Saibaba Satcharitra Chapter 18 & 19

శ్రీసాయిసచ్చరిత్ర

పద్దెనిమిది - పందొమ్మిదవ అధ్యాయాలు

హేమాడ్ పంత్ ను బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారు? సాఠేగారి కథ, దేశ్ ముఖ్ గారి భార్య కథ, సద్విచారాలను ప్రోత్సహించి సాక్షాత్కారానికి దారి చూపించటం, ఉపదేశంలో వైవిద్యం, నిందగురించి బోధ, కష్టానికి కూలి గత రెండు అధ్యాయాలలో బ్రహ్మజ్ఞానం ఆశించే ఒక ధనికుడిని బాబా ఎలా ఆదరించారో హేమాడ్ పంత్ వర్ణించారు. రాబోయే రెండు అధ్యాయాలలో హేమాడ్ పంత్ ను బాబా ఎలా ఆమోదించి ఆశీర్వదించారో, బాబా ఎలా తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షానికి మార్గం చూపిస్తున్నారో, ఆత్మ ఉన్నతి గురించి, పరనిందా వాక్యాల గురించి, ఇతరుల కష్టానికి ఇవ్వవలసిన ప్రతిఫలం గురించి బాబా వారి ప్రబోధాలు ఎలాంటివో వర్ణిస్తాను.

ప్రస్తావనం

సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి, చివరికి వారి లక్ష్యాలను ఆత్మసక్షాత్కారానికి దారి చూపుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయకూడదని కొందరు అంటారు. అలా గురువు బోధించిన దాన్ని వెల్లడి చేస్తే ఆ బోధలు నిష్ప్రయోజనం అవుతాయని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటివారు. వారు తమ అమృతతుల్యాలైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశాలలో కురిపిస్తారు. వాటిని మనం అనుభవించి హృదయానికి తృప్తిగా జీర్ణించుకుని తరువాత నిస్సంకోచంగా ఇతరుల మేలుకోసం కూడా తెలియజేసే విషయాలకు వర్తిస్తుంది. తన స్వప్నంలో కనిపించిన 'రామరక్షా స్తోత్రాన్ని' బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణ ఇక్కడ స్మరించాలి.

ప్రేమగల తల్లి, గుణం యిచ్చే చెడైన ఔషధాలను బిడ్డ మేలుకోసమే బలవంతంగా గొంతులోకి తోసినట్లుగా, ఆధ్యాత్మిక విషయాలను బాబా తన భక్తులకు బోధించేవారు. వారి మార్గం రహస్యమైనది కాదు, అది బహిరంగమైనదే. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయం నెరవేరుతూ ఉండేది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రాలను తెరిపించి ఆత్మయొక్క దైవీక సౌందర్యాలను చూపించి మన కోరికలను నెరవేరుస్తారు. ఇది జరిగిన తరువాత, మన ఇంద్రియ విషయం వాంఛలు నిష్క్రమించి, వివేక వైరాగ్యాల జంట ఫలాలు మన చేతికి అందుతాయి. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తుతుంది. సద్గురువుల సహవాసం చేసి, వారిని సేవించి వారి ప్రేమను పొందితే ఇదంతా మనకు లభిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చే భగవంతుడు మనకు తోడ్పడి, మన కష్టాలను, బాధలను తొలగించి, మనలను సంతోషపెడతారు. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయం వల్లనే జరుగుతుంది. సద్గురువుని భగవంతుడిలా కొలవాలి. కాబట్టి మనం సద్గురువులను వెదకాలి. వారి కథలను వినాలి. వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయాలి. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథని ప్రారంభిస్తాను.

సాఠే 

సాఠే అనే అతను ఒకప్పుడు అత్యంత పలుకుబడి కలిగి ఉండేవాడు. కాలగమనంలో వ్యాపారంలో చాలా నష్టం పొందాడు. అంతేకాకుండా మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరిచాయి. అందుకే అతను విచారగ్రస్తుడు అయ్యాడు, విరక్తి చెందాడు. మనస్సు చెడి చంచలం కావడంతో ఇళ్ళు విడిచి చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాడు. మానవుడు సాధారణంగా భగవంతుడిని గురించి చింతించడు కానీ, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు చుట్టుముట్టినప్పుడు భగవంతుడిని ధ్యానం చేసి విముక్తి పొందడానికి ప్రార్థిస్తాడు. వాడి పాపకర్మలు ముగిసే వేళకు భగవంతుడు వాడికి ఒక యోగీశ్వరుడిని కలుసుకునేలా చేస్తాడు. వారు తగిన సలహా యిచ్చి వాడి క్షేమాన్ని చూస్తారు. సాఠే గారికి కూడా అలాంటి అనుభవం కలిగింది. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చారు. అక్కడ సాయిబాబాను దర్శించుకుని అనేకమంది శాంతి పొందుతూ ఉండేవారు. వారి కోరికలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. సాఠేగారికి ఇది నచ్చింది. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చారు. అక్కడ శాశ్వత బ్రహ్మలా స్వయంప్రకాశుడై, నిర్మలుడు, శుద్ధస్వరూపుడు అయిన సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనస్సు చంచలం తగ్గిపోయి శాంతి కలిగింది. వారి పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించింది. అతను గొప్ప మనోబలం కలవాడు కావడం వల్ల వెంటనే గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టారు. 7 రోజులలో చరిత్ర చదవడం పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతాన్ని చూపించారు. అది ఇలా వుంది.

