Rudraksha is a wonderful gift of Lord Shiva

Rudraksha is a wonderful gift of Lord Shiva

"త్రిపురాసురుని సంహార సమయంలో నేను నిమీలీత నేత్రుడినై ఉండగా నా కనులనుండి జల బిందువులు రాలి భూమ్మీద పడ్డాయి. వాటి నుండి సర్వ జన క్షేమార్థమై రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి".ఇది పరమేశ్వరుడు చెప్పిన మాట.


శివపురాణం, దేవీభాగవతం, రుద్రోక్షోపనిషత్తు, రుద్రజబాల్యుపనిషత్తు, లింగపురాణం, స్కాంద పురాణం ఇలా వివిధ పురాణాలు రుద్రాక్షల గురించి చెప్పాయి.పరమశివుడు మానవజాతికి ప్రసాదించిన అద్భుతవరం రుద్రాక్షలు అని అష్టాదశపురాణాల్లో చెప్పబడింది.ఒకప్పుడు విష్ణుమూర్తికి దేవతలందరూ విలువైన వజ్రవైఢూర్యాలు, సువర్ణ ఆభరణాలు సమర్పించి తమ భక్తిని తెలుపుకున్నారు.


ఈ సందర్భంలో పరమశివుడు ఒక "రుద్రాక్షబీజా"న్ని కానుకగా పంపగా విష్ణుమూర్తి పరమానందభరితుడై ఆ రుద్రాక్షని స్వీకరించి తన చెంతనే ఉన్న మహాలక్ష్మికి అందించాడు.రుద్రాక్ష మహిమ తెలియని శ్రీలక్ష్మీదేవి ఈసడింపుగా చూసింది. సర్వసంపదలకు నిలయమైన లక్ష్మీదేవికి రుద్రాక్ష అతి స్వల్పంగా కనిపించింది.రుద్రాక్ష అపమృత్యువుని నివారించి దేహసౌఖ్యాన్నే కాక, ఆత్మశాంతిని, సౌందర్యాన్నీ ప్రసాదిస్తుందనే సత్యాన్ని లక్ష్మీదేవి గ్రహించలేకపోయింది.

అదే సమయానికి కలహాభోజుడైన నారదుడు రంగప్రవేశం చేశాడు. నారదుడు లక్ష్మీదేవిని రెచ్చగొట్టి శివుడు రుద్రాక్షను కానుకగా పంపడాన్ని హేళనగా చూపిస్తూ శ్రీమహావిష్ణువుని చిన్నబుచ్చడమే అనీ, ఇది శివుడు పన్నిన పన్నాగమే అనీ..శివుడు బహుకరించిన రుద్రాక్షను తిరిగి శివుడికే పంపితే అది గుణపాఠంగా ఉంటుందని లక్ష్మీదేవి భావించింది.

నారదుడు లక్ష్మీదేవికి ఒక సలహా ఇచ్చాడు, రుద్రాక్షను తిప్పి పంపడం కంటే దానికి సరి సమానమైన తూగే బంగారం పంపడం తగిన గుణపాఠం అవుతుందని అన్నాడు.నారదుని మాటలు విన్న లక్ష్మీదేవి రుద్రాక్ష తులాభారాన్ని ఏర్పాటు చేసి రుద్రాక్ష బరువుకు తగినట్టుగా లక్ష్మీదేవి తన బంగారాన్ని త్రాసులో ఉంచింది.కానీ, మొత్తం సంపదనంతా ఉంచినా త్రాసులో ఉంచిన రుద్రాక్షకు తూగకపోవడంతో లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి ఏమి చేయాలో తోచక విష్ణువే దీనికి తగిన సలహా ఇవ్వగలడని ఆలోచించి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలని అడిగింది.


ఈ ఏడు లోకాల సంపదలు కూడా రుద్రాక్షకు సరిపోదని ఒక "విబూది ఫలం" త్రాసులో వేయమని చెప్పాడు. లక్ష్మీదేవి అలాగే చేయగా త్రాసు పైకి లేచింది. తన అజ్ఞానానికి లక్ష్మీదేవి సిగ్గుపడింది.

మానవజాతికి మహాశివుడు అందించిన ఆపురూప సంపద రుద్రాక్ష. రుద్రాక్షను నిష్ఠతో ధరిస్తే సకల పాపాలు తొలిగిపోయి మానసిక, శారీరక శాంతి, సకల సంపదలనూ పొందుతారు.


వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం వుంటుంది. ప్రస్తుతం ఒకటి నుంచి 14 ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రమే లభిస్తున్నాయి.

ఏకముఖి రుద్రాక్ష:

దర్శనం మహాపాతక నాశనం ;

అర్చనం లక్ష్మీకటాక్ష కారణం.

ద్విముఖి :

గోహత్యాపాతక నివారిణి,

సర్వాభీష్ట కారిణి.

త్రిముఖి :

కార్యసిద్ధి ; విధ్యాభివృద్ధి.

చతుర్ముఖి :

బ్రహ్మస్వరూపం,

దర్శన – స్పర్శ మాత్రాన స్పర్శ పాపహారిణి, నరహత్యాదోష నివారిణి.

పంచముఖి:

కాలాగ్ని రుద్ర స్వరూపం.

మోక్షకారకం.

షణ్ముఖి :

కుమారస్వామి స్వరూపం.

సమస్తపాపహారిణి.

సప్తముఖి :

మన్మధరూపిణి. వశీకరనణి.

అష్టముఖి :

దారిద్ర్య విధ్వంసిని ; భైరవ స్వరూపం ;

దీర్ఘాయుష్య కారకం.

నవముఖి :

నవదుర్గా స్వరూపం.

శివతుల్య వైభవదాయిని.

దశముఖి :

విష్ణురూపిణి. సకలాభీష్టప్రదాయిని.

ఏకాదశముఖి :

రుద్రరూపిణి. విశేష ఫలదాయిని.

ద్వాదశముఖ రుద్రాక్ష:

దీనిని ధరించిన వారికి మానసిక శాంతి లభిస్తుంది. ఇంద్రియ నిగ్రహం, సౌభాగ్యం కలుగుతుంది. ఇది ఏకముఖి రుద్రాక్షతో సమానమైన శక్తి గలదని చెబుతారు. 

త్రయోదశ ముఖ రుద్రాక్ష:

పదమూడు ముఖాలుండే ఈ రుద్రాక్షను ఇంద్రుడి స్వరూపంగా చెప్పబడుతోంది.

దీనిని ధరించిన వారు చేపట్టే అన్ని కార్యక్రమాలు సఫలమవుతాయి. 

చతుర్దశముఖ రుద్రాక్ష:

పదునాలుగు ముఖములు కలిగిన ఈ రుద్రాక్షను శివుని స్వరూపంగా భావిస్తారు. అంతే గాకుండా దీనిని హనుమంతుడికి ప్రతీక అని కూడా చెప్తారు. 

సర్వరోగాలు నశిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.