Saibaba satcharitra 4 Adhyayam

  శ్రీసాయిసచ్చరిత్ర

నాలుగవ అధ్యాయం

భగవద్గీత చతుర్థ అధ్యాయంలో 7-8 శ్లోకాలలో శ్రీకృష్ణపరమాత్ముడు ఇలా శెలవిచ్చారు 'ధర్మం నశించినప్పుడు అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను. సన్మార్గులను రక్షించడానికి దుర్మార్గులను శిక్షించడానికి, ధర్మస్థాపన కోసం, యుగయుగాలలో అవతరిస్తాను' ఇదే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిథులుగా యోగులు, సన్యాసులు అవసరం వచిన్నప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. ద్విజులుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులవారు తమ కర్మలను మానుకున్నప్పుడు, శూద్రులు పై జాతులవారి హక్కులను హరిస్తున్నప్పుడు, మతగురువులను గౌరవించకుండా అవమానించినప్పుడు, ఎవరు మతబోధనలను లక్ష్యపెట్టకుండా ఉన్నప్పుడు, ప్రతివాడూ తాను గొప్ప పండితుడిని అనుకున్నప్పుడు, ప్రజలు నిషిద్ధ ఆహారాలు, మధ్యపానాలకు అలవాటుపడినప్పుడు మతం పేరుతొ కాని పనులు చేస్తున్నప్పుడు, వేర్వేరు మతాలవారు తమలో తాము కొట్టుకుంటున్నప్పుడు, బ్రాహ్మణులూ సంధ్యావందనం మానివేసినప్పుడు, సనాతనులు తమ మతాచారాలు పాటించకుండా ఉన్నప్పుడు, ప్రజలు దానధారాసంతనాలే జీవిత పరమార్థంగా భావించి మోక్షమార్గాన్ని మరిచిపోయినప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలతో ప్రజలను సన్మార్గంలో పెట్టి వ్యవహారాలూ చక్కదిద్దుతారు. వారు దీపస్తంభాలుగా సహాయపడి, మనం నడవవలసిన సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను నిర్ధేశిస్తారు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్శిబాయి, సజన్ కసాయి, సంవతమాలి, రామదాసు మొదలైన యోగులను తదితరులు వేర్వేరు సమయాలలో జన్మించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపించారు. అలాగే సాయిబాబా కూడా సకాలంలో షిరిడీ చేరుకున్నారు. ఆహ్మదానగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతాలు చాలా పుణ్యమైనవి. ఎందుకంటే ఇక్కడే అనేకమంది యోగులు జన్మించి నివశించారు. అలాంటి వారిలో ముఖ్యమైనవారు శ్రీజ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామం ఆహ్మదనగరు జిల్లాలోని కోపర్ గావ్ తాలూకాకు చెందినది. కోపర్ గావ్ వద్ద గోదావరి దాటి షిరిడీకి వెళ్ళాల్సి ఉంటుంది. నది దాటి మూడు కోసుల దూరంలో నీంగావ్ వస్తుంది. అక్కడికి షిరిడీ కనిపిస్తుంది. కృష్ణా తీరంలో గాణపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలైన పుణ్యక్షేత్రలలాగే షిరిడీ కూడా గొప్ప పేరుపొందింది. పండరీపురానికి సమీపంలో ఉన్న మంగళవేఢలో భక్తుడైన దామాజీ, సజ్జనగఢలో సమర్థరామదాసు, నర్నోబాచీవాడీలో శ్రీ నరసింహ సరస్వారీస్వామివారు వర్థిల్లినట్లే శ్రీసాయినాథుడు షిరిడీలో వర్థిల్లి దాన్ని పవిత్రంగా తీర్చిదిద్దారు.