బాబా గురుచరిత్ర చేతిలో పట్టుకొని దానిలోని విషయాలను ఎదుట కూర్చున్న సాఠేకి బోధిస్తున్నట్లు, అతను దాన్ని శ్రద్ధగా వింటున్నట్లు చూపించారు. సాఠే నిద్రనుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకున్నారు. అమితంగా సంతోషించారు. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోతున్న తనవంటి వారిని లేపి, గురుచరిత్రామృతాన్ని రుచి చూపించడం బాబా యొక్క దయార్థ్ర హృదయమే కదా అనుకున్నాడు. ఆ మరుసటి రోజు ఆ దృశ్యాన్ని కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావం ఏమై ఉంటుందో సాయిబాబాని అడిగి తెలుసుకోమని అన్నారు. ఒక సప్తాహం సరిపోతుందా లేకపోతే ఇంకొక సప్తాహం పారాయణ చేయాలో కనుక్కో అని అన్నారు. కాకాసాహెబు సమయం చూసి బాబాను ఇలా అడిగారు 'ఓ దేవా! ఈ దృశ్యం వలన సాఠేకి ఏమని చెప్పాలని నిశ్చయించావు? అతడు ఊరుకోవాలా లేక యింకొక సప్తాహం పారాయణ చేయాలా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరాలి. అతనికి స్వప్నం అంతర్థానం బోధించాలి. వారిని ఆశీర్వదించ'మని కోరాడు. బాబా ఇలా చెప్పారు 'అతడు గురుచరిత్ర ఇంకొక సప్తాహం పారాయణ చేయాలి ఆ గ్రంథాన్నే జాగ్రత్తగా పఠిస్తే అతడు పావనుడు అవుతాడు. భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధాలనుండి తప్పిస్తారు' అన్నారు.

ఆ సమయంలో హేమాడ్ పంత్ అక్కడ ఉండి బాబా కాళ్ళు వొత్తుతున్నాడు. బాబా పలుకులు విని అతను తన మనస్సులో ఇలా అనుకున్నారు 'సాఠే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితాన్ని పొందాడు! నేను నలభై సంవత్సరాలనుండి పారాయణ చేస్తున్నాను కాని నాకు ఫలితం లేదు కదా! అతడు ఇక్కడ 7 రోజులు మాత్రమే నివశించాడు. మరి నేను 7 సంవత్సరాల నుండి ఉన్నాను. నా ప్రయత్నాలు నిష్ఫలమా ఏమిటి? చాతకపక్షి మేఘం నుండి పడే నీటి బిందువు కోసం కనిపెట్టుకుని ఉన్నట్టు నేను కూడా బాబా తమ దయామృతం నాపై వర్షిస్తారని, వారి బోధనలతో నన్ను ఆశీర్వదిస్తారని కనిపెట్టుకుని ఉన్నాను'. ఈ మనస్సులో మెదిలిన విషయం వెంటనే బాబా గ్రహించేశారు. భక్తుల మనస్సులలో మెదిలిన వెంటనే బాబా గ్రహించేవారు. అంతేకాకుండా, చెడ్డ ఆలోచనలను అణచివేస్తూ, మంచి ఆలోచనలను  ప్రోత్సహిస్తుండేవారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి, శ్యామా దగ్గరికి వెళ్ళి అతని దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకొని, అతనితో కొంతసేపు మాట్లాడిన తరువాత రమ్మని చెప్పారు. బాబా మనస్సులో కారున్యోదయం అయింది. కానీ వారు ఇలా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞను జవదాటగల వారు ఎవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహానికి వెళ్ళాడు. అప్పుడే అతను స్నానం చేసి ధోవతి కట్టుకుంటున్నారు. అతను బయటకు వచ్చి హేమాడ్ పంత్ ని ఇలా అడిగారు 'మధ్యాహ్న హారతి సమయంలో మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీరు మసీదునుండి వస్తున్నట్లు లేదే! మీరు ఎందుకు చికాకుతో చంచలంగా ఉన్నారు? మరి ఒంటరిగా వచ్చారెందుకు? కొంతసేపు కూర్చుని విశ్రాంతి పొందండి. నా పూజను ముగించి వస్తాను. ఈలోగా తాంబూలం వేసుకోండి. తరువాత ఆనందంగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకుందాం!’ ఇలా అంటూ అతడు లోపలికి వెళ్ళిపోయారు. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చున్నారు. కిటికీలో ఏకనాథ భాగవతం అనే ప్రసిద్ధ మరాఠీ గ్రంథం ఉంది. ఇది భాగవతంలోని  ఏకాదశస్కంధానికి ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫారసు చేయడంతో బాపూసాహెబు దీక్షిత్ (శ్రీకృష్ణుడికి, అర్జునుడికి జరిగిన సంభాషణ రూపమైన) భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థదీపిక (జ్ఞానేశ్వరి), [శ్రీకృష్ణుడికి అతని సేవకుడైన ఉద్దీవుడికి జరిగిన సంభాషణా రూపం] ఏకనాథ భాగవతం, మరియు భావార్థ రామాయణం నిత్యం షిరిడీలో చదువుతుండేవారు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జబాబు ఇచ్చి, అటుపై వారిని ఆ గ్రంథాల పారాయణాన్ని వినమని పంపుతూ ఉండేవాడు. ఈ గ్రంథాలే భాగవత ధర్మంలోని ముఖ్యగ్రంథాలు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగాలకు వెళ్ళి, ఆ గ్రంథాలు వింటున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు లభిస్తుండేవి. హేమాడ్ పంత్ కూడా నిత్యం ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేసేవాడు.

