Saibaba Saccharitra 2 Adhyaayam

శ్రీసాయిసచ్చరిత్ర

రెండవ అధ్యాయం

గ్రంథ రచనకు ముఖ్యకారణం

మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఆ పిండిని ఊరిబయట చల్లి కలరా వ్యాధిని తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించాను. ఇదే కాక, శ్రీసాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించాను. ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథాన్ని వ్రాయడానికి పురికొల్పింది. అదేగాక బాబాగారి వింత లీలలు, చర్యలు మనస్సుకు ఆనందం కలుగజేస్తాయి. అవి భక్తులకు భోధనలుగా ఉపయోగపడతాయి. చివరికి పాపాలను పోగొడతాయి కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితాన్ని, వారి బోధనలను వ్రాయటం మొదలుపెట్టాను. యోగీశ్వరుని జీవితచరిత్ర తర్కము, న్యాయము కాదు. అది మనకు సత్యాన్ని, ఆధ్యాత్మికమైన మార్గాన్ని చూపెడతాయి.

గ్రంథ రచనకు పూనుకోవడానికి అసమర్థత - బాబా అభయం

శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథ రచనకు తగిన సమర్థత కలవాడిని కానని హేమాడ్ పంత్ భయపడ్డారు. హేమాడ్ పంత్ ఇలా అనుకున్నాడు 'నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవితచరిత్రయే నాకు తెలియదు, నా మనస్సే నాకు కనిపించడం లేదు. ఈ స్థితిలో ఒక యోగీశ్వరుడి చరిత్రను నేను ఎలా రాయగలను? అవతార పురుషుల లక్షణాలు ఎలా వర్ణించగలను? వేదాలే వారిని పొగడలేవు. తాను యోగియైనా గానీ యోగి యొక్క జీవితాన్ని గ్రహింపలేడు. అలాంటి వారి మహిమలను నేను ఎలా కీర్తించగలను? సప్తసముద్రముల లోతును కొలవవచ్చు, ఆకాశాన్ని గుడ్డలో వేసి మూయవచ్చు. కానీ యోగీశ్వరుడి చరిత్ర వ్రాయటం చాలా కష్టం. ఇది గొప్ప సాహసకృత్యం అని కూడా నాకు తెలుసు అందుకని నలుగురిలో నవ్వులపాలు అవుతానేమో'నని భయపడి శ్రీసాయీశ్వరుని అనుగ్రహం కోసం ప్రార్థించాడు. మహారాష్ట్ర, దేశంలోని ప్రథమ కవి, యోగీశ్వరుడు అయిన జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర రాసినవారిని భగవంతుడు ప్రేమిస్తాడని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను రాయడానికి కుతూహల పడతారో వారి కోరికలు నెరవేరేలా, వారి గ్రంథాలు కొనసాగేలా చేయడానికి యోగులు అనేక మార్గాలు అవలంభిస్తారు. అలాంటి పనులకు యోగులే ప్రేరేపిస్తారు. దానిని నెరవేర్చడానికి భక్తుని కారణమాత్రునిగా ఉంచి వారి వారి కార్యాలను వారే కొనసాగించుకుంటారు. 1700 శక సంవత్సరంలో మహీపతి అనే పండితుడు యోగీశ్వరుల చరిత్రలను రాయాలని కాంక్షించారు. యోగులు అతనిని ప్రోత్సహించి ఆ కార్యాన్ని కొనసాగించారు. అలాగే 1800 శక సంవత్సరంలో దాసగుణు రాసినవి భక్తలీలామృతం, సంతకథామృతము మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీటిలో ఉన్నాయి. భక్తలీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాలలోను, సంతకథామృతంలోని 57వ అధ్యాయంలోను సాయిబాబా జీవితచరిత్ర, వారి బోధనలను చక్కగా రాశారు. ఇవి సాయిలీలా మాసపత్రిక, సంపుటము 17, సంచికలు 11, 12 లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యాయాలు కూడా భక్తులు చదవాలి. శ్రీసాయిబాబా అద్భుతలీలలు బాంద్రా నివాసి అయిన శ్రీమతి సావిత్రీబాయి రఘునాథ్ టెండూల్కర్ చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడ్డాయి. దాసగుణు మహారాజుగారు కూడా శ్రీసాయి పాటలు మధురంగా రాశారు. గుజరాతీ భాషలో అమీదాస్ భవాని మెహతా అనే భక్తుడు శ్రీసాయి కథలను ముద్రించారు. సాయినాథ ప్రభ అనే మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థవారు ప్రచురించారు. ఇన్ని గ్రంథములు ఉండగా ప్రస్తుత సచ్చరిత్ర రాయడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. దీనికి జవాబు చాలా తేలిక!