సాయిబాబా రూపురేఖలు

శ్రీసాయిబాబాలాగానే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎలాంటి వ్యక్తో పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారాన్ని జయించినవారు. శాంతి వారి భూషణం, వారు జ్ఞానమూర్తులు, వైష్ణవభక్తులకు ఇల్లువంటివారు, ఉదారస్వభావులు, సారంలోని సారాంశం వంటివారు, నశించే వస్తువులమీద అభిమానం లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షత్కారంలోనే మునిగిపోయి ఉండేవారు. భూలోకంలోకానీ, స్వర్గలోకంలోకాని ఉన్న వస్తువులలో అభిమానం లేనివారు. వారి అంతరంగం అద్దంలాగా స్వచ్చమైనది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించేది. గొప్పవారు, బీదవారు వారికి అందరూ సమానమే. వారు అభిమాన అవమానాలను లెక్కచేసేవారు కాదు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు చూసేవారు, పాటలు వింటూ ఉండేవారు. కానీ సమాధి స్థితినుండి వెనక్కి తగ్గేవారు కాదు. ఎల్లప్పుడూ అల్లా నామాన్ని ఉచ్చారణ చేస్తూ ఉండేవారు. ప్రపంచమంతా మేలుకొని ఉన్న సమయంలో వారు యోగనిద్రలో ఉండేవారు. లోకం నిద్రపోయే సమయంలో వారు మెళకువతో ఉండేవారు. వారి అంతరంగం లోతైన సముద్రంలా ప్రశాతం. వారి ఆశ్రమం, వారి చర్యలు యిదమిత్తంగా నిశ్చయించడానికి వీలులేనివి. ఒకే చోట కూర్చున్నప్పటికీ ప్రపంచంలో జరుగుతున్న సంగతులు, విశేషాలు అన్నీ వారికి తెలుసు.  వారి దర్భారు ఘనమైనది. నిత్యమూ వందల కథలు చెప్పినప్పటికీ మౌనం తప్పేవారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకుని నిలబడేవారు, లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండీ తోటవైపు కానీ చావిడీవైపు కానీ పచార్లు చేస్తూ ఉండేవారు. ఎప్పుడూ ఆత్మధ్యానంలోనే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడు అయినప్పటికీ సాధకుడిలా నటించేవారు. అణుకువ, నమ్రత కలిగి, అహంకారం లేక అందరినీ ఆనందింప చేసేవారు. అలాంటివారు సాయిబాబా, షిరిడీ నేల వారి పాదస్పర్శతో గొప్ప ప్రాముఖ్యాన్ని పొందింది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళందిని వృద్ధి చేసినట్లుగా, ఏకనాథుడు పిఠానుని వృద్ధి చేసినట్లుగా శ్రీసాయిబాబా శిరిడీని వృద్ధి చేశారు. షిరిడీలోని గడ్డి, రాళ్ళు పుణ్యం చేసుకున్నాయి. అది ఎలాగంటే బాబా పవిత్ర పాదాలను ముద్దుపెట్టుకొని వారి పాదధూళి తలపై వేసుకోగలిగాయి. షిరిడీ మాలాంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశి, రామేశ్వరం,, బదరీ కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణు లాంటివి అయింది. షిరిడీ సాయిబాబా స్పర్శే మాకు వేదపారాయణ తంత్రం. అది మాకు సంసారబంధనాలు సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారాన్ని సులభ సాధ్యం చేస్తుంది. శ్రీసాయి దర్శనమే మాకు యోగసాధనంగా ఉండేది. వారితో సంభాషణ మా పాపాలను తొలగిస్తుండేవి. త్రివేణీ ప్రయాగల స్నానఫాలం వారి పాదసేవ వల్లనే కలుగుతుండేది. వారి పాదోదకం మా కోరికలను నశింపచేస్తుండేవి. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊదీ ప్రసాదం మమ్మల్ని పావనం చేస్తుండేది. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా, శ్రీరాముడిగా వుండి ఉపశమనం కలగజేసేవారు. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ఎప్పుడూ సచ్చిదానందస్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైనా వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానం, గుజరాత్, దక్కను, కన్నడ రాష్ట్రాలలో చూపేవారు. ఇలా వారి కీర్తి ఆశీర్వాదం పొందేవారు. వారి దర్శనంతో భక్తుల మనస్సులు వెంటనే శాంతి వహిస్తూ ఉండేవి. పండరీపురంలో విఠల్ రఖుమాయీలను దర్శించడంలో కలిగే ఆనందం షిరిడీలో దొరుకుతూ ఉండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడు ఒకరు చెప్పింది గమనించండి.

