Saibaba Satcharitra 3 Adhyayam

శ్రీసాయిసచ్చరితం

మూడవ అధ్యాయం

సాయిబాబా యొక్క అనుమతి, వాగ్థానం

వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీసాయిసచ్చరిత్ర రాయడానికి బాబా పూర్తి అనుమతి ఇస్తూ ఇలా అన్నారు 'సచ్చరిత్ర వ్రాసే విషయంలో నా పూర్తి సమ్మతి వుంది. నీ పనిని నీవు నిర్వర్తించు, భయపడకు, మనస్సు నిలకడగా ఉంచుకో. నా మాటలపట్ల విశ్వాసం ఉంచు. నా లీలలు రాసినట్లయితే నవిద్య అంతరించి పోతుంది. శ్రద్ధాభక్తులతో వాటిని విన్న వారికి ప్రపంచం పట్ల వ్యామోహం క్షీణిస్తుంది. బలమైన ప్రేమభక్తి కెరటాలు లేస్తాయి. ఎవరైతే నా లీలలలో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి' ఇది విని రచయిత చాలా సంతోషించాడు. వెంటనే నిర్భయుడు అయ్యాడు. కార్యం జయప్రదంగా సాగుతుందని ధైర్యం కలిగింది. ఆ తరువాత మాధవరావు దేశ్ పాండే (శ్యామా) వైపు తిరిగి బాబా యిలా అన్నారు 'ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలు అన్నీ నెరవేరుస్తాను. వారి భక్తిని రెట్టింపు చేస్తాను. వారిని అన్ని పక్కలనుండి కాపాడుతాను. ఎవరైతే మనఃస్ఫూర్తిగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారు ఈ కథలు వింటున్నప్పుడు అమితానందం పొందుతారు. నా లీలలను గానం చేసే వారికి అంతులేని ఆనందాన్ని, శాశ్వతమైన తృప్తిని ఇస్తానని నమ్మండి. ఎవరైతే నన్ను శరణు కోరుతారో, భక్తివిశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపాన్ని తమ మనస్సులో నిలుపుకుంటారో, వారిని దుఃఖబంధనాల నుండి తప్పిస్తాను. ప్రాపంచిక విషయాలు అన్నింటినీ మరిచి, నా నామాన్నే జపిస్తూ, నా పూజనే చేస్తూ, నా లీలలను, చరిత్రను మననం చేస్తూ ఎల్లప్పుడూ నన్ను జ్ఞాపకం ఉంచుకుంటారో వారు ప్రపంచ విషయాలలో ఎలా ఇరుక్కుంటారు? వారిని మరణం నుండి బయటకు లాగుతాను. నా కథలు వింటే సకల రోగాలు నివారింపబడతాయి. కాబట్టి భక్తిశ్రద్ధలతో నా కథలను వినండి. వాటిని మనస్సులో నిలుపుకోండి. ఆనందానికీ తృప్తికీ ఇదే మార్గం. నా భక్తుల యొక్క గర్వ అహంకారాలు నిష్క్రమిస్తాయి. నా లీలలు వినేవారికి శాంతి కలుగుతుంది. మనఃపూర్వకంగా నమ్మకం ఉన్నవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్యం కలుగుతుంది. 'సాయి సాయి' అనే నామాన్ని జ్ఞాపకం ఉంచుకున్నంత మాత్రాన, చెడు పలకడం వలన, వినటం వల్ల కలిగే పాపాలు తొలగిపోతాయి.