హేమాడ్ పంత్ ఆ రోజు తాను నిత్యం చదివే గ్రంథభాగాన్ని పూర్తి చేయకుండానే కొందరు భక్తులు కలిసి మసీదుకు వెళ్ళారు. శ్యామా ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతాన్ని తీస్తుండగా తాను ఈ రోజు పూర్తిచేయని భాగం దగ్గరే పుస్తకం తెరుచుకుంది. తన నిత్యపరాయణం పూర్తి చేయడానికే కాబోలు బాబా తనని ఇక్కడికి పంపించారు అని హేమాడ్ పంత్ అనుకున్నారు. వెంటనే తన నిత్యపారయణం పూర్తి చేశారు. తరువాత శ్యామా తన పూజను ముగించి బయటికి వచ్చారు. వారిరువురికీ ఈ క్రింది సంభాషణ జరిగింది.

హేమాడ్ పంత్ : నేను బాబా దగ్గరనుండి ఒక కబురు తీసుకొని వచ్చాను. బాబా నీ దగ్గరనుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. అంతేకాదు, కొద్దిసేపు నీతో మాట్లాడిన తరువాత మసీదుకు రమ్మని చెప్పారు.

శ్యామా : (ఆశ్చర్యంతో) నా దగ్గర డబ్బులేదు. నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకానికి బదులుగా బాబాకు సమర్పించు.

హేమాడ్ పంత్ : సరే నీ నమస్కారం ఆమోదింపబడుతుంది. మనం కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకుందాం. మన పాపాలను నశింప చేయగలిగిన బాబా లీలలను, కథలను చెప్పు.

శ్యామా : అయితే కొంతసేపు కూర్చోండి. ఈ దేవుని (బాబా)  లీలలు అత్యంత ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలుసును. నేను పల్లెటూరి వాడిని. మరి నీవు చదువుకున్న పట్నపువాడివి. నీవు ఇక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలలను చూసే ఉంటావు. వాటిని నీ ముందు ఎలా వర్ణించగలను? సరే ఈ తమలపాకులు వక్కలు, సున్నం తీసుకుని తాంబూలం వేసుకో. నేను లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని వస్తాను.

కొంత సేపటి తరువాత శ్యామా బయటికి వచ్చి హేమాడ్ పంత్ తో మాట్లాడుతూ కూర్చున్నాడు. శ్యామా ఇలా అన్నాడు : ఈ దేవుడి (బాబా)లీల కనుక్కోవడం కానిపని. వారి లీలలకు అంతులేదు. వాటిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదిస్తున్నట్లు కనబడినా వారు వాటిని అందుకున్నట్లు కనిపించరు. మావంటి జానపదులకు ఏమి తెలుస్తుంది? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? మీవంటి పండితులను నావంటి పామరుని దగ్గరికి ఎలా పంపుతున్నారు? వారి మార్గాలు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావు అని చెప్పగలను.’