సాయిబాబా జీవితచరిత్ర సముద్రంలా విశాలమైనది. లోతైనది. అందరూ దీనిలో మునిగి భక్తి జ్ఞానమణులను వెలికి తీసి కావలసినవారికి పంచి పెట్టవచ్చు. శ్రీసాయిబాబా కథలను నీతిబోధకంగా, లీలలు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. అవి వికలమైన మనస్సు వారికి, విచారగ్రస్తులకు శాంతి చేకూర్చి ఆనందం కలగజేస్తాయి. ఇహపరాలకు కావలసిన జ్ఞానాన్ని, బుద్ధిని ఇస్తాయి. వేదాలలాగా, జనరంజకంగా ఉపదేశాలైన బాబా ప్రభోదాలు విని, వాటిని మననం చేస్తే భక్తులు కోరినవి, అంటే బ్రహ్మైక్యయోగ్యం, అష్టాంగాయోగ ప్రావీణ్యం, ధ్యానానందం పొందుతారు. అందుకే బాబా లీలలను పుస్తకరూపంలో రాయాలని నిశ్చయించుకున్నాను. బాబాను సమాధి ముందు చూడని భక్తులకు ఈ లీలలు చాలా ఆనందాన్ని కలగజేస్తాయి. అందుకే బాబాగారి ఆత్మా సాక్షాత్కార ఫలితాలైన పలుకులు, బోధలు సమకూర్చుకోవడానికి పూనుకున్నాను. సాయిబాబాయే ఈ కార్యానికి నన్ను ప్రోత్సహించారు. నా అహంకారాన్ని ఆయన పాదాలపై ఉంచి శరణు కోరుకున్నాను. కాబట్టి నా మార్గం నవ్యమైనవని, బాబా ఇహపర సౌఖ్యాలు తప్పక దయచేస్తారని నమ్మాను. నా అంతట నేను ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకపోయాను. మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామా అనే వారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరపున బాబాను ప్రార్థించాలని కోరుకున్నాను. నా తరపున వారు బాబాతో ఇలా చెప్పారు 'ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్ర రాయాలని ఆకాంక్షిస్తున్నాడు. నేను భిక్షాటన చేస్తూ జీవించే ఫకీరును, నా జీవితచరిత్ర రాయవలసిన అవసరం లేదని అనకండి! మీరు వొప్పుకుని సహాయపడితే వారు రాస్తారు. లేదా మీ కృపే దాన్ని సిద్ధింపచేస్తుంది. మీ యొక్క అనుమతి, ఆశీర్వాదం లేనిదే ఏదీ జయప్రదంగా చేయలేము'. అది విన్న వెంటనే శ్రీసాయిబాబా మనస్సు కరిగి, నాకు ఊదీ ప్రసాదాన్ని పెట్టి ఆశీర్వదించి శ్యామాతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు 'కథలను, అనుభవాలను పోగుచేసుకోమను. అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా రాయమను నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడే. నా జీవితచరిత్ర నేనే రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చాలి. వాడు తన అహంకారాన్ని విడిచిపెట్టాలి. దాన్ని నా పాదాలపై పెట్టాలి. ఎవరైతే వారి జీవితంలో ఇలా చేస్తారో వారికి నేను అధికంగా సహాయపడతాను. నా జీవిత చర్యల కోసమే కాదు, సాధ్యమయినంత వరకూ వారి గృహకృత్యాలలో కూడా తోడ్పడతాను. వాడి అహంకారం పూర్తిగా పడిపోయిన తరువాత అది మచ్చుక కూడా లేనప్పుడు నేను వాడి మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే రాసుకుంటాను. నా కథలు, బోధనలు విన్న భక్తులకు భక్తివిశ్వాసాలు చేకూరుతాయి. వారు ఆత్మాసాక్ష్యాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతారు. నీకు తోచిన దాన్నే నీవు నిర్థారణ చేయడానికి ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయడానికి ప్రయత్నించకు. ఏ విషయంపై అయినా కీడు, మేలు ఎంచుకోవడంలో వివాదం కూడదు' వివాదం అనగానే నన్ను హేమడ్ పంత్ అని పిలవడానికి కారణం ఏమో, మీకు చెప్తానని వాగ్దానం చేసిన మాట జ్ఞాపకానికి వచ్చింది. ఇప్పుడు దానినే మీకు చెప్పబోతున్నాను. కాకా సాహెబు దీక్షిత్, నానాసాహెబు ఛాందొర్కర్ లతో నేను ఎక్కువగా స్నేహంతో ఉన్నాను . వారు నన్ను షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేయమని బలవంతం చేశారు. అలాగే వెళతాను అని వారికి మాట ఇచ్చాను. ఈ మధ్యలోనే ఎదో జరిగింది. అది నా షిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావాలాలో ఉన్న నా స్నేహితుని కొడుకు జబ్బున పడ్డాడు. నా స్నేహితుడు మందులు, మంత్రాలూ అన్నీ ఉపయోగించాడు కాని ఫలితం కనబడలేదు, జబ్బూ తగ్గలేదు. చివరికి వాడి గురువుని పిలిచి దగ్గర కూర్చుండబెట్టుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఈ సంగతి విని 'నా స్నేహితుడి కుమారుడిని రక్షించలేనటువంటి గురువు యొక్క ప్రయోజనం ఏమిటి? గురువు మనకు ఏ విధమైన సహాయం చేయలేనప్పుడు నేను షిరిడీ ఎందుకు వెళ్ళాలి?' అని భావించి, షిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కాని జరగాల్సింది జరగకమానదు. అది ఈ విధంగా జరిగింది … నానాసాహెబు ఛాందొర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకరోజు వసయీకి పర్యటనకు వెళుతున్నాడు. ఠాణా నుండి దాదరుకు వచ్చి అక్కడ వసయీకి వెళ్ళవలసిన బండి గురించి ఎదురుచూస్తున్నాడు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దాంట్లో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిరిడీ ప్రయాణాన్ని వాయిదా వేసినందుకు నన్ను కోప్పడ్డారు. నానా సంతోషంగాను, అనుకూలంగాను ఉన్నారు. అందుకే ఆ రాత్రికే షిరిడీ వెళ్లాలని నిశ్చయించుకున్నాను. సామానులు కట్టుకుని షిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదరు వెళ్ళి అక్కడ మన్మాడ్ రైలు ఎక్కాలని అనుకున్నాను. అలాగే దాదరుకు టిక్కెట్టు కొనుక్కుని, రైలు రాగానే ఎక్కికూర్చున్నాను. బండి ఇక బయలుదేరుతుంది అనగా ఒక మహమ్మదీయుడు నేను కూర్చున్న పెట్టెలోకే హడావుడిగా ఎక్కి నా సామాను అంతా వెతికి ఎక్కడికి వెళుతున్నావు? అని అడిగాడు. నా ఆలోచనను ఆయనకి చెప్పాను. వెంటనే అతను దాదరు స్టేషనులో దిగవద్దు అనీ, ఎందుకంటే మన్మాడ్ మెయిలు దాదరులో ఆగదనీ, అదే రైలులో ఇంకా ముందుకు వెళ్ళి బోరీబందరు స్టేషనులో దిగమని నాకు సలహా ఇచ్చాడు. ఈ చిన్న లీలే జరగకపోయి వుంటే నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడీ చేరుకోలేక పోయేవాడిని. అనేక సందేహాలు కూడా కలిగాయి. కాని నా అదృష్టవశాత్తు అది అలా జరగలేదు. మరుసటి రోజు సుమారు 9-10 గంటలలోగా నేను షిరిడీ చేరుకున్నాను. షిరిడీలో నాకోసం కాకాసాహెబు దీక్షిత్ ఎదురుచూస్తున్నారు.ఇది 1910ప్రాంతంలో జరిగింది. అప్పటికి సాఠేవాడా ఒక్కటే షిరిడీకి వచ్చే భక్తుల కోసం నిర్మించబడినది. టాంగా దిగినవెంటనే బాబాను దర్శించుకోవాలనే ఆతృత నాలో కలిగింది. అంతలో, అప్పుడే మసీదు నుండి వస్తున్న తాత్యాసాహెబు నుల్కరు, బాబా వాడా చివరన ఉన్నాయనీ, మొట్టమొదట ధూళీదర్శనం చేసుకోమని నాకు సలహా ఇచ్చారు. స్నానం చేసిన తరువాత ఓపికగా మళ్ళీ చూడవచ్చు అని చెప్పారు. ఇది విన్న వెంటనే నేను వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందం ఉప్పొంగి పొంగిపొరలింది నానాసాహెబు ఛాందొర్కర్ చెప్పిన దానికంటే ఎన్నోరెట్లు అనుభవం కలిగింది. నా సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలిదప్పికలు మరచిపోయాను. మనస్సుకు సంతోషం కలిగింది. నన్ను షిరిడీ వెళ్ళాలని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో ఋణపడి ఉన్నట్లుగా భావించాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారి ఋణాన్ని నేను తీర్చుకోలేను. వారిని జ్ఞాపకానికి తెచ్చుకుని, వారికీ నా మనస్సులో సాష్టాంగప్రమాణం చేశాను. నాకు తెలిసినంతవరకూ సాయిబాబా దర్శనం వల్ల కలిగే విచిత్రం ఏమిటంటే మనలో ఉన్న ఆలోచనలు మారిపోతాయి. వెనుకటి కర్మల బలం తగ్గిపోతాయి. క్రమంగా ప్రపంచం పట్ల విరక్తి కలుగుతాయి. నా పూర్వజన్మ సుకృతం వల్లనే నాకు ఈ దర్శనం లభించింది అని అనుకున్నాను. సాయిబాబాని చూసినంతనే ఈ ప్రపంచమంతా సాయిబాబా రూపం ఆవహించింది. 

