరించాడు. ఇద్దరూ సంతృప్తి చెందారు. కాకాసాహెబు సంశయం తీరిపోయింది. ఇతర యోగుల మాటలను కూడా గౌరవించాలని ఈ కథ ప్రబోధిస్తుంది. కానీ మన తల్లి అయిన గురువు పట్ల పూర్ణమైన భక్తివిశ్వాసాలు ఉండాలి, వారి బోధనల ప్రకారం నడచుకోవాలి. ఎందుకంటే మన కష్టసుఖాలు ఇతరులకంటే వారికే బాగా తెలిసి ఉంటుంది. నీ హృదయఫలకంలో బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుకో. ‘ఈ లోకంలో అనేకమంది యోగులు ఉన్నారు. కాని మన గురువు అసలైన తండ్రి. ఇతరులు అనేక సుబోధనలు చేయవచ్చు కానీ మనం మన గురువు యొక్క పలుకులను మరవకూడదు. వెయ్యేళ్ళు హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించు. వారిని సర్వస్యశరణాగతి వేడుకో. భక్తితో వారి పాదాలను మ్రొక్కు అలా చేసినట్లయితే సూర్యని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు.’

కొయ్యబల్ల మంచము బాబాదే, మహాల్సాపతిది కాదు :

బాబా షిరిడీకి చేరుకున్న కొద్ది కాలానికే 4 మూరల పొడవు, ఒక జానెడు వెడల్పుగల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు. కొన్నాళ్ళు గడిచిన తరువాత బాబా దాన్ని విరిచి ముక్కలు చేసేశారు. ఒకరోజు బాబా దాని మహిమని కాకాసాహెబుకి వర్ణించి చెపుతుండగా ఇది విని అతడు బాబాతో ఇలా అన్నారు. ‘మీకింకా కొయ్యబల్ల పట్ల ఇష్టం ఉన్నట్లయితే ఇంకొక బల్ల మీకోసం మసీదులో వ్రేలాడదీస్తాను. దానిపై మీరు సుఖంగా నిద్రించవచ్చు.’ అందుకు బాబా ఇలా అన్నారు 'మహాల్సాపతిని క్రింద విడిచి నేను ఒక్కడినే పైన పడుకోవడానికి నాకు ఇష్టం లేదు.’ కాకాసాహెబు ఇలా అన్నాడు 'మహాల్సాపతికి ఇంకొక బల్లను తయారు చేయిస్తాను.’

బాబా 'అతడు ఎలా బల్లపై పడుకోగలడు? బల్లమీద అంత ఎత్తున పడుకోవడం సులభమైన పనికాదు. ఎవరు అత్యంత పుణ్యాత్ములో వారే పడుకోగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రపోతారో వారికే అది వీలవుతుంది. నేను నిద్రపోయేటప్పుడు మహాల్సాపతిని నా ప్రక్కన కూర్చుని తన చేయి నా హృదయంపై ఉంచమని చెబుతాను. అక్కడినుండి వచ్చే భగవన్నామస్మరణ వినమని చెబుతాను. నేను పడుకున్నట్లయితే నన్ను లేపమని చెబుతాను. దీన్నే అతడు నెరవేర్చలేకపోతున్నాడు. నిద్రతో కునికిపాట్లు పడుతూ ఉంటాడు. నా హృదయంపై అతని చేతి బరువును గమనించి, ఓ భగత్! అని పిలుస్తాను. వెంటనే కళ్ళు తెరిచి కదులుతాడు ఎవరైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవరు కదలకుండా ఉండలేడో, ఎవరు నిద్రకు సేవకుడో, వాడు ఎత్తైన బల్లమీద ఎలా పడుకోగలడు?’ అన్నారు. అనేక పర్యాయాలు బాబా తన భక్తులపట్ల ప్రేమతో ఇలా అన్నారు. ‘మంచిగాని, చెడ్డగాని, ఏది మనదో అది మన దగ్గర ఉన్నది. ఏది ఇతరులదో, అది ఇతరుల దగ్గర ఉన్నది.’

నలభై ఐదవ అధ్యాయం సంపూర్ణం

0 Comments To "saibaba-satcharitra-45-chapter"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!