Maha Shivaratri Pooja Vidhanam

Maha Shivaratri Pooja Vidhanam

మహాశివరాత్రి పూజ నియమాలు , విధానం, విశిష్టత....!!

18-2-2023 దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రాధాన్యమైనది. శివరాత్రి నెలకు ఒకటి చొప్పున్న పన్నెండు నెలలకు పన్నెండు శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి సంవత్సరకాలానికి ఒకటి మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండగలలో అత్యంత ప్రముఖమైనది.


ఈ మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్ధి నాడు అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనపుడు సంభవిస్తుందని, పరమశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని  శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తముగా శివనామ ఆరాధనతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తుంటారు. తెల్లవారుఝామునే నిద్ర లేచి శిరస్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించి శివుడిని గృహములో పూజలు చేసి సమీప శివాలయాన్ని దర్శించుకొంటారు. శివునికి ప్రీతికరమైన బిల్వపత్రాలను, ఆవుపాలు, తేనే, పంచామృతాలతో అభిషేకింఛి తన్మయత్వం చెందుతుంటారు. రోజంతా ఉపవాసం చేసి శివనామ స్మరణతో రాత్రంతా మెలుకువగా వుండి మహాశివరాత్రి జాగారం చేసి శివకృపకు పాతృలవుతారు.


శివరాత్రి కధలు:

క్షీరసాగరమధనం:

శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నవి. క్షీరసాగారమధనంలో కాలకూట విషం ఉద్భవించినపుడు దేవతలు, రాక్షషులు ఖంగారుపడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో  తెలియక దేవతలు, రాక్షషులు పరుగు పరుగున శంకరుని వద్దకు వెళ్లి శరణు వేడుకొన్నారు. అంతట ఆ మహాశివుడు లోకశ్రేయోదాయకమై గరళాన్ని మింగి తన గొంతులో దాచుకొన్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తిమంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకొన్నందున కంఠసీమ మొత్తం నీలి రంగులోకి మారిపోయింది. అందుచేతనే ఆ పరమశివునకు నీలకంఠడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగిన ఆ రాత్రినే హిందువులు మహాశివరాత్రి గా జరుపుకొంటున్నారు.


వేటగాడు అడవిలో చేసిన శివరాత్రి జాగరణ, ఫలితం :


ఒకప్పుడు ఒక పర్వతప్రాంతములో ఉన్న గూడెంలో కర్కసుడైన ఓ వేటగాడు ఉండేవాడు. అనుదినం అడవిలోకి వెళ్లి కిరాతకంగా ఏదేని జంతువుని వేటాడి  తన కుటుంబానికి ఆహారంగా తెస్తుండేవాడు. ఒకనాడు అడవిలో ఎప్పటివలె వేటకు వెళ్ళగా ఒక్క జంతువుకూడా కనపడక నానా యాతన పడ్డాడు. ఒక్క జంతువునైనా వేటాడకుండా తిరిగి వెళ్ళటం ఇష్టం లేక అడవంతా కలియ తిరిగాడు. ఒక్క జంతువైన కనపడలేదు సరికదా అప్పటికే చీకటి పడిన సంగతిని గమనించిన వేటగాడు తాను దట్టమైన అడవి మధ్యభాగంలో ఉన్నట్లు గుర్తించి, తన గూడెంకు చేరుకొనే అవకాశం లేకపోవటంతో, అక్కడే ఉన్న ఓ చెట్టు పైకెక్కాడు. రాత్రి సమయంలో ఆ అడవిలో కౄరమృగాలు సంచరిస్తాయి. ఇవి తలచుకున్న వేటగాడు భయంతో గజ గజలాడుతూ చెట్టు ఆకులను ఒక్కొక్కటి పీకుతూ కిందకు వేస్తున్నాడు. పడుకుని కిందకు పడితే కౄరమృగాలకు ఫలహారంగా మరిపోతననే భయంతో కునుకు దరిచేరకుండా, ధైర్యం పొందేందుకు శివనామ స్మరణ చేస్తూ గడిపాడు. అంతే సూర్యుడు ఉదయించే సరికి పరమశివుడు ప్రత్యక్షమై వేటగానికి శివలోకప్రాప్తి కలిగించాడు. 


వేటగాడు భయంతో ఎక్కినా ఆ చెట్టు బిల్వవృక్షం! శివనామ స్మరణతో జాగరణ చేసిన రాత్రి మహాశివరాత్రి కావడం!! 

వేటగాడు శివకృపకు పాత్రుడై శివలోకప్రాప్తి చెందినట్లు మరొక కథనం!!


మహాశివరాత్రి..18-2-2023..


ఈ సంవత్సరం మహాశివరాత్రి 18-2-2023తారీఖున జరుపుకోవాలని వేదజ్ఞుల మాట.


మహాశివరాత్రి పూజనాడు ఆచరించాల్సిన నియమాలు :


➤ సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. 

➤ ప్రవహించే నదిలో కానీ, సమీపంలో గల తటాకము లేదా చెరువులో కానీ, నూతి నీటితో కానీ శిరస్నానమాచరించాలి. 

➤ రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి. 

➤ రోజంతా యోగదీక్షలో ఉంటూ ఈ క్రింది మంత్రాలను పఠిస్తూ జాగారం దీక్షను ఆచరించాలి. :

           ⟾   శివ బీజాక్షరీ మంత్రం

        ఓం నమః శివాయ

⟾ మృత్యుంజయ మంత్రం :

      ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం

      ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్

⟾ రుద్రాగాయత్రి:

      ఓం తత్పురుషాయ విద్మహే 

      మహా దేవాయ ధీమహి 

      తన్నో రుద్ర ప్రచోదయాత్ 


పై మంత్రాలను మీ శక్తి మీరకు పఠించండి..


➤ తొలిసారి రుద్రాక్ష ధరించేవారు ఈరోజు రుద్రాక్ష ధరిస్తే ఎంతో మంచిది. 

➤ మహాశివరాత్రి రోజు బిల్వ పత్రాలతో పూజిస్తే మంచిది. 

➤మహాశివరాత్రి శివలింగానికి పంచామృతాల(పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార)తో అభిషేకిస్తే శివకృపకు పాతృలౌతారు. 


మహాశివరాత్రి జాగరణ :


 ఈరోజు పాటించేసిన నియమాల్లో జాగరణ ప్రాముఖ్యతే అధికం. మహాశివరాత్రి వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో నిష్ఠతో జాగరణ నియమాన్ని ఆచరించి ఆదియోగి, దేవాదిదేవుడైన ఆ పరమశివుని కృపకొరకు పోటీపడుతుంటారు. జాగరణలో ఉన్న శివభక్తులకొరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వేదప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.