ఈ ఉపోద్ఘాతంతో శ్యామా ఇలా అన్నాడు 'నాకొక కథ జ్ఞాపకానికి వస్తుంది. అది నీకు చెపుతాను. నాకది స్వయంగా తెలుసు. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో, పట్టుదలతో ఉంటాడో, బాబా అంత త్వరగా వారికి సహాయపడతాడు. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన తరువాత వారికి ఉపదేశం ఇస్తారు.’ (ఇక్కడ ఉపదేశం అంటే నిర్ధేశం)

ఉపదేశం అనే మాట విన్న వెంటనే హేమాడ్ పంత్ మనస్సులో ఒక స్మృతి తళుక్కుమంది. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణం జ్ఞాపకం వచ్చింది. తన మనస్సుకు శాంతి కలిగించే నిమిత్తం బాబా తనని ఇక్కడికి పంపించారని అనుకున్నారు. అయినప్పటికీ ఈ భావాన్ని అణచుకుని, శ్యామా చెప్పే కథ వినడానికి సిద్ధపడ్డాడు. ఆ కథలు అన్నీ బాబాకు తన భక్తుల పట్ల ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉన్నాయో తెలుపుతాయి. వాటిని వినగా హేమాడ్ పంత్ కు ఒక విధమైన సంతోషం కలిగింది. శ్యామా ఈ క్రింది కథను చెప్పసాగాడు.

శ్రీమతి రాధాబాయి దేశ్ ముఖ్ :

రాధాబాయి అనే ఒక ముసలమ్మ ఉండేది. ఆమె ఖశాబా దేశ్ ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామప్రజలతో కలిసి షిరిడీకి వచ్చింది. బాబాను దర్శించుకుని అమితంగా తృప్తి చెందింది. ఆమె బాబాను గాఢంగా ప్రేమించింది. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందాలని మనోనిశ్చయం చేసుకుంది. ఆమెకి ఇంకా ఏమీ తెలియకపోయేది, బాబా  ఆమె సంకల్పాన్ని ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయకపోతే ఉపవాసం ఉండి చస్తానని మనోనిశ్చయం చేసుకుంది. ఆమె తన బసలోనే ఉండి భోజనం, నీళ్ళు మానేసింది. అలా మూడు రోజులు గడిచాయి. ఆమె పట్టుదలకు నేను (శ్యామా) భయపడి ఆమె తరపున బాబాతో ఇలా అన్నాను 'దేవా! మీరేమి ప్రారంభించారు? నీవు అనేకమందిని ఇక్కడికి ఈడుస్తావు. ఆ ముసలమ్మ నీకు తెలిసే ఉంటుంది. ఆమె అమితమైన పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉంది. ఆమె చచ్చేవరకు ఉపవాసం ఉండాలని నిశ్చయించుకుంది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చేవరకు ఆమె తన నిరాహారదీక్షను మానదు. ఆమెకి ఏమైనా హాని జరిగితే ప్రజలు నిన్నే నిందిస్తారు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవడంతో ఆమె చచ్చిందని లోకులు అంటారు. కాబట్టి ఆమెను కరుణించి, ఆశీర్వదించు, ఆమెకు తగిన దారి చూపించు!’ ఆమె  మనోనిశ్చయాన్ని చూసి, బాబా ఆమెను పిలిపించి ఈ క్రింద విధంగా బోధించారు.

'ఓ తల్లీ! అనవసరమైన యాతనకి ఎందుకు పాల్పడి చావును కోరుకుంటున్నావు? నీవు నిజంగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పేది పూర్తిగా విను! నీకు నా వృత్తాంతాన్ని చెపుతాను. నీవు దాన్ని బాబా కథ వింటే నీకది మేలు చేస్తుంది. నాకొక గురువు ఉండేవాడు. వారు గొప్ప యోగీశ్వరులు, అత్యంత దయార్థ్ర హృదయులు. వారికి చాలా శుశ్రూష చేశాను. కానీ నా చెవిలో వారు ఏ మంత్రమూ ఊదలేదు. నాకు వరిని వదిలివెళ్ళే ఆలోచనే లేకేపోయేది నేను వారితోనే ఉండటానికి, వారి సేవ చేయడానికి, వారి వద్ద కొన్ని ఉపదేశాలను గ్రహించడానికి నిశ్చయించుకున్నాను. కాని వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించారు, నా నుండి రెండు పైసలు దక్షిణ అడిగారు. నేను దాన్ని వెంటనే వారికి సమర్పించాను. మీ గురువుగారు పూర్ణకాములు అయితే వారు మిమ్మల్ని దక్షిణ అడగటం ఎందుకు? వారు నిష్కాములని ఎలా అనిపించుకుంటారు? అని నీవు అడగవచ్చు. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనంతో వారు చేసేది ఏముంది? వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యాలతో కూడిన ఓరిమి! నేను ఈ రెండింటినీ వారికి అర్పించాను. వారు ప్రసన్నులు అయ్యారు.

నా గురువును అలా 12 సంవత్సరాలు సేవించను. వారే నన్ను పెంచి పోషించారు. భోజనానికి కాని వస్త్రాలకు కాని నాకు లోటు లేకుండా ఉండేది. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చు. ఆ ప్రేమను నేను ఎలా వర్ణించగలను? వారు నన్ను అధికంగా ప్రేమించేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో ఉన్న వారిని తదేకంగా చూస్తుండేవాడిని. మేమిద్దరం ఆనందంలో మునిగిపోయే వాళ్ళం. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిలిపాను. వారిని చూడకపోతే నాకు శాంతి లేకపోయేది. వారి ధ్యానం వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకపోయేది. ఇదే వారు అడిగిన దక్షిణలో ఒక పైసా.