గౌలిబువా అభిప్రాయం

95 సంవత్సరాల వయస్సు ఉన్న గౌలిబువా అనే వృద్ధ భక్తుడు ఒకరు పండరీ యాత్ర ప్రతిసంవత్సరం చేసేవాడు. ఎనిమిది మాసాలు పండరీపురంలో, మిగతా నాలుగు మాసాలు, ఆషాడం మొదలు కార్తీక మాసం వరకు(జులై - నవంబరు వరకు) గంగానది ఒడ్డున ఉండేవారు. సామాను మోయడానికి ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుణ్ణి తెసుకుని వెళ్ళేవారు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనానికి వచ్చేవాడు. అతను బాబాని అమితంగా ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూస్తూ ఇలా అన్నాడు 'వీరు పండరీనాథుడి అవతారమే! అనాథల కోసం, బీదల కోసం వెలిసిన కారుణ్యమూర్తి!' గౌలిబువా విఠోబా దేవుడి ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసి ఉన్నాడు. వీరు సాయిబాబా పండరీనాథుడి అవతారం అని నిర్థారణ చేశారు.

విఠల దేవుడు దర్శనం ఇవ్వడం

సాయిబాబాకు భగవన్నామ, సంకీర్తనలో అత్యంత ప్రీతి కలవాడు. 'అల్లా మాలిక్' అంటే 'అల్లాయే యజమాని' అని అంటుండేవారు. ఏడు రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవారు. దీన్నే నామసప్తాహం అంటారు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహం చేయమన్నారు. సప్తాహం ముగిసే రోజు విఠల్ దర్శనం కలుగుతుందని వాగ్దానం ఇస్తే నామసప్తాహం చేస్తానని దాసగుణ జవాబిచ్చాడు. బాబా తన గుండెపై చేయివేసి 'తప్పనిసరిగా దర్శనం ఇస్తాడు కాని, భక్తుడు భక్తి ప్రేమలతో ఉండాలి. డాకూర్ నాథ్ యొక్క డాకూరు పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుడి ద్వారకా పట్టణం ఇక్కడే … అంటే షిరిడీలోనే ఉన్నాయి. ఎవరూ ద్వారకకు వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడు యిక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తిప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరిస్తాడు' అన్నారు. సప్తాహం ముగిసిన తరువాత విఠలుడు క్రింద విధంగా దర్శనం ఇచ్చాడు. స్నానం తరువాత కాకాసాహెబు దీక్షిత్ ధ్యానంలో మునిగి ఉన్న సమయంలో విఠలుడు వారికి కనిపించారు. కాక మధ్యాహ్న హారతి కోసం బాబా దగ్గరికి వెళ్ళగా తేటతెల్లంగా కాకాను బాబా ఇలా అడిగారు 'విఠల్ పాటిల్ వచ్చాడా? నీవు అతన్ని చూశావా? వాడు మిక్కిలి పొగరుబోతు. వాణ్ణి దృఢంగా పట్టుకో, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తప్పించుకుని పారిపోతాడు' ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవరో పటాలు అమ్మేవారు 25, 30 విఠోబా చిత్రపటాలను అమ్మకానికి తెచ్చాడు. ఆ పటం సరిగ్గా కాకాసాహెబు ధ్యానంలో చూసిన దృశ్యాలతో పోలి ఉన్నాయి. దీన్ని చూసి బాబా మాటలు జ్ఞాపకానికి తెచ్చుకుని, కాకాసాహెబు ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయారు. విఠోబా పటం ఒకటి కోని పూజా మందిరంలో ఉంచుకున్నారు.

భగవంతరావు క్షీరసాగరుని కథ

విఠల పూజలో బాబాకి ఎంత ప్రీతికరమో భగవంతరావు క్షీరసాగరుని కథలో వివరించబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి నియమంగా యాత్ర చేస్తూ ఉండేవాడు. ఇంటి దగ్గర కూడా విఠోబా విగ్రహాన్ని పెట్టుకుని పూజించేవాడు. అతను మరణించిన తరువాత వారి కొడుకు పూజలను, యాత్రను, శ్రాద్ధం పెట్టడం మానివేశాడు. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాడి తండ్రిని జ్ఞాపకానికి తెచ్చుకుని 'వీడి తండ్రి నా స్నేహితుడు కానీ వీణ్ణి ఇక్కడికి ఈడ్చుకుని వచ్చాను. వీడు నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదు. అందుకు నన్ను విఠలుడిని కూడా ఆకలితో మాడ్చాడు. అందుకే వీణ్ణి ఇక్కడికి తీసుకువచ్చాను. వీడు చేస్తుంది తప్పు అని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించేలా చేస్తాను' అన్నారు. గంగానది యమునానది కలిసిన ప్రదేశానికి ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం చేసిన ప్రతివాడికీ గొప్ప పుణ్యం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం. అందుకే వేలమంది భక్తులు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. దాసగుణు కూడా ప్రయాగ వెళ్ళి అక్కడ సంగంలో స్నానం చేయాలని మనసులో తలపోసాడు. బాబా దగ్గరికి వెళ్ళి అనుమతించాలని కోరుకున్నాడు. అందుకు బాబా ఇలా జవాబు ఇచ్చారు 'అంత దూరం వెళ్ళవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇక్కడే వుంది. నామాటలు విశ్వసించు' ఇలా అనగానే ఆశ్చర్యాలన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసగుణు మహారాజ్ బాబా పాదాలపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా రెండు పాదాల బొటన వ్రేళ్ళనుండి గంగా యమునా జలాలు కాలువలుగా పారాయి. ఈ చమత్కారాన్ని చూసి దాసగుణు ఆశ్చర్యపోయాడు. భక్తితో పరవశించి మైమరచిపోయాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండుకున్నాయి. అతని హృదయం ఉప్పొంగి కవితావేశం శ్రీసాయిలీలా గాన రూపంలో పెళ్ళుబికింది.

బాబా అయోనిసంభవుడు : షిరిడీ మొట్టమొదట ప్రవేశం

సాయిబాబా తల్లిదండ్రుల గురించి కానీ, జన్మము గురించి కానీ, జన్మస్థానం గురించి కాని ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో అనేకసార్లు ఈ విషయాలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. అనేకసార్లు బాబాను ఈ విషయాన్ని గురించి ప్రశ్నించారు కానీ, సామాన్య మానవులుగా జన్మించి ఉండలేదు. ముత్యపుచిప్పలలో చిన్న పాపలా లభించారు. నామదేవుడు భీమారథి నదీ తటాకంలో గోణాయికి కనిపించారు. కబీరు భాగీరథీ నదీ తటాకంలో తమాలుకు కనిపించారు. అలాంటిదే సాయిబాబా జన్మవృత్తాంతం. భక్తుల కొరకు బాబా పదహారేళ్ళ బాలుడిగా షిరిడీలోని వేపచెట్టు క్రింద అవతరించారు. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించారు. బాబా స్వప్నావస్థలో కూడా ప్రపంచ వస్తువులను కోరుకునేవారు కాడు. ఆయన మాయను తన్నారు. ముక్తి బాబా పాదములను సేవిస్తూ ఉండేది. నానాచోప్ దారు తల్లి పండు వృద్ధురాలు. ఆమే బాబాను ఈ విధంగా వర్ణించింది 'ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేపచెట్టు క్రింద ఆసనంలో ఉన్నాడు. శీతోపష్ణాలను లెక్క చేయకుండా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపాన్ని ఆచరించడం సమాధిలో మునిగి ఉండటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసేవాడు కాదు. రాత్రిపూట ఎవరికీ భయపడేవాడు కాడు. చూసినవారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడినుండి వచ్చాడు అని అడుగుతూ ఉండేవారు. అతని రూపు, ముఖ లక్షణాలు చాలా అందంగా ఉండేవి, చూసిన ప్రతిఒక్కరూ ఒక్కసారిగా ముగ్ధులు అవుతూ ఉండేవారు ఆయన ఎవరి ఇంటికీ వెళ్ళేవారు కాదు, ఎప్పుడూ వేపచెట్టు క్రిందే కూర్చునేవాడు. పాకే చిన్న పిల్లవాడిలా కనిపించినప్పటికీ చేతలను బట్టి చూస్తే నిజంగా మహానుభావుడే. నిర్వ్యామొహం రూపుదాల్చిన అతని గురించి ఎవరికీ ఏమీ తెలిసేది కాదు.' ఒకనాడు ఖండోబా దేవుడు ఒకడిని ఆవహించినప్పుడు ఈ బాలుడు ఎవరై ఉంటారు అని ప్రశ్నించారు. వాడి తల్లిదండ్రులు ఎవరని, ఎక్కడినుండి వచ్చాడని అడిగారు. ఆ ఖండోబా గణం ఒక స్థలాన్ని చూపించి గడ్డపారను తీసుకుని వచ్చి అక్కడ త్రవ్వమని చెప్పాడు. అలా త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాటి కింద వెడల్పు రాయి ఒకటి కనిపించింది. ఆ బండను తొలగించి చూడగా క్రింద ఒక సందు కనిపించింది. అక్కడ నాలుగు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ సొరంగం ద్వారా ముందుకు వెళ్ళగా అక్కడ ఒక భూగృహం కనిపించింది. అందులో గోముఖ నిర్మాణాలు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాయి. ఈ బాలుడు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు అభ్యసించాడని ఖండోబా తెలిపాడు. తరువాత కుర్రవాణ్ణి ఈ విషయాలు ప్రశ్నించగా వారిని అసలు విషయాన్ని మరిపిస్తూ అది తన గురుస్థానం అని, వారి సమాధి అక్కడ వుంది కాబట్టి దాన్ని కాపాడాలి అని తెలిపాడు. వెంటనే దాన్ని ఎప్పటిలాగా మూసివేశారు. అశ్వత్థ ఉదుంబర వృక్షంలా ఈ వేపచెట్టును పవిత్రంగా చూసుకుంటూ బాబా ప్రేమించేవాడు. మహాల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీన్ని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానం అని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు.

మూడు వసతి గృహములు

వేపచెట్టుని దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరివినాయక సాఠే అనే అతను కొని సాఠేవాడ అనే ఒక పెద్ద వసతిగృహాన్ని నిర్మించాడు. అప్పట్లో షిరిడీకి వెళ్ళిన భక్తమండలికి అది నివాస స్థలం. వేపచెట్టు చుట్టూ ఎత్తుగా ఒక అరుగు, మెట్లు నిర్మించారు. మెట్ల క్రింద ఒక గూడు వంటిది ఉంటుంది. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎవరు ఇక్కడ గురు, శుక్రవారాలు ధూపం వేస్తారో వారు బాబా కృప వలన సంతోషంతో ఉంటారు.ఈ వాడా చాలా పురాతనమైనది. కాబట్టి మరమ్మత్తులకు సిద్ధంగా ఉండేది. తగిన మార్పులు, మరమ్మత్తులు సంస్థానం వారు చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత దీక్షిత్ వాడా అనే పేరు మీద ఇంకొక వసతిగృహం నిర్మించబడింది. న్యాయవాది అయిన కాకా సాహెబు దీక్షిత్ ఇంగ్లాండుకు వెళ్ళాడు. అక్కడ రైలు ప్రమాదంలో కాలు కుంటిదయింది. అది ఎంత ప్రయత్నించినా బాగుపడలేదు. తన స్నేహితుడైన నానాసాహెబు ఛాందొర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించుకోమని సలహా ఇవ్వడంతో 1909వ సంవత్సరంలో కాకా షిరిడీకి వెళ్ళాడు. బాబా దర్శనంతో అమితానందభరితుడై షిరిడీలో స్థిరనివాసం ఉండాలని నిశ్చయించుకున్నాడు. కాలు కుంతటితనం కన్నా తన మనస్సులోని కుంటితనం  తీసివేయమని బాబాను ప్రార్థించాడు. తన కోసం, భక్తులకు పనికి వచ్చే విధంగా ఒక వాడాను నిర్మించాడు. 10-12-1910వ తారీఖున ఈ వాడా కట్టడానికి పునాది వేశారు. ఆరోజే రెండు ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి (1) దాదాసాహెబు ఖాపర్డేకి తన ఇంటికి వెళ్ళడానికి అనుమతి దొరికింది. (2) చావడిలో శేజ్ (రాత్రి)హారతి ప్రారంభించబడింది. దీక్షిత్ వాడా పూర్తికాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయంలో శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపారు. తరువాత కోటీశ్వరుడైన నాగపూర్ నివాసి అయిన బూటీ ఇంకొక పెద్ద రాతి మేడను నిర్మించాడు. అతను మేడ నిర్మాణానికి చాలా డబ్బు ఖర్చుపెట్టాడు. బాబాగారి భౌతికశరీరం ఇందులో సమాధి చేయబడింది. దీన్నే సమాధి మందిరం అంటారు. ఈ స్థలంలో మొట్టమొదట పూలతోట ఉండేది. ఆ తోటలో బాబాయే తోటమలిగా మొక్కలకు నీళ్ళు పోయడం మొదలైన పనులు చేసేవారు. ఇలా మూడు వాడాలు (వసతిగృహాలు) నిర్మించబడ్డాయి. అంతకుముందు ఇక్కడ ఒక్క వసతిగృహం కూడా లేదు. అన్నిటికంటే సాఠేవాడా మొదటి రోజులలో అందరికీ చాలా ఉపయోగపడేది.

నాలుగవ అధ్యాయం సంపూర్ణం

ఐదవ అధ్యాయం

0 Comments To "Saibaba satcharitra 4 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!