భక్తులకు వేర్వేరు పనులు నియమించడం

భగవంతుడు వేరువేరు భక్తులను వేరువేరు పనులకు నియమిస్తాడు. కొందరు దేవాలయాలు, మఠాలు, తీర్థాలలొ నది ఒడ్డున మెట్లు మొదలైనవి నిర్మించడానికి నియమితులు అవుతారు. భగవంతుడి లీలలను పాడటానికి కొంటారు నియమించబడతారు. కొందరు తీర్థయాత్రలకు వెళతారు. సచ్చరిత్ర రచన నాకు నియమించబడింది. విషయ జ్ఞానం శూన్యం అవడం వల్ల ఈ పని నా అర్హతకు మించినది. అయినా, యింత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించాలి? సాయిబాబా జీవితచరిత్రను వర్ణించగల వారు ఎవరు? సాయి యొక్క కరుణే ఇంతటి కఠిన కార్యాన్ని నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించింది. నేను చేత్తో కలం పట్టుకోగానే సాయిబాబా నా అహంకారాన్ని పరిహరించి వారి కథలను వారే రాసుకున్నారు కనుక ఈ గ్రంథాన్ని రచించిన గౌరవం సయిబాబాకే చెందుతుంది కాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అనే రెండు కళ్ళు లేకపోవడంతో సాయి సచ్చరిత్రను నేను రాయలేకపోయాను. కాని భగవంతుని అనుగ్రహం మూగవాణ్ణి మాట్లాడేలా చేస్తుంది; కుంటివాణ్ణి పర్వతం దాటేలా చేస్తుంది. తన ఇష్టానుసారం పనులు నెరవేర్చుకునే చాతుర్యం ఆ భగవంతుడికే వుంది. హార్మోనియానికి కాని వేణువుకి కాని ధ్వనులు ఎలా వస్తున్నాయో తెలియదు. అది వాయించేవాడికే తెలుస్తుంది. చంద్రకాంతం ద్రవించడం, సముద్రం ఉప్పొంగడం వాటి వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగుతుంది.

బాబా కథలు దీపస్తంభాలు

సముద్రం మధ్యలో దీపస్తంభాలు ఉంటాయి. పడవలపై వెళ్ళేవారు ఆ వెలుతురులో రాళ్ళూ రప్పల వల్ల కలిగే హానులనుండి తప్పించుకొని సురక్షితంగా ప్రయాణిస్తారు. ప్రపచం అనే మహాసముద్రంలో బాబా కథలు దీపాల వలె దారి చూపిస్తాయి. అవి అమృతం కంటే తియ్యగా వుండి ప్రపంచ యాత్ర చేయవలసిన మార్గాన్ని సులభంగా, సుగుమంగా చేస్తుంది. యోగీశ్వరుల కథలు పవిత్రమైనవి. అవి మన చెవుల ద్వారా హృదయంలో ప్రవేశించినప్పుడు శరీర స్పృహ, అహంకారం, ద్వంద్వభావాలు నశిస్తాయి. మన హృదయంలో నిల్వ వున్న సందేహాలు పటాపంచలైపోతాయి. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానాన్ని నిల్వ చేయబడుతుంది. శ్రీసాయిబాబా కీర్తి, వర్ణనలు ప్రేమతో పాడినా, విన్నా భక్తుని పాపాలు పటాపంచలైపోతాయి. కాబట్టి ఇవే మోక్షానికి సులభమైన సాధనాలు. కృతయుగంలో శమదమములు (నిశ్చల మనస్సు, శరీరం), త్రేతాయుగంలో యాగం, ద్వాపరయుగంలో పూజ, కలియుగంలో భగవంతుని మహిమలు, నామాలు పాడాటం మోక్ష మార్గాలు. నాలుగు వర్ణాల వారు ఈ చివరి సాధనాన్ని వాడుకోవచ్చు. మిగిలిన సాధనాలు అంటే యాగం, ధ్యానం, ధారణం అవలభించడం కష్టతరం. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడటం సులభమైన మార్గం. మన మనస్సును మాత్రం అటువైపు మళ్ళించాలి. భగవంతుని కథలు వినడం వలన, గానం చేయడం వలన మనకు దేహంపై అభిమానం తొలగిపోతుంది. అది భక్తులను దేహంపై మొహాన్ని, నిర్మోహాన్ని కలగచేసి ఆఖరికి ఆత్మసాక్షాత్కారం పొందేలా చేస్తుంది. ఈ కారణం వల్లనే సాయిబాబా నాకు సహాయపడి నాతొ ఈ సచ్చరిత్రామృతాన్ని రాయించింది. భక్తులు దాన్ని సులభంగా చదవగలరు, వినగలరు. చదువుతున్నప్పుడు, వింటున్న సమయంలో బాబాను ధ్యానించ వచ్చును. వారి స్వరూపాన్ని మనస్సులో మననం చేసుకోవచ్చు. ఈ ప్రకారంగా గురువు పట్ల విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలము. సచ్చరితామృతం రాయడం, సిద్ధం చేయడం బాబా యొక్క కటాక్షం వల్లనే సిద్ధించాయి. నేను నిమిత్తమాత్రుడిగానే ఉన్నాను.

సాయిబాబా యొక్క మాతృప్రేమ

ఆవు తన దూడను ఎలా ప్రేమిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగులు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. దూడకు కావలసినప్పుడల్లా కుడిచినా పాలు ధారగా ఉంటాయి. అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలో తల్లి గ్రహించి సకాలంలో పాలను ఇస్తుంది. బిడ్డకు గుడ్డలు తొడగడంతో, అలంకరించడంలో తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగ్గా చేస్తుంది. బిడ్డకి ఈ విషయాలు ఏవీ తెలియవు. కానీ, తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరించబడిన విధానాన్ని చూసి ఎంతో ఆనందం పొందుతుంది. తల్లిప్రేమను సరిపోల్చదగినది ఏదీలేదు. అది అసామాన్యం, నిర్వాజ్యం, సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యుల పట్ల చూపిస్తారు. సాయిబాబాకు కూడా నామీద అలాంటి ప్రేమ ఉండేది. దానికి ఈ క్రింద ఉదాహరణ ఒకటి ... 

1916వ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి రిటైర్ అయ్యాను. నాకు ఇవ్వాలని నిశ్చయించిన పించన్ కుటుంబాన్ని గౌరవంగా నడపడానికి చాలదు. గురుపౌర్ణమి రోజున ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి వెళ్ళాను. అన్నా చించణీకర్ నా గురించి బాబాతో ఇలా చెప్పారు 'దయచేసి ఈ అన్నాసాహెబు పట్ల దాక్షిణ్యాన్ని చూపించండి. వారికి వచ్చే పింఛను సరిపోదు, వారి కుటుంబం పెరుగుతుంది. వారికి ఇంకా ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించండి. వారి ఆతృతను తీసేవేసి నిశ్చింతను ప్రసాదించండి'. అందుకు బాబా ఇలా సమాధానం చెప్పారు 'వారికి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తిపడాలి. వాడి భోజనపాత్రలు ఎప్పుడూ నిండుగానే ఉంటాయి. అవి ఎప్పటికీ ఖాళీగా ఉండవు. వాడి దృష్టి అంతా నావైపు త్రిప్పుకోవాలి. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడిచిపెట్టాలి. అందరితో అణుకువగా, నమ్రతతో వుండాలి. నన్ను హృదయపూర్వకంగా పూజించాలి. వాడు ఇలా చేసినట్లయితే శాశ్వత ఆనందాన్ని పొందుతాడు. నన్ను పూజించాలి అన్న దాంట్లో ఈ 'నన్ను' అంటే ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతంలో 'సాయిబాబా ఎవరు?' అనే శీర్షిక కింద చెప్పిన దాంట్లో విశదీకరించబడింది. చూడండి.

రోహిలా కథ

రోహిలా కథ వింటే బాబా ప్రేమ ఎలాంటిదో బోధపడుతుంది. పొడువైన వాడు పొడువైన చొక్కా వేసుకుంటాడు, బలవంతుడైన రోహిలా అనేవాడు ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకుని రాత్రింబవళ్ళు ఖురానులోని కల్మాను చదువుతూ, 'అల్లాహు అక్బర్' అని ఆంబోతు రంకె వేసినట్లు గట్టిగా అరుస్తూ ఉండేవాడు. అందువలన పగలు అంతా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు రాత్రి నిద్రాభంగం, అసౌకర్యంగా ఉండేవి. కొన్నాళ్ళపాటు వాళ్ళు ఓపిక పట్టారు. చివరికి ఆ బాధ ఓర్చుకోలేక బాబా దగ్గరికి వచ్చి రోహిలా అరుపులను ఆపమని బ్రతిమిలాడారు. బాబా వారి ఫిర్యాదును వినకపోవటమే కాకుండా వారిపై కోపగించుకుని వారి పనులు వారు చూసుకోవాల్సిందే కానీ రోహిలా జోలికి వెళ్ళవద్దని మందలించారు. 'రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య ఉండేదని, ఆమె గయ్యాళి అని, ఆమె వచ్చి రోహిలాను తనని బాధ పెడుతుందని, రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుందని' బాబా చెప్పారు. నిజంగా రోహిలాకు భార్యే లేదు. భార్య అంటే దుర్బుద్ధి అని బాబా భావం. బాబాకు అన్నింటికంటే దైవప్రార్థన పట్ల అమితమైన ప్రేమ. అందుకే రోహిలా తరపున వాదించి ఊరిలోని వాళ్ళని ఓపికతో ఓర్చుకుని ఆ అసౌకర్యాన్ని సహించవలసిందే అని, అది తగ్గిపోతుందని బాబా బుద్ధి చెప్పారు.

బాబా యొక్క అమృతతుల్యమైన పలుకులు

ఒకరోజు మధ్యాహ్న హారతి పూర్తయిన తరువాత భక్తులు అందరూ తమతమ ఇళ్ళకు వెళుతుండగా అప్పుడు వారికీ బాబా ఈ విధంగా చక్కని ఉపదేశం ఇచ్చారు 'మీరు ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా నాకు తెలుస్తూనే ఉంటుందని జ్ఞాపకం పెట్టుకోండి. నేను అందరి హృదయాలను పాలించేవాడిని. అందరి హృదయాలలో నివశించేవాడిని. నేను ప్రపంచంలో ఉన్న చరాచర జీవకోటిలను ఆవరించుకుని ఉన్నాను. ఈ జగత్తును నడిపించేవాడిని, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణమూలా సామరస్యాన్ని నేనే, ఇంద్రియ సంచాలకుడిని నేనే. సృష్టిస్థితిలయకారుడిని నేను. ఎవరయితే తమ దృష్టిని నావైపు త్రిప్పుకుంటారో వారికి ఎటువంటి హానిగాని, బాధగాని కలగదు. నన్ను మరిచిపోయిన వారిని మాయ శిక్షిస్తుంది. పురుగులు, చీమలు తదితర దృశ్యమాన చరాచరజీవకోటి అంతటా నా శరీరమే, నా రూపమే.' ఈ అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, గురుసేవలోనే నిమగ్నం కావాలని నిశ్చయించుకున్నాను. కాని, అన్నా చించణీకారు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానం నా మనస్సులోనే ఉండిపోయింది. అది జరుగుతుందా లేదా అని సందేహం కలుగుతుంది. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యాలయ్యాయి. నాకొక సర్కారు ఉద్యోగం లభించింది. కాని అది కొద్దికాలం వరకే. ఆపై వేరే పని ఏదీ చేయకుండా శ్రీసాయి సేవకే నా జీవితమంతా అర్పించాను. ఈ అధ్యాయం ముగించేముందు చదివే వారికి నేను చెప్పేది ఏమిటంటే బద్ధకం, నిద్ర, చంచల మనస్సు, దేహంపై అభిమానం మొదలైన వాటిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పుకోవాలి. వారి ప్రేమ సహజంగా ఉండాలి. వారు భక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకుందురు గాక. వేరే మార్గం అవలంభించి అనవసరంగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గాన్ని తొక్కెదరుగాక! అంటే శ్రీసాయి కథలను విందురుగాక! ఇది వారి అజ్ఞానాన్ని నశింప చేస్తుంది. మోక్షాన్ని సంపాదించి పెడుతుంది. లోభి ఎక్కడ ఉన్నా వాడి మనస్సు తాను పాతిపెట్టిన సొత్తు మీదే ఉన్నట్లుగా, బాబాను కూడా అందరూ తమ హృదయాలలో స్థాపించు

కొందురుగాక!

మూడవ అధ్యాయం సంపూర్ణం

 

నాలుగవ అధ్యాయం

0 Comments To "Saibaba Satcharitra 3 Adhyayam"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!