‘సబూరి (సంతోష స్థైర్యాలతో కూడుకున్న ఓరిమి) అనేది రెండవ పైస. నేను అత్యంత సంతోషంతో చాలాకాలం కనిపెట్టుకుని వారి సేవ చేశాను. ఈ ప్రపంచమనే సాగరాన్ని 'సబూరి' అనే ఓడ నిన్ను సురక్షితంగా దాటిస్తుంది. సబూరి అనేది అత్యంత ఉత్తమ లక్షణం. అది పాపాలు అన్నింటినీ తొలగిస్తుంది, కష్టాలను పారద్రోలుతుంది. అనేక విధాల అవాంతరాలను తొలగించి, భయాన్ని పారద్రోలుతుంది. చివరికి జయాన్ని కలిగిస్తుంది. సబూరి అనేది సుగుణాలకు గని, మంచి ఆలోచనకు తోడువంటిది. నిష్ఠ, సబూరి అనేవి అన్యోన్యమైన అక్కాచెల్లెళ్ళ వంటిది.

నా గురువు నానుండి మిగిలినవి ఏవీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షించక సర్వకాల సర్వావస్థలలో కాపాడుతుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాణ్ణి. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉన్నా, వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టితోనే నన్ను కాపాడుతుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు, నన్ను కూడా మా గురువు తమ దృష్టితో పోషిస్తుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉంటుంది. బిడ్డ తాబేలు రెండవ ఒడ్డుపై ఉంటుంది. తల్లి తాబేలు, పిల్ల తాబేలుకు ఆహారం పెట్టడం కానీ, పాలు ఇవ్వడం కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిస్తుంది. పిల్లలే దిగి పెద్ద అవుతాయి. అలాగే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి, నన్ను ప్రేమతో కాపాడారు. ఓ తల్లీ! నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రాన్ని ఎలా ఊదగలను? గురువు యొక్క ప్రేమమయిన తాబేలు చూపే మనకు సంతోషాన్ని ఇస్తుందని జ్ఞాపకం ఉంచుకో. మంత్రంగాని, ఉపదేశం కానీ ఎవ్వరి దగ్గర నుండి కాని పొందడానికి ప్రయత్నించకు. నీ ఆలోచనలు, నీవు చేసే పనులు నాకోసమే వినియోగించు. నీవు తప్పకుండా పరమార్థాన్ని పొందుతావు, నావైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీవైపు అలాగే చూస్తాను, ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెపుతాను నిజం తప్ప మరేమీ మాట్లాడను. నీ సాధనాలు కానీ ఆరు శాస్త్రాలలో ప్రావీణ్యం కాని అవసరం లేదు. నీ గురువులో ప్రేమ విశ్వాసాలు ఉంచు. గురువే సర్వం చేసేవాడని, కర్త అనీ పూర్తిగా నమ్ము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గోప్పదనాన్ని గ్రహిస్తారో, ఎవరైతే గురువుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని తలుస్తారో వారే ధన్యులు!’

ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించారు. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసాన్ని విడిచిపెట్టింది.

ఈ కథని జాగ్రత్తగానూ, శ్రద్ధగానూ విని దాని ప్రాముఖ్యాన్ని, సందర్భాన్ని గుర్తించి, హేమాడ్ పంత్ ఆశ్చర్యపోయారు. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతని ఆపాదమస్తకం పులకించింది. సంతోషంతో ఉప్పొంగింది, గొంతు తడారిపోయింది. ఒక్క మాటైనా మాట్లాడడానికి చేతకాలేదు. శ్యామా అతన్ని ఈ స్థితిలో చూసి 'ఏం జరిగింది? ఎందుకు ఊరుకున్నారు? అలాంటి బాబా లీలలు నీకెన్ని వర్ణించాలి?’ అని అడిగాడు.