తీవ్ర వాగ్వివాదం

నేను షిరిడీ చేరిన మొదటి రోజునే నాకు బాలాసాహెబు భాటేకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వాగ్వివాదం జరిగింది. మన స్వేచ్చను విడచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండాలి అని నేను వాదించాను. 'మన కర్మలను మనమే చేయడానికి గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి, అమితమైన యత్నంలో ఈ జన్మదుఃఖం నుండి తప్పించుకోవాలి. ఏమీ చేయకుండా సోమరిగా కూర్చునేవాడికి గురువు ఏమి చేయగలడు?' అని నేను స్వేచ్చపక్షాన్ని ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదం పట్టుకుని, ప్రారబ్ధం తరపున వాదిస్తూ 'జరగవలసినది జరగక మానదు మహనీయులు కూడా ఈ విషయాలలో ఓడిపోయారు. మనుషులు ఒకటి తలిస్తే భగవంతుడు వేరొకటి తలుస్తాడు. నీ తెలివితేటలూ అలా ఉంచు. గర్వంగాని, అహంకారంగాని మీకు తోడ్పడవు' అని చెప్పాడు. ఈ వాదోపవాదన ఒక గంట సేపు జరిగింది. కాని యిదమిద్దమని ఎటూ తేలలేదు అని గ్రహించాను. వివాదానికి మూల కారణం అహంకారం. ఇతరులతో కలిసి మేము మసీదుకు వెళ్ళగా, బాబా కాకాను పిలిచి ఇలా అడిగారు 'వాడాలో ఏం జరిగింది? ఏమిటా వివాదం? అది దేని గురించి? ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు?' ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సాఠేవాడా మసీదుకు చాలా దూరంలో వుంది. మా వివాదం గురించి బాబాకి ఎలా తెలిసింది? అతను సర్వజ్ఞుడు అయి ఉండాలి లేకపోతే మా వాదన ఎలా గ్రహిస్తారు? బాబా మన అంతరాత్మపై ఆధికారి అయి ఉండవచ్చు.

హేమాడ్ పంత్ అనే బిరుదుకు మూలకారణం

సాయిబాబా నన్ను ఎందుకు 'హేమాడ్ పంత్' అని పిలుస్తారని ఆలోచించసాగాను. ఇది 'హేమాద్రిపంతు' అనే నామానికి రూపాంతరం. దేవగిరికి చెందిన యాదవ వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధాన అమాత్యుడు. అతను గొప్ప పండితుడు, మంచి స్వభావం కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజ ప్రశస్తి అనే గొప్ప గ్రంథాలను రచించినవాడు, మోడీ భాషను ఒక నూతన గణిత విధానాన్ని కనిపెట్టినవాడు. ఇక నేనా? వారికీ వ్యతిరేక బుద్ధిగలవాడిని. మేథాశక్తి అంతగా లేనివాడిని. మరి సాయిబాబా నాకెందుకు ఈ బిరుదు ఇచ్చారో తెలియలేదు. ఆలోచన చేయగా అది నా అహంకారాన్ని చంపుకోవడానికి ఒక నెపం అని, నేను ఎప్పుడూ అణుకువ, నమ్రతలు కలిగి ఉండాలని బాబా కోరిక అయి ఉండవచ్చును అని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలోనే నేను చూపించిన తెలివితేటలను బాబా ఈ విధంగా అభినందించి ఉండవచ్చు అని అనుకున్నాను. భవిష్యత్తు చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు (దాభోల్కరును 'హేమాడ్ పంత్' అనడం) గొప్ప ప్రాముఖ్యం కలదని, భవిష్యత్తు తెలిసే బాబా అతనే అని భావించవచ్చు. ఎలా అంటే హేమాడ్ పంత్ శ్రీసాయిబాబా సంస్థానాన్ని చక్కని చాకచాక్ర్యంతో నడిపారు. సంస్థానం యొక్క లెక్కలను బాగా ఉంచారు. అదే కాకుండా భక్తి, జ్ఞానము, నిర్వామోహం, ఆత్మశరణాగతి, ఆత్మ సాక్షాత్కారం మొదలైన విషయాలతో శ్రీసాయిసచ్చరిత్ర అనే గొప్ప గ్రంథాన్ని రచించారు.

గురువు యొక్క ఆవశ్యకత

ఈ విషయమై బాబా ఏమన్నాడో హేమాడ్ పంత్ రాయలేదు. కానీ, కాకాసాహెబు దీక్షిత్ ఈ విషయాన్ని గురించి తాను రాసుకున్న దాన్ని ప్రచురించాడు. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండవ రోజు కాకాసాహెబు దీక్షిత్ బాబా దగ్గరికి వచ్చి 'షిరిడీ నుండి వెళ్ళవచ్చా?' అని అడిగారు. బాబా అలాగే అని జవాబు ఇచ్చారు. 'ఎక్కడికి' అని ఎవరో అడగారు 'చాలాపైకి' అని బాబా చెప్పారు. 'మార్గం ఏది?' అని దీక్షిత్ అడిగారు. 'అక్కడికి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉన్నాయి. షిరిడీనుంచి కూడా ఒక మార్గం వుంది. మార్గం ప్రయాసకరమైనది. మార్గమధ్యంలో ఉన్న అడవిలో పులులు, తోడేళ్ళు ఉంటాయి' అని బాబా బదులు చెప్పారు. 'మార్గాదర్శకుడిని వెంట తీసుకుని వెళ్ళినట్లయితే?' అని కాకాసాహెబు అడగ్గా, 'అలా అయితే కష్టమే లేదు అని బాబా జవాబు ఇచ్చారు. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానం చేరుస్తాడు. మార్గమధ్యలో ఉన్న తోడేళ్ళు, పులులు, గోతుల నుండి తప్పిస్తాడు, మార్గదర్శకుడు లేకపోతే అడవిమృగాల వల్ల చంపబడవచ్చు లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చు' అన్నారు. మసీదులో అప్పుడు అక్కడే వున్న దాభోల్కరు తన ప్రశ్నకు అదే తగిన సమాధానం ఆని గుర్తించారు. వేదాంత విషయాలలో మానవుడు స్వేచ్చాపరుడా? కాదా? అనే వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించారు. పరమార్థం నిజంగా గురుబోధల వల్లనే చిక్కుతుందని, రామకృష్ణులు తమ గురువులైన వశిష్టసాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారం పొందారని, దానికి దృఢమైన నమ్మకం (నిష్ఠ), ఓపిక (సబూరీ) అనే రెండు గుణాలు ఆవశ్యకమనీ గ్రహించారు.

రెండవ అధ్యాయం సంపూర్ణం

మూడవ అధ్యాయం

 

0 Comments To "Saibaba Saccharitra 2 Adhyaayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!