Saibaba Satcharitra 12 Adyayam

శ్రీసాయిసచ్చరిత్ర

పన్నెండవ అధ్యాయం

శ్రీసాయి లీలలు : 1 కాకమహాజని 2 ధమాల్ ప్లీడరు 3 నిమోణ్ కర్ భార్య 4 మూలేశాస్త్రి 5 రామభక్తుడైన ఒక డాక్టరు, మొదలైనవారి అనుభవాలు

శిష్టులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని ఇంతకుముందు అధ్యాయాలలో తెలుసుకున్నాం. కాని సద్గురుమూర్తుల కర్వవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడూ, చెడ్డవాడూ ఒక్కటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంలో ప్రవర్తించేలా చేస్తారు. భవసాగరాన్ని హరించడానికి వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానం అనే చీకటిని నశింపచేయడానికి వారు సూర్యునివంటి వారు భగవంతునికంటే వేరుకాదు. సద్గురుశ్రేష్టుడైన శ్రీసాయిబాబా భక్తుల క్షేమం కోసం అవతరించారు. జ్ఞానంలో ఉత్కృష్టులై, దైవీ తేజస్సుతో ప్రకాశిస్తూ వారు అందరిని సమానంగా ప్రేమించేవారు. వారికి దేనిలోనూ అభిమానం ఉండేదికాదు. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమాన్ని వినండి. భక్తుల కోసం తమ పుణ్యం అంతా వెచ్చించి ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు. వారికి ఇష్టం లేకపోతే భక్తులు వారి దగ్గరికి రాలేకపోయేవారు. వారి వంతు రానిదేవారు బాబాను స్మరించేవారు కాదు. వారి లీలలు తెలుసుకోవడం కూడా తటస్థించేది కాదు. మరి అలాంటి వారికి బాబాను దర్శించుకోవాలనే బుద్ధి ఎలా పుడుతుంది? కొందరు బాబాను దర్శించుకోవాలని అనుకున్నారు. కాని బాబాను దర్శించుకోవాలనే కోరిక ఉన్నవారు అనేకమంది ఉన్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అలాంటివారు విశ్వాసంతో బాబా లీలలను వింటే దర్శనం చేసుకున్నా, బాబా సన్నిధిలో ఉండాలని అనుకున్నా అక్కడ ఉండలేకపోయారు. ఎవ్వారూ తమ ఇష్టానుసారం షిరిడీ వెళ్ళలేకపోయేవారు. అక్కడ ఉండటానికి ప్రయత్నించినా ఉండలేకపోయారు. బాబా ఆజ్ఞ ఎంతవరకు ఉండేదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగే వారు. బాబా వెళ్ళిపొమ్మన్న వెంటనే షిరిడీ విడిచి పెట్టాల్సి వస్తుండేది. కాబట్టి సర్వం బాబా ఇష్టం పైనే ఆధారపడి ఉండేది.

కాకా మహాజని

ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి వెళ్లారు. అక్కడ ఒక వారంరోజులు వుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలని అనుకున్నారు. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇలా అన్నారు 'ఎప్పుడు తిరిగి యింటికి వెళ్తావు?' ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపోయారు. కాని ఎదో జవాబు ఇవ్వాలి కదా! బాబా ఆజ్ఞ ఎప్పుడయితే అప్పుడు వెళ్తాను అని జవాబు ఇచ్చారు. అందుకు బాబా ఇలా అన్నారు 'రేపు వెళ్ళు' బాబా ఆజ్ఞ ఉల్లంఘనీయం కాదు. కాబట్టి అలాగే చేయవలసి వచ్చింది. అందుకే మరుసటి రోజు కాకా మహాజని షిరిడీ విడిచిపెట్టారు. బొంబాయిలో తన ఆఫీసుకు వెళ్ళగానే వారి యజమాని వారికోసమే ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బు పడ్డారు. కాబట్టి కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయం యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాశారు. అది కొన్నిరోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరింది.

బాపూసాహెబు ధుమాల్

పై దానికి భిన్నంగా కథని ఇప్పుడు వినండి. ప్లీడరు వృత్తిలో ఉన్న బాపూసాహెబు ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ వెళ్తున్నారు. దారిలో దిగి షిరిడీకి వెళ్ళారు. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ వెళ్లాలని శలవు కోరారు. కానీ బాబా ఆజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారంరోజులు ఉండేలా చేశారు. ఆ తరువాత అతను బాబా దగ్గర శెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపునొప్పి వచ్చి కేసు వాయిదా పడిందని తెలిసింది. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలలవరకు సాగింది. నలుగురు మెజిస్ట్రేటులు దాన్ని విచారించారు. చిట్టచివరికి ధుమాల్ దాన్ని గెలిచారు. అతని క్లయింటు విడుదలయ్యారు.

నిమోణ్ కర్ భార్య

నిమోణ్ గ్రామ నివాసి, గౌరవ మెజిస్ట్రేటు అయిన నానాసాహెబు నిమోణ్ కర్, తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉన్నారు. ఆ దంపతులు తమ సమయం అంతా మసీదులోనే గడుపుతూ బాబా సేవ చేస్తుండేవారు. బేలాపూరులో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్టుగా కబురు వచ్చింది. బేలాపూర్ వెళ్ళి తన కుమారున్ని, అక్కడ వున్న తమ బంధువులను చూసి అక్కడ కొన్ని రోజులు ఉండాలని తల్లి అనుకుంది. కానీ బేలాపూర్ వెళ్ళి ఆ మరుసటి రోజే షిరిడీ తిరిగి రావాల్సిందని భర్త చెప్పారు. ఆమె సందిగ్ధంలో పడింది. ఏమి చేయాలో తోచలేదు. ఆమె దైవమైన శ్రీసాయినాథుడు అప్పుడు ఆమెను ఆదుకున్నారు. బేలాపూరుకు వెళ్ళడానికి ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళింది. అప్పుడు బాబా సాఠేవాడా ముందు నానాసాహెబు మొదలైన వారితో ఉన్నారు. ఆమె బాబా దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, బేలాపూరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరింది. అప్పుడు బాబా ఆమెతో ఇలా అన్నారు 'వెళ్ళు, ఆలస్యం చేయకు! హాయిగా బేలాపూరులో నాలుగురోజులు వుండి రా! నీ బంధువులందరినీ చూసి, నింపాదిగా షిరిడీకి రా!' బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండేవో గమనించండి. నిమోణ్ కర్ ఆదేశాన్ని బాబా ఆజ్ఞ రద్దుచేసింది.

నాసిక్ నివాసియైన మూలే శాస్త్రి

మూలేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్ శాస్త్ర పారంగతుడు. జ్యోతిషసాముద్రిక శాస్త్రంలో దిట్ట. అతను నాగపూరుకు చెందిన కోటీశ్వరుడైన బాపూసాహెబు బూటీని కలుసుకోవడానికి షిరిడీ వచ్చారు. బూటీని చూసిన తరువాత బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళారు. బాబా తన డబ్బుతో మామిడిపండ్లు, కొన్ని ఫలహారపు వస్తువులను కోని మసీదులో వున్న వారందరికీ పంచిపెడుతున్నారు. మామిడిపండుని బాబా ఒక చిత్రమైన విధంగా అన్నివైపులా నొక్కేవారు. తినేవారు ఆ పండుని నోట్లో పెట్టుకుని చప్పరించాగానే రసం అంతా నోట్లోకి వెళ్ళి తొక్క, టెంక మిగిలేవి. అరటిపళ్ళను వలిచి గుజుని భక్తులకు పంచిపెట్టి, తొక్కలు బాబా తన వద్ద ఉంచుకునేవారు. మూలేశాస్త్రి సాముద్రికం తెలిసిన వాడు కావడంతో పరీక్షించడానికి బాబాను చేయి చాచమని అడిగారు. బాబా దాన్ని అసలు పట్టించుకోకుండా, నాలుగు అరటిపళ్ళని అతని చేతిలో పెట్టారు. తరువాత అందరూ వాడా చేరారు. మూలేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలైనవి ఆచరించడానికి మొదలుపెట్టారు. బాబా మామూలుగానే లెండితోటకి బయలుదేరారు. మార్గమధ్యలో బాబా హఠాత్తుగా 'గేరు (ఎర్రరంగు) తయారుగా ఉంచండి. ఈరోజు కాషాయవస్త్రాన్ని ధరిస్తాను' అని అన్నారు. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసమయం తరువాత బాబా లెండీ తోటనుంచి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం హారతి కోసం సర్వం సిద్ధం అయ్యాయి. మధ్యాహ్న హారతికి తనతో వస్తారా అని మూలేశాస్త్రిని బూటీ అడిగారు. సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటాను అని శాస్త్రీ బదులు చెప్పారు. అంతలో బాబా తన ఆసనంపై కూర్చున్నారు. భక్తులు వారికీ నమస్కరించారు. హారతి ప్రారంభమైంది. బాబా నాసిక్ బ్రాహ్మణుని దగ్గరనుంచి దక్షిణ తీసుకుని రమ్మన్నారు. బూటీ స్వయంగా దక్షిణ తీసుకుని రావడానికి వెళ్ళారు. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపోయారు. తనలో తను ఇలా అనుకున్నాడు 'నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు. కానీ, నేనాయన అశ్రితుడిని కాదే! వారికి నేను ఎందుకు దక్షిణ యివ్వాలి?' సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడగటంతో అతను కాదనలేక పోయాడు. తన అభీష్టం మధ్యలోనే ఆపి, బూటీతో మసీదుకు బయలుదేరాడు. మడిలో ఉన్న తను మసీదులో అడుగుపెడితే మైలపడిపోతానని భావించి, మసీదు బయటే దూరంగా నిలబడి, బాబాపై పూవులను విసిరాడు. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువైన ఘోలప్ స్వామి కూర్చుని ఉన్నారు. అతను ఆశ్చర్యపోయాడు. అది కలా నిజమా అని సందేహపడ్డాడు. తనని తను గిల్లుకుని మళ్ళీ చూశాడు. తాను పూర్తి జాగ్రదావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి అనుకోవడానికి వీలులేదు. అయినా ఏనాడో గతించిన తన గురువు ఇక్కడికి ఎలా వచ్చారు? అతనికి నోటమాట రాలేకపోయింది. చివరికి సందిగ్ధాలు అన్నీ విడిచిపెట్టి మసీదులోకి ప్రవేశించి, తన గురువు పాదాలపై పడి, లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. తక్కిన వారందరూ బాబాకి హారతి పాడుతుండగా, మూలేశాస్త్రి తన గురువుగారి నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. తాను అగ్ర్రకులానికి చెందినవాడిని, పవిత్రుడిని అనే అభిజ్యాతం వదిలిపెట్టి తన గురువు పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేసి, కళ్ళు తుడుచుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి, అతన్ని దక్షిణ అడుగుతూ సాయిబాబా కనిపించారు. బాబావారి ఆనందరూపాన్ని, ఊహకు అందని వారి శక్తిని చూసి మైమరచిపోయాడు, సంతోషం కలిగింది. అతని నేత్రాలు సంతోషపు భాష్పాలతో నిండిపోయాయి. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ యిచ్చాడు. తన సందేహం తీరిందనీ, తనకు గురుదర్శనం అయిందని చెప్పాడు. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను చూసినవారు అందరూ ఆశ్చర్యం పొందరు. 'గేరు తీసుకురండి! కాషాయవస్త్రాలు ధరిస్తా'నని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థాన్ని అప్పుడు గ్రహించారు. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరాలు.

రామభక్తుడైన డాక్టరు

ఒకరోజు మామల్తదారు తన స్నేహితుడైన డాక్టరుతో కలిసి షిరిడీ వచ్చారు. షిరిడీ బయలుదేరడానికి ముందు తన మిత్రునితో ఆ డాక్టరు 'తన ఆరాధ్య దైవం శ్రీరాముడిని, తాను షిరిడీకి వెళ్ళి ఒక మహామ్మదీయుడికి నమస్కరించడానికి మనస్సు అంగీకరించడం లేద'ని చెప్పాడు. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంతపెట్టరని, కలిసి సరదాగా గడపడానికి తనతో రావాలని మామల్తదారు కోరాడు. దానికి ఆ డాక్టరు సమ్మతించాడు. షిరిడీ చేరుకొని, బాబాను చూడటానికి వారు మసీదుకు వెళ్లారు. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించడం చూసి ముందు ఆశ్చర్యపడి తన మనో నిశ్చయాన్ని మార్చుకుని ఒక మహామ్మదీయుడికి ఎలా నమస్కరించావు అని అందరూ అడిగారు. తన ఇష్టదైవం అయిన శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించడంతో వారి పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశానని డాక్టరు బదులు చెప్పాడు. అతడు అలా అని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించారు. ఏమీ తోచక, అతడు 'ఇది స్వప్నమా ఏమిటి? వారు మహమ్మదీయుడు అవడం ఏమిటి? వారు గొప్ప యోగసంపన్నులైన అవతారపురుషులు' అని అనుకున్నాడు. ఆ మరునాడే డాక్టరు ఎదో దీక్ష వహించి ఉపవాసం ఉన్నాడు. బాబా తనను అనుగ్రహించే వరకూ మసీదుకు వెళ్ళనని నిశ్చయించుకుని మసీదుకు వెళ్ళటం మానుకున్నాడు. ఇలా మూడు రోజులు గడిచాయి. నాలుగవ రోజు తన ప్రియ స్నేహితుడైన ఒకడు ఖాందేషు నుండి రావడంతో, వాడితో కలిసి మసీదులో బాబా దర్శనం కోసం తప్పక మసీదుకు వెళ్ళవలసి వచ్చింది. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో 'ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచారా ఏమిటి? ఇలా వచ్చావు?' అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదిలించింది. ఆనాటి రాత్రే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి, అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ తరువాత అతడు తన ఊరికి వెళ్ళినా, ఆ ఆనందానుభూతిని 15 రోజుల వరకు అలాగే వుండిపోయింది. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా పట్ల భక్తి అనేక రెట్లు వృద్ధి చెందింది. పై కథల వలన, ముఖ్యంగా మూలేశాస్త్రి కథ వలన, నేర్చుకున్న నీతి ఏమిటంటే మనం మన గురువులోనే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచుకోవాలి. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెపుతాను. 

పన్నెండవ అధ్యాయం సంపూర్ణం

పదమూడవ అధ్యాయం

Products related to this article

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter

Silver & Gold Plated Curve Shape Bowl 6" Diameter..

$13.00

0 Comments To "Saibaba Satcharitra 12 Adyayam "

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!