అదే సమయంలో మసీదులో గంట మ్రోగింది. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభం అయిందని గ్రహించారు. కాబట్టి శ్యామా, హేమాడ్ పంత్ ఇద్దరూ మసీదుకు త్వరగా చేరుకున్నారు. బాపూసాహెబు జోగ్ అప్పుడే హారతి ప్రారంభించారు. స్త్రీలు మసీదులో నిండిపోయారు. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిపోయారు. అందరూ భాజాభజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుతున్నారు. బాబాకు కుడివైపు శ్యామా, ముందు హేమడ్ పంత్ కూర్చున్నారు. వారిని చూసి బాబా హేమాడ్ పంత్ ను శ్యామా ఇచ్చిన దక్షిణ ఇవ్వమన్నారు. శ్యామా రూపాయలకు బదులు నమస్కారాలు ఇచ్చారు అని  శ్యామా ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి అడగవచ్చు అన్నారు. బాబా ఇలా చెప్పారు 'సరే మీరు ఇద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారా? అలాగయితే మీరేమి మాట్లాడుకున్నారో చెప్పు.’ గంటల చప్పుడూ, మద్దెల శబ్దమూ, పాటల ధ్వనిని లెక్కచేయకుండా హేమాడ్ పంత్ బాబాకు జరిగినది అంతా చెప్పడానికి ఆత్రపడ్డాడు. తాము ముచ్చటించుకున్నది అంతా తనకు చాలా ఆనందం కలగజేసిందనీ, ముఖ్యంగా ముసలమ్మ కథ అత్యంత ఆశ్చర్యం కలగజేసిందనీ, దాన్ని విని బాబా లీలలు ఆగోచారాలని తెలుసుకున్నాననీ ఆ కథ రూపంతో తనను బాబా ఆశీర్వదించారని హేమాడ్ పంత్ చెప్పారు. అప్పుడు బాబా 'కథ చాలా అద్భుతమైనది. నీవు ఎలా ఆనందించావు? నాకా విషయామై వివరాలన్నీ చెప్పు' అన్నారు. అప్పుడు హేమాడ్ పంత్ తాను ఇంతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనసులో శాశ్వత ప్రభావం కలిగించిందని చెప్పారు. ఇది విని బాబా ఇంకా ఎక్కువగా సంతోషించారు. ‘ఆ కథ నీకు నచ్చిందా? దాని ప్రాముఖ్యాన్ని నీవు గుర్తించావా?’ అని  బాబా హేమాడ్ పంత్ ని అడిగారు. ‘అవును బాబా నా మనస్సు చంచలం నిష్క్రమించింది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది. సత్యమార్గాన్ని కనుక్కోగలిగాను' అని హేమాడ్ పాన్ బదులు ఇచ్చాడు.

బాబా ఇలా చెప్పారు 'నా పధ్ధతి అత్యంత విశిష్టమైనది! ఈ ఒక్క కథను జ్ఞాపకం ఉంచుకో. అది ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం. దాన్ని అలవరచుకుంటే వృత్తులు అన్నీ శాంతిస్తాయి, కోరికలు అన్నీ విడచి నిష్కామివై, నీవు సమస్త జీవరాశిలో ఉన్న భగవంతుడిని ధ్యానించు. మనస్సు ఎకాగ్రమైతే లక్ష్యం నెరవేరుతుంది. సదా నా నిరాకార స్వభావాన్ని ధ్యానించు! అదే జ్ఞానస్వరూపం, చైతన్యం, ఆనందం. మీరిది చేయలేకపోతే రాత్రింబవళ్ళు మీరు చేస్తున్న నా ఈ ఉపకారాన్ని ధ్యానించండి. అలా కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతం అవుతాయి. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అనే మూడింటికి ఉన్న భేదం పోయి ధ్యానించే వాడు చైతన్యంతో ఐక్యమై, బ్రహ్మంతో భిన్నమవుతుంది. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్ల యింకొక ఒడ్డున ఉంటుంది. తల్లి దానికి పాలివ్వడం కానీ, పొదువుకోవడం కానీ చేయదు. దాని చూపు మత్రమే వాటికి జీవశక్తిని ఇస్తున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయకుండా తల్లిని జ్ఞాపకం ఉంచుకుంటుంది. తల్లి తాబేలు చూపు చిన్నదానికి అమృతధారలా పనిచేస్తుంది. అదే వాటి బ్రతుకుకి సంతోషానికి ఆధారం. గురువుకు, శిష్యుడికి గల సంబంధం ఇలాంటిదే'. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి, హారతి పూర్తి అయ్యింది. అందరూ 'శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై' అని జయజయధ్వానాలు చేశారు. ఓ ప్రియ పాఠకులరా! ఈ సమయంలో మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి, మనం కూడా ఆ జయజయధ్వనులలో పాల్గొందాము.

హారతి పూర్తి అవగానే ప్రసాదం పంచి పెట్టారు. బాబాకు నమస్కరించి బాపూసాహెబు జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టారు. బాబా అ ప్రసాదం మొత్తం హేమాడ్ పంత్ చేతిలో పెట్టి ఇలా అన్నారు 'ఈ కథను నీవు మనసుకు పట్టించుకుని జ్ఞాపకం ఉంచుకుంటే, నీ స్థితి కలకండలా తియ్యగా ఉంటుంది. నీ కోరికలు అన్నీ నెరవేరతాయి. నీవు సుఖంగా ఉంటావు' హేమాడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి 'ఇలా ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించు, ఆశీర్వదించు, కాపాడు!’ అని ప్రార్థించాడు. అందుకు బాబా ఇలా జవాబు ఇచ్చారు 'ఈ కథను విను. దీన్ని మననం చేసుకో. నిధి ధ్యాసనం చేయి అలాగయితే నీవు భగవంతుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుని ధ్యానిస్తావు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షం అవుతాడు.’

ఓ ప్రియమైన చదువుతున్న వారికి! అప్పుడు హేమాడ్ పంత్ కు కలకండ ప్రసాదం దొరికింది. ఇప్పుడు మనం ఈ కథ అనే కలకండ ప్రసాదం పొందుదాం. దాన్ని హృదయపూర్వకంగా సేవించి, ధ్యానించి, మనస్సులో నిలుపుకుందాం. ఇలా బాబా కృపతో బలంగానూ, సంతోషంగాను ఉందాం. తథాస్తు!

 

19వ ధ్యాయం చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయాలను చెప్పారు. అవి ఈ క్రింద పొందు పరిచాము.

మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం

ఈ క్రింద చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యాలు. వాటిని మనస్సులో ఉంచుకుని అలాగే చేస్తే అవి మనకు మేలు చేస్తాయి. ఏదైనా సంబంధం వుండనిదే ఒకరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళరు. ఎవరైనా అలాంటి జంతువుగాని నీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా దాన్ని తరిమివేయకు. దాన్ని సాదరంగా చూడు, దాహం కలవారికి నీళ్ళు ఇస్తే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినట్లయితే, బట్టలు లేనివారికి బట్టలు ఇచ్చినట్లయితే, నీ ఇంటి వసారాలో వేరేవాళ్ళు కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించినట్లయితే నిశ్చయంగా భగవంతుడు ఎక్కువగా ప్రీతి చెందుతాడు. ఎవరైనా ధనసహాయం కోరి నీ దగ్గరికి వచ్చినట్లయితే, నీకు ఇవ్వడం ఇష్టం లేకపోయినా నీవు ఇవ్వాల్సిన అవసరంలేదు. కానీ వాడిపై కుక్కలా మొరగొద్దు. ఇతరులు నిన్ను ఎంతగా నిందించినా, నీవు కఠినంగా జవాబు ఇవ్వకు. అలాంటి వాణ్ణి నీవు ఎప్పుడూ ఓర్చుకుంటే నిశ్చయంగా నీకు సంతోషం కలుగుతుంది. ప్రపంచం తలక్రిందులైనప్పటికీ నీవు చలించకు, నీవు ఉన్న చోటనే స్థైర్యంగా నిలబడి, నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకాన్ని చూస్తూ ఉండు. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించు. అప్పుడు మనిద్దరం కలిసే మార్గం ఏర్పడుతుంది. నాకు నీకు భేదం ఉన్నది అదే భక్తుడిని గురువుకు దూరంగా ఉంచుతుంది. దాన్ని నశింప చేయనిదే మనకు ఐక్యత కలగదు. ‘అల్లా మాలిక్!’ భగవంతుడే సర్వాధికారి. యితరులు ఎవ్వరూ మనల్ని కాపాడేవారు కాదు. భగవంతుడి మార్గం అసమాన్యం, అత్యంత విలువైనది, కనుక్కోవడం వీలుకానిది. వారి ఇష్టానుసారమే మనం నడుస్తాము. మన కోరికలను వారు నెరవేరుస్తారు. మనకు దారి చూపిస్తారు. ఋణానుబంధంతో మనం అందరమూ కలిశాము. ఒకరికొకరు తోడ్పడి, ప్రేమించి సుఖంగాను, సంతోషంగానూ ఉందుముగాక! ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందుతారో వారు అమరులై సుఖంగా ఉండెదరు. తక్కినవారు అందరూ పేరుకే ఊపిరి సలిపే వరకు మాత్రమే బ్రతుకుతారు.

సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట

సాయిబాబా సద్విచారాలను ఎలా ప్రోత్సహిస్తూ ఉండేవారో తెలుసుకోవడం అత్యత ఆసక్తికరంగా ఉంటుంది. భక్తిప్రేమలతో వారికి సర్వస్వశరణాగతి చేసినట్లయితే వారు నీకు ఎలా పదేపదే సహాయపడతారో తెలుస్తుంది. పక్కపై నుండి లేవగానే నీకు ఏదయినా మంచి ఆలోచన కలిగితే, దాన్ని తరువాత పగలు అంతా వృద్ధి చేసినట్లయితే నీ మేథాశక్తి వృద్ధి పొందుతుంది. నీ మనస్సు శాంతి పొందుతుంది. హేమాడ్ పంత్ దీని కోసం ప్రయత్నించదలిచారు. ఒక బుధవారం రాత్రి పడుకునేటప్పుడు ముందు  ఇలా అనుకున్నారు. రేపు గురువారం, శుభదినం. షిరిడీ పవిత్రమైన స్థలం కాబట్టి రేపటి రోజు అంతా రామనామ స్మరణతోనే కాలం గడుపుతాను అని నిశ్చయించుకుని పడుకున్నారు. ఆ మరుసటి రోజు లేవగానే, రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞాపకానికి వచ్చింది. అతడు అమితంగా సంతోషించాడు. కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత బాబాను చూడడానికి పువ్వులు తీసుకుని వెళ్ళారు. దీక్షిత్ వాడా విడిచి బూటీవాడా దాటుతుండగా ఒక చక్కని పాట వినబడింది. ఔరంగాబాదు నుంచి వచ్చిన ఒకతను మసీదులో బాబా ముందు పాడుతున్నాడు. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన 'గురుకృపాంజన పాయో మీరే భాయి' అనేది. గురువు కృప అనే అంజనం లభించింది. దాని మూలంగా నా కళ్ళు తెరవబడ్డాయనీ, దాంతో తాను శ్రీరాముని లోపల, బయట నిద్రావస్థలోను, జాగృతావస్థలోను, స్వపావస్థలోను అన్ని చోట్లా చూశానని చెప్పే పాట అది. అనేక పాటలు ఉండగా బాబా భక్తుడైన ఔరంగాబాదు నివాసి ఈ పాట ఎలా పాడాడు? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంత్ ఆరోజు అంతా రామనామస్మరణతో కాలం గడపాలని తలచినవాడు కాబట్టి అతని మనోనిశ్చయంలో దృఢపరచడానికి బాబా ఈ పాటను పాడించి ఉంటారు.

రామ నామ స్మరణ ఫలితం గురించి మహాత్ములందరిది ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టాలనుండి కాపాడుతుంది.

ఉపదేశంలో వైవిధ్యము - నిందగూర్చి బోధ

శ్రీసాయి బోధనకు ప్రత్యేక స్థలం కాని, ప్రత్యేక సమయం కాని అక్కరలేదు. సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధం నిరంతరమూ జరుగుతుండేది. ఒకరోజు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గురించి పరోక్షంగా ఇతరుల ముందు నిందిస్తూ ఉన్నాడు. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎంచుతున్నాడు. అత్యంత హీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిపోయారు. అనవసరంగా ఇతరులను నిందించడంతో అసూయ, దురభిప్రాయం మొదలైనవి కలుగుతాయి. యోగులు నిందలను ఇంకొక విధంగా భావిస్తారు. మలినం పోగొట్టు కోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. సబ్బుతో మాలిన్యాన్ని కడగవచ్చు, పరులను నిందించువాడి మార్గం వేరు. ఇతరుల మలినాలను వాడు నాలుకతో శుభ్రపరుస్తాడు. ఒక విధంగా వాడు నిందించేవాడికి సేవ చేస్తున్నాడు. ఎలాగంటే, వాడి మాలిన్యాన్ని వీడు తన నాలుకతో శుభ్రపరుస్తున్నాడు కాబట్టి తిట్టబడినవాడు, తిట్టినవాడికి కృతఙ్ఞతలు తెలుపుకోవాలి! అలా పరనిందకు పాల్పడేవాడిని బాబా సరిదిద్దిన పధ్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధాన్ని బాబా సర్వజ్ఞుడు కావడంతో గ్రహించారు. మిట్ట మధ్యాహ్నం బాబా లెండితోటకు వెళ్ళేటప్పుడు వాడు బాబాను దర్శించుకున్నాడు. బాబా వాడికి ఒక పందిని చూపించి ఇలా అన్నారు 'చూడు! ఈ పంది అమేధ్యం ఎంత రుచిగా తింటుందో! నీ స్వభావం కూడా అలాంటిదే! ఎంత ఆనందంగా నీ సాటి సోదరుడిని తిడుతున్నావు. ఎంతో పుణ్యం చేయగా నీకీ మానవజన్మ లభించింది. ఇలా చేసినట్లయితే షిరిడీ దర్శనం నీకు తోడ్పడుతుందా?’ భక్తుడు నీతిని గ్రహించి వెంటనే వెళ్ళిపోయాడు.

ఈ విధంగా బాబా సమయం వచ్చినప్పుడల్లా ఉపదేశిస్తూ ఉండేవాడు. ఈ ఉపదేశాలను మనస్సులో ఉంచుకొని పాటించినట్లయితే ఆత్మసాక్షాత్కారం దూరం కాదు. ఒక లోకోక్తి ఉంది 'నా దేవుడుంటే నాకు మంచంపైన కూడా బువ్వ పెడతాడు' అది భోజనం, వస్త్రాలను గురించి చెప్పింది. ఎవరైనా దీని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరుకున్నట్లయితే చెడిపోతారు. ఆత్మసాక్షాత్కారం కోసం సాధ్యమైనంత పాటుపడాలి. ఎంత కృషి చేస్తే అంత మేలు. బాబా తాను సర్వంతర్యామిని అని చెప్పేవ&l

0 Comments To "Saibaba Satcharitra Chapter 18 & 